మణుగూరు రూరల్, జూన్ 21 : ఆయనో ఆదర్శ రైతు… వ్యవసాయం అంటే మక్కువ. పొద్దున నిద్రలేచిన దగ్గర్నుంచి రాత్రి వరకు పొలం, చెలకతోనే ఆయన చెలిమి. సాగులో నూతన ఒరవడి సృష్టించి కొత్త కొత్త ప్రయోగాలు చేసి అధిక దిగుబడులు సాధించి తోటి రైతులను చైతన్యవంతులను చేస్తున్నాడు. నేలతల్లిని నమ్ముకున్న వారు పట్టుదలతో శ్రమిస్తే నష్టపోరని నిరూపిస్తూ… రసాయనాలకు దూరంగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాడు మణుగూరు మండలం రామానుజవరానికి చెందిన రైతు. వ్యవసాయాధికారుల సలహాలు, సరికొత్త పద్ధతులను పాటిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న జూపల్లి ముత్తయ్యపై ప్రత్యేక కథనం.
1992 నుంచి తనకున్న మూడున్నర ఎకరాల్లో వరిసాగు, ఆకుకూరలు సాగు చేస్తున్నాడు. తొలిదశలో నష్టాలు చవిచూసిన ముత్తయ్య క్రమక్రమంగా వ్యవసాయాధికారుల సలహాలు పాటిస్తూ సాగులో సరికొత్త విధానాలను అవలంబించడం ఆరంభించాడు. విత్తనమేళా, రైతు సదస్సులకు హాజరై అన్నింటినీ పరిశీలించి ప్రయోగాత్మకంగా 1.20 ఎకరాల మెట్ట భూమిలో వరిసాగు, 1.35 ఎకరాల్లో తీగజాతి కూరగాయలతోపాటు అంతరపంటలు వేస్తున్నాడు. పండిన పంటను మార్కెట్లో దుకాణాలు, ఇండ్లవద్దకు వెళ్లి విక్రయించడంలో సఫలీకృతమయ్యాడు.
2007లో పాల్వంచలో జరిగిన వ్యవసాయ రైతు సదస్సులో పాల్గొని పంటలు వాటి పద్ధతులపై తనకున్న సందేహాలను నివృత్తి చేసుకుని అన్నిరకాల కూరగాయల సాగుపై అవగాహన పెంచుకున్నాడు. అప్పటి నుంచి సాగులో కొత్త మెళకువలు అవలంబిస్తూ… లైన్ సోయింగ్ విధానం(తక్కువ భూమిలో ఎక్కువ రకాలు పండించే విధానం)తో ముందుకు సాగుతూ… సాగులో సేంద్రియ విధానంపై అవగాహన పెంచుతూ అందరినీ చైతన్యవంతులను చేస్తున్నారు. లాభాలు గడిస్తూ ముందుకు సాగుతున్నారు. ఒక ఏడాదిలో జూన్ నుంచి నవంబర్ వరకు తీగజాతికి చెందిన బిన్నీస్, చిక్కుడు, కాకర, బీర, దొండకాయ, సోరకాయ, కీరదోసతోపాటు అంతరపంటగా ముల్లంగి, కొత్తిమీర, బచ్చలకూర, తోటకూర, గొంగూర, పాలకూర, కరివేపాకు, మొక్కజొన్న, ములగ తదితర పంటలను సేంద్రియ విధానంలో సాగు చేస్తారు. రోజూ ఉదయం 10గంటల కల్లా మణుగూరుతో పాటు ఇతర మార్కెట్లకు తాజా కూరగాయలు అందించి నాన్ గ్రేడింగ్ కూరగాయలు అందించే హోల్సేల్, రిటైల్గా మార్కెట్లోని కూరగాయల దుకాణాలకు అందించడంతో పాటు మార్కెట్లో, వారాంతపు సంతలలో నేరుగా ప్రజలకు తాజా కూరగాయలు అమ్ముతూ ముత్తయ్య ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించి అందరికీ ఆదర్శవంతమైన రైతుగా పేరుపొందాడు.
అందుకున్న అవార్డులివీ…
2007లో పాల్వంచలో పంటలపై జరిగిన అవగాహన సదస్సులో సాగు సంరక్షణ విధానంపై చర్చించడంపై ఆదర్శ రైతు అవార్డును అప్పటి మంత్రిగా ఉన్న వనమా వెంకటేశ్వరరావు చేతులీమీదుగా అందుకున్నారు.
2015లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేతులమీదుగా ఉత్తమ రైతు అవార్డుతోపాటు ప్రశంసాపత్రం అందుకున్నారు.
2021 డిసెంబర్ 23న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతులమీదుగా సేంద్రియ సాగు విధానంపై లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సన్మానంతోపాటు అవార్డును అందుకున్నారు.
వ్యవసాయాధికారుల సలహాలు పాటిస్తున్నా..
మండల వ్యవసాయాధికారుల సలహాలు పాటిస్తూ వారి సూచనల మేరకు కూరగాయల సాగు చేస్తున్నాను. తక్కువ స్థలంలో ఎక్కువ పంటలు వేస్తూ ఆర్థికంగా పుంజుకున్నాను. సాగు అనంతరం భూసారం కాపాడుకోవడానికి సేంద్రియ విధానంపై దృష్టి పెడుతున్నాను. లైన్ సోయింగ్ విధానంతో పంట త్వరగా చేతికి వస్తున్నది. జీవనోపాధి సాఫీగా మారింది. – ముత్తయ్య, ఆదర్శ రైతు