లక్ష్మీదేవిపల్లి, జూన్ 23:ఎనిమిదో విడత హరితహారానికి అధికార యంత్రాంగం సిద్ధమైంది. వానకాలం ప్రారంభమవడంతో అధికారులు మొక్కలు నాటే కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ఏడు విడతలుగా విజయవంతంగా కొనసాగింది. ఈ ఏడాది భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 2,21,00,000 మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. మొదటి మూడు విడతల్లో నాటిన మొక్కల్లో చనిపోయిన వాటి స్థానంలో కొత్తవి నాటనున్నారు. మొక్కల సంరక్షణకు ఇప్పటికే గ్రామాల్లో హరిత కమిటీలను ఏర్పాటు చేశారు. నర్సరీల్లో పెరిగిన మొక్కలను ఇంటింటికీ, అవెన్యూ ప్లాంటేషన్కు అందించనున్నారు.
2.21 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం
8వ విడత హరితహారంలో జిల్లావ్యాప్తంగా 2,21,00,000 మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ణయించింది. అన్ని ప్రభుత్వశాఖల అధికారులు తమకు కేటాయించిన లక్ష్యాల మేరకు మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గతంలో నాటిన మొక్కలు కాకుండా ఈసారి వేరే మొక్కలు నాటించనున్నారు. నర్సరీలలో పండ్ల మొక్కలనూ నాటేందుకు సిద్ధమవుతున్నారు. మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో 88.34 లక్షల మొక్కలు, డీఆర్డీఏకు 80 లక్షలు, ఉద్యానశాఖకు 10 లక్షలు, సింగరేణికి 11 లక్షలు, మున్సిపాలిటీలకు 4.77 లక్షలు, టీఎస్ ఎఫ్డీసీకి 6.10 లక్షల మొక్కలు నాటే లక్ష్యం ఉన్నది. ఇప్పటికే అధికారులు నాటే ప్రదేశాలను గుర్తించారు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటనున్నారు. పల్లె ప్రకృతి వనాల్లోనూ విరివిగా మొక్కలు నాటుతారు.
ప్రతిష్ఠాత్మకంగా కార్యక్రమం..
హరితహారాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసేందుకు కలెక్టర్ అనుదీప్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. మొక్కలు నాటడం, సంరక్షణపై తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమానికి మొక్కలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అవెన్యూ ప్లాంటేషన్ను విజయవంతం చేయాలని, మునుపటి కంటే ఎక్కువ మొక్కలు నాటాలని సూచించారు. అవసరమైన చోట మల్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషనూ చేపట్టాలన్నారు. సిబ్బంది మొక్కలు నాటడంతో పాటు వాటి సరంక్షణపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. మొక్కల సంరక్షణపై అశ్రద్ధ వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హరితహారానికి ఏర్పాట్లు చేస్తున్నాం..
8వ విడత హరితహారానికి సర్వం సిద్ధం చేస్తున్నాం. ప్రభుత్వం ఈ ఏడాది 2.21 కోట్ల మొక్కలను నాటే లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని సాధించడమే కాకుండా అంతకంటే ఎక్కువ మొక్కలను నాటేందుకు కృషి చేస్తున్నాం. మొక్కలు ఎవరు అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే అవసరమైన మొక్కలు నర్సరీల్లో సిద్ధంగా ఉన్నాయి. మొక్కల సంరక్షణను ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. అప్పుడే మొక్కలు బతుకుతాయి. ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. ప్రతి ఇంట్లో మొక్కలు నాటాలి. దీనిద్వారా వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చు. ఇంటి ముందు పచ్చదనం ఉంటే ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలి.
-ఐ.రంజిత్కుమార్, జిల్లా అటవీశాఖ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం
‘వైల్డ్లైఫ్’ విభాగానికి 11.60 లక్షల లక్ష్యం
ఎనిమిదో విడత హరితహారంలో ప్రభుత్వం పాల్వంచ డివిజన్ వైల్డ్లైఫ్ విభాగానికి 11.60 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇప్పటికే పాల్వంచ వైల్డ్లైఫ్ కార్యాలయం, మొండికట్ల, గట్టుమళ్ళ, బంగారు చెలక, ఆళ్లపల్లి, మర్కోడు నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో లక్ష వెదురు మొక్కలు మిగిలినవి ఔషధ మొక్కలు ఉన్నాయి. ఇవి కాక ఏగిస, వేప, కానుగ, చింత, మర్రి, రావి, నెమలినార, నార ఏప, పూసుగ, నల్లమద్ది, తెల్లమద్ది, అడవి మామిడి, నేరేడు, చింత, రోజ్ఉడ్, మారేడు, ఉసిరి మొక్కలు ఉన్నాయి. మొక్కలు నాటేందుకు, వాటిని సంరక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వైల్డ్లైఫ్ ఎఫ్డీవో దామోదర్రెడ్డి తెలిపారు.