మామిళ్లగూడెం, జూన్ 24: నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తే చట్టపరమైన కఠినచర్యలు తప్పవని, నకిలీల పేరుతో వ్యాపారం చేసి రైతులకు మోసం చేస్తే ఉపేక్షించేంది లేదని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ హెచ్చరించారు. శుక్రవారం పోలీస్ కమిషనరేట్లో పోలీస్ అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. పోలీస్స్టేషన్ వారిగా వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయంతో విసృ్తతంగా పర్యటించి విత్తనాలు, ఎరువుల షాపులను తనిఖీ చేయాలని ఆదేశించారు. పంటల సీజన్ పరిస్థితులను అవకాశంగా తీసుకుని అక్రమారులు రైతులను దోపిడీ చేయకుండా పోలీసు, వ్యవసాయశాఖలు సంయుక్త ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రత్యేక కార్యాచరణకు ఉపక్రమించిందన్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం కానుండటంతో అన్నదాతలకు అండగా నిలుస్తూ విత్తనాలు అక్రమంగా నిల్వ చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై నిఘా పెట్టాలని ఆదేశించారు.
విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాల్లో అక్రమాలు, నకిలీ దందాలను కట్టడి చేయాలని సూచించారు. ప్రధానంగా నకిలీ విత్తనాల తయారీ కేంద్రాలు, అక్రమ రవాణా మార్గాలపై దృష్టి సారించారని, ఇతర రాష్ట్రాల్లో నకిలీ విత్తనాలు తయారు చేసే ముఠాలు అకడి నుంచి జిల్లాలోకి తరలించకుండా జిల్లాల్లోని సరిహద్దు ప్రాంతాలపై అధికారులు పటిష్ట నిఘా పెట్టారని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా విత్తనాలు, పురుగుమందులు, ఎరువుల దుకాణాలపై గత రెండు రోజులుగా విసృ్తతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యవసాయ సీజన్ రోజుల్లో ప్రత్యేక బృందాల ద్వారా మరింత విసృ్తతంగా దాడులు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నామన్నారు. షాపుల యజమానులు తప్పనిసరిగా రికార్డులు నిర్వహించాలన్నారు.
రైతులకు నకిలీ విత్తనాలు నాసిరకం ఎరువులు ఎవరైనా విక్రయిస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను, ఎరువులను విక్రయించి వారి ఉన్నతికి తోడ్పడాలని ఫెర్టిలైజర్ షాప్స్, విత్తనాలు అమ్మకం చేసే దుకాణదారులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. నకిలీ విత్తనాలు నాసిరకం ఎరువులు ఎవరైనా అమ్మిన, సరఫరా చేసిన, కొనుగోలు చేసిన ఎటువంటి సమాచారం తెలిసిన స్థానిక పోలీస్ అధికారులకు లేదా డయల్ 100కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శభరీష్, అడిషనల్ డీసీపీ లా ఎండ్ ఆర్డర్ సుభాష్ చంద్రబోస్, డీఈఎస్ నాగేంద్రరెడ్డి, ఏసీపీలు బస్వారెడ్డి, ప్రసన్నకుమార్, రామోజీ రమేశ్, సీఐలు పాల్గొన్నారు.