బోనకల్లు, జూన్ 23 : బాల్బ్యాడ్మింటన్ పేరు చెప్పగానే ఠక్కుమని గుర్తుకొచ్చేది బోనకల్లు క్రీడాకారులే. ఎక్కడ పోటీల్లో పాల్గొన్నా పతకాల పంట పండాల్సిందే. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయస్థాయిల్లో పాల్గొని సత్తా చాటుతున్నారు. స్టార్ ఆఫ్ ఇండియా అవార్డులు సొంతం చేసుకొని జిల్లా ఖ్యాతిని చాటుతున్నారు. కటిక పేదరికమైనా ఆటలపై మక్కువతో విజయమే లక్ష్యంగా సాధన చేస్తూ ముందుకు సాగుతున్నారు. పతకాలు సొంతం చేసుకుంటున్నారు. బాల్బ్యాడ్మింటన్ క్రీడకు పుట్టినిల్లుగా బోనకల్లు గ్రామం విరాజిల్లుతోంది. పరిసర గ్రామాల క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో పాల్గొని క్రీడానైపుణ్యాన్ని ప్రదర్శించి స్టార్ ఆఫ్ ఇండియా అవార్డులను సొంతం చేసుకున్నారు. విద్యతోపాటు క్రీడల్లోనూ రాణిస్తూ ఆణిముత్యాల్లా పేరు ప్రఖ్యాతులు సాధించారు.
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన బాల్బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అమరేషు లింగయ్య క్రీడపై మక్కువతో 26 ఏళ్ల నుంచి బాల్బ్యాడ్మింటన్ క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నారు. తాను సీనియర్ క్రీడాకారుడిగా తర్ఫీదు పొంది 1979 నుంచి క్రీడల్లో పాల్గొని పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. అదే అనుభవంతో క్రీడపై మక్కువతో 1997 నుంచి కోచ్గా ఎన్నో విజయాలు సాధించేందుకు లింగయ్య కృషిచేశారు. అంతేకాకుండా తన ప్రయాణాన్ని యథావిధిగా క్రీడల వైపు మళ్లించాడు. ఒక చిన్న రికార్డింగ్ సెంటర్ పెట్టుకొని జీవనం సాగించేవారు. క్రీడాకారులను దగ్గరకు తీసుకొని వారికి కోచింగ్ ఇస్తూ బాల్బ్యాడ్మింటన్ను మరింత బలోపేతం చేశాం. బోనకల్లుకు చెందిన చావా వెంకటేశ్వరరావు, జక్కా నాగభూషణం, రిటైర్డు హెచ్ఎం కే.వీరయ్య, పైడిపల్లి కిశోర్తోపాటు మరికొంతమంది శాంతిస్నేహ యూత్ను ఏర్పాటు చేసుకున్నారు.
300 మందిని తీర్చిదిద్దిన ఘనత..
ఇప్పటి వరకు 300 మందికి పైగా బాలబాలికల విభాగాల్లో క్రీడాకారులను తీర్చిదిద్దిన ఘనత ఈ లింగయ్యకే దక్కింది. ప్రాథమిక స్థాయిలో అపజయాల పాలైనా వెనుదిరగక సాధన చేస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. దీంతో బోనకల్లు బాల్బ్యాడ్మింటన్కు పుటినిల్లుగా మార్చిన ఘనత కూడా ఆయనకే దక్కింది. డబ్బుతోనే శిక్షణ ఇస్తున్న ఈ రోజుల్లో రూపాయి కూడా ఆశించకుండా బాల్బ్యాడ్మింటన్ క్రీడను నేర్పిస్తున్నాడు. తగు సమయాన్ని కేటాయిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలిచాడు.
పతకాలు.. అవార్డులు..
దాతల సహకారంతో ఈ క్రీడాకారులు మొట్టమొదటగా 2007లో ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయ్పూర్లో జరిగిన సబ్ జూనియర్ జాతీయస్థాయి పోటీల్లో బోనకల్లు క్రీడాకారులు ఏడుగురు పాల్గొని చాంపియన్షిప్ సాధించారు. ఇదే స్ఫూర్తితో బోనకల్లు క్రీడాకారులు నూతన ఉత్తేజంతో నాటి నుంచి నేటి వరకు పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నారు. బాలికల విభాగంలో ప్రతి జట్టులో బోనకల్లు క్రీడాకారులే ఖమ్మం జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చారు. సీనియర్ క్రీడాకారుల్లో అమరేషు ఉమారాణి 24 సార్లు జాతీయస్థాయి టోర్లమెంట్లో పాల్గొన్నది. అదేవిధంగా నిరోషా 18 సార్లు, భుక్యా ఉమ 15 సార్లు, వరికూటి వీరబాబు 10 సార్లు, శివకృష్ణ, నరేశ్, వెంకటస్వామి, ఎన్.గోపి, డీ.ఉపేందర్, సీ.గోపి 10 సార్లు టోర్నమెంట్లో పాల్గొన్నారు. చదువులోనూ రాణిస్తున్నారు. ఉన్నత విద్యను పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు. స్టార్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా బెస్ట్ ప్లేయర్ అవార్డులు సైతం ఈ క్రీడాకారులు సొంతం చేసుకున్నారు.
స్టార్ ఆఫ్ ఇండియా అవార్డులను 2009లో భూక్యా ఉమ మహారాష్ట్రలోని చంద్రాపూర్ జూనియర్ విభాగంలో, జే.శివకృష్ణ 2007లో ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో సబ్ జూనియర్లో, టీ.రమేశ్ 2007 ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో సబ్ జూనియర్, ఎన్.గోపి నాలుగు సార్లు స్టార్ ఆఫ్ ఇండియా అవార్డులను దుల్ఫూర్, కడప, చేలు, హర్యానాలో పొందారు. అంతర్జాతీయ క్రీడల్లో భూక్యా ఉమ నేపాల్లో, కూకట్పల్లిలో జరిగిన ఇండియా వర్సెస్ శ్రీలంక టోర్నమెంట్ డీ.గోపి, బీ.ఉపేంద్ర అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎంపికై రాణించారు. ఇటీవల జరిగిన అన్ని టోర్నమెంట్లలో విజయదుందుభి మోగిస్తూ జిల్లాకే ఆదర్శంగా నిలిచారు.
బోనకల్లు జట్టుదే ప్రాతినిథ్యం..
ఇప్పటి వరకూ ఎక్కడ బాల్బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరిగినా బోనకల్లు క్రీడాకారులు ఆ జట్టులో ప్రథమ క్రీడాకారులుగా ఉంటూ జిల్లా, రాష్ట్ర, జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరంతా పేద కుటుంబాల్లో జన్మించినప్పటికీ బాల్బ్యాడ్మింటన్పై మక్కువతో పలు చోట్ల జరిగిన క్రీడాపోటీల్లో పాల్గొని నైపుణ్యాన్ని ప్రదర్శించి ఆదర్శంగా నిలుస్తున్నారు.