అన్నపురెడ్డిపల్లి, జూన్ 23: రైతులందరూ ఆయిల్పాం సాగు వైపు దృష్టి సారించాలని ఉద్యానవన శాఖ రాష్ట్ర ఉప సంచాలకుడు మధుసూదన్ సూచించారు. రాష్ట్రంలో ఈ ఏడాది 2 లక్షల ఎకరాల్లో ఆయిల్ పాం సాగు చేయడమే లక్ష్యమని, రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలో సుమారు 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పాం సాగుకు చర్యలు చేపట్టామని వివరించారు. మండలంలోని తాటి బుచ్చన్నగూడెంలో ఆయిల్పాం వ్యవసాయ క్షేత్రాన్ని జిల్లా ఉద్యానశాఖ అధికారి మరియన్నతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. ఆయిల్పాం మొక్కను నాటి, డ్రిప్ ఇరిగేషన్ పరికరాల పనితీరును అడిగి తెలుసుకొన్నారు. అనంతరం అన్నపురెడ్డిపల్లి రైతువేదికలో నిర్వహించిన సమావేశంలో మధుసూదన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్పాం సాగుకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మొక్కలు, ఎరువులు, డ్రిప్ పరికరాలను సబ్సిడీతో అందిస్తుందన్నారు. జిల్లాలో ఆయిల్ ఫెడ్, గోద్రేజ్ కంపెనీ నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నట్లు చెప్పారు. జిల్లాలో అత్యధికంగా ఆయిల్పాంను సాగు చేసి రాష్ర్టానికి ఆదర్శంగా నిలపాలన్నారు. అనంతరం బుచ్చన్నగూడెంలోని గోద్రెజ్ కంపెనీ ఆయిల్పాం నర్సరీని పరిశీలించారు.