రఘునాథపాలెం, జూన్ 20: జిల్లా రవాణా శాఖ కార్యాలయం నుంచి ఫిట్నెస్ పత్రం పొందిన తరువాతనే స్కూల్ బస్సులు రోడ్డెక్కాలని ఖమ్మం ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు సూచించారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో గత కొద్దిరోజులుగా జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి ప్రైవేటు విద్యాసంస్థల బస్సులు ఫిట్నెస్ కోసం వస్తున్నాయి.
ఈ మేరకు వచ్చిన ప్రతి బస్సునూ ఎంవీఐ వరప్రసాద్ క్షుణ్ణంగా పరిశీలించి పత్రాలను మంజూరు చేస్తున్నారు. అంతేకాకుండా.. ప్రతి బస్సునూ స్వయంగా డ్రైవ్ చేసి దాని కండిషన్ను చెక్ చేస్తున్నారు. బస్సులో ఏ ఒక్క లోపం గుర్తించినా ఫిట్నెస్కు నిరాకరిస్తున్నారు. సంబంధించిన రిపేరు చేయించుకున్నాకనే ఫిట్నెస్కు రావాలని ఆదేశిస్తున్నారు. ఈ క్రమంలో రవాణా శాఖ నిబంధనలకు అనుగుణంగా పత్రాలను మంజూరు చేస్తున్నారు. కాగా సోమవారం ఫిట్నెస్ కోసం పలు పాఠశాలలకు చెందిన బస్సులు రాగా ఎంవీఐ స్వయంగా నడిపారు. పత్రాలను పరిశీలించి అనుమతి పత్రాలను మంజూరు చేశారు.