ఖమ్మం వ్యవసాయం, జూన్ 24 : మూస పద్ధతిలో వరి సాగు చేస్తే లాభాలు స్వల్పం.. కలుపుతీత, కూలీ ఖర్చులు అధికం.. పంట చేతికొచ్చే నాటికి రైతులకు నిరాశ.. ఇలాంటి పరిస్థితి నుంచి రైతులను గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెద్దజల్లే పద్ధతిని ప్రోత్సహిస్తున్నది.. సత్ఫలితాలు వస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ప్రతి క్లస్టర్లో కనీసం 50 ఎకరాల్లో వెదజల్లే పద్ధతి అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నది.. ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఐదేళ్ల నుంచి ప్రతి సీజన్లో రైతులు 20 నుంచి 30 వేల ఎకరాల్లో ఈ పద్ధతిలోనే వరి సాగు చేస్తున్నారు.. ఇక్కడి వ్యవసాయక్షేత్రాలను పొరుగు జిల్లాలకు చెందిన రైతులు వచ్చి పరిశీలిస్తున్నారు.. సాగులో మెలకువలు తెలుసుకుంటున్నారు.. ఈ సాగు విధానంపై ప్రత్యేక కథనం.
నారు, నాటు లేకుండా వరి సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఖమ్మం జిల్లా రైతులు. వెదజల్లే పద్ధతిలో జరిగే ఈ కరివెద సాగు విధానంలో సత్ఫలితాలను గమనించిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇక నుంచి ప్రతి క్లస్టర్లోని 50 ఎకరాల్లో తప్పనిసరిగా ఈ విధానంలో సాగు చేపట్టాలని నిశ్చయించింది. ముందుగానే పంట చేతికి వస్తుండడం, సాగు నీరు ఆదా కావడం, కూలీల కొరత ఇబ్బంది లేకపోవడం, పైగా.. ఎకరానికి రూ.10 వేలకుపైగా అదనపు ఆదాయం రావడం వంటివి ఈ విధానంలో చేకూరే అదనపు ప్రయోజనాలు. కాగా, ఇదే విధానాన్ని ఖమ్మం జిల్లా రైతులు గడిచిన ఐదేళ్లుగా అమలు చేస్తోంది.కరివెద విధానంలో జిల్లాలోని మెట్ట, మాగాణిలో సాగవుతున్న ఈ పంట విస్తీర్ణం అంచెలంచెలుగా పెరుగుతోంది.
సీజన్ ఆరంభంలో ఆశించిన మేర వర్షపాతం నమోదు కాని సమయంలో జిల్లా కృషి విజ్ఞాన శాస్త్రవేత్తల సలహాలు సూచనల మేరకు దాదాపు 10 వేల మంది రైతులు ఈ పద్ధతి ద్వారా వరి సాగు చేస్తున్నారు. కొందరు రైతులు ఆవిటి మొదట్లోనే దున్నిన దుక్కుల్లో విత్తనాలు చల్లి సాగు ప్రారంభించారు. మరికొందరు రైతులు దమ్ము చేసిన పొలాల్లో నానబెట్టిన విత్తనాలు చల్లుతున్నారు. ఎదబెట్టే యంత్రాల సాయంతోనూ విత్తనాలు నాటుతున్నారు. అనంతరం కురిసిన వర్షాలను సద్వినియోగం చేసుకొని ఆశించిన దానికంటే అధికంగా దిగుబడులు రాబడుతున్నారు. ఐదేండ్ల క్రితం వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు గొర్ల సత్తిరెడ్డితో ప్రారంభమైన ఈ సాగు.. నేడు వేలాది మంది రైతులకు ఆదర్శమైంది. అన్నదాతల ఆసక్తిని గమనించిన వ్యవసాయశాఖ అధికారులు, వైరా కేవీకే శాస్త్రవేత్తలు మరింత అవగాహన కల్పిస్తున్నారు. ఇతర మండలాల రైతులను సైతం ఫీల్డ్ విజిట్ చేయించి మరీ అవగాహన కల్పిస్తుండడం విశేషం.
వెదసాగు చేసే విధానం ఇలా..
సాధారణంగా వరిసాగులో దమ్ముచేసి కూలీలతో నాట్లు వేయించడం, నాటే యంత్రాలతో వరినాట్లు వేసుకోవడం, దమ్ముచేసిన పొలంలో డ్రమ్సీడర్ పద్ధతి ద్వారా విత్తుకోవడం, వెదజల్లే పద్ధతి ద్వారా విత్తుకోవడం వంటి విధానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే చెరువులు, బావుల కింద దమ్ముకు సరిపడా నీరు అందుబాటులో లేని సమయంలో వెదజల్లే పద్ధతి ద్వారా సాగు చేసుకోవచ్చు. ఇలా సాగు చేయాలంటే సీజన్ ఆరంభంలోనే పొడి దుక్కులు దున్నుకొని నేరుగా గానీ, సీడ్ డ్రిల్తో గానీ విత్తుకోవచ్చు. 1001, బీపీటీ 5204, 1156 వంటి రకాల వరి విత్తుకోవచ్చు. ఎకరానికి 14 – 16 కిలోల విత్తనాలు అవసరం. తొలుత 30 సెంటీమీటర్ల లోతు ఉండే విధంగా సాలు వెనుక సాలు దున్నుకోవాలి. అనంతరం విత్తనాలు నాటిన తదుపరి ఎకరానికి ఒక లీటర్ నీటిలో సరిపడా పెండీమిథాలిన్ అనే కలుపుమందును పిచికారీ చేసుకోవాలి. 20 – 25 రోజుల వ్యవధిలో కలుపు ఉధృతిని బట్టి బిస్పైరీ, బాక్ సోడియం మందులో కలుపుకొని ఎకరానికి 100 – 120 మి.లీ పిచికారీ చేయాలి.
సాగు నీటి ఆదా.. కూలీల కొరతకు చెక్..
సంప్రదాయ వరిసాగుతో పోల్చుకుంటే వెదజల్లే పద్ధతి ద్వారా సాగు రైతులకు అనేక ప్రయోజనాలున్నాయి. తక్కువ వర్షపాతం నమోదైన సందర్భంలో పంటకాలం కోల్పోకుండా సకాలంలో వరి సాగు చేసుకునేందుకు మార్గం సుగమమవుతుంది. తద్వారా రెండో పంటనూ సకాలంలో సాగు చేసుకోవచ్చు. సీజన్లో ఒకేసారి వరినాట్లు ప్రారంభం అవుతుండడంతో కూలీల కొరత తీవ్రంగా ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా కూలీల కొరతను అధిగమించవచ్చు. తద్వారా పెట్టుబడి తగ్గుతుంది. లాభాలు పెరుగుతాయి. రసాయనిక, క్రిమిసంహారక మందుల వాడకం కూడా తగ్గించుకోవచ్చు. సాగు ప్రారంభమైన తరువాత అడపాదడపా వచ్చే జల్లులతో పంటను కాపాడుకునేందుకు ఆస్కారం ఉంటుంది. నారుమడుల నిర్వహణ భారం ఉండదు. ఖర్చులు తగ్గుతాయి.
నాలుగు పద్ధతుల్లో వరి సాగు
సంప్రదాయ పద్ధతితోపాటు ట్రాన్స్ప్లాంటేషన్, డ్రమ్సీడ్, వెదజల్లే పద్ధతి ద్వారా వానకాలం, యాసంగి సీజన్లలో సాగు చేస్తున్నారు. ఈ యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 2.07 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. వీటిలో వెద్దజల్లే పద్ధతి ద్వారా 10,300 మంది రైతులు 30 వేల ఎకరాలు, 4 వేల మంది రైతులు డ్రమ్సీడ్ పద్ధతి ద్వారా 6,908 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతూనే ఉంది.
ప్రతి క్లస్టర్లో 50 ఎకరాలు తప్పనిసరి
ప్రతి క్లస్టర్లో కనీసం 50 ఎకరాలకు తగ్గకుండా వెదజల్లే పద్ధతి ద్వారా సాగు చేయించాలనేది ఈ ఏడాది వ్యవసాయ శాఖ లక్ష్యం. కొన్నేళ్లుగా జిల్లా వ్యాప్తంగా ప్రతి సీజన్లో 20 30 వేల ఎకరాలల్లో ఇదే పద్ధతి అనుసరించి జిల్లా రైతులు సాగు చేస్తున్నారు. తద్వారా మంచి ఫలితాలు పొందుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెంచాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది. కరివెద పద్ధతి సాగుపై అవగాహన కోసం పొరుగు జిల్లాల రైతులు కూడా క్షేత్రస్థాయి సందర్శన కోసం మన జిల్లాకు వస్తున్నారు.
–ఎం.విజయనిర్మల, డీఏవో, ఖమ్మం