లక్ష్మీదేవిపల్లి, జూన్ 20: లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగు పంచాయతీ మాదిగప్రోలు గ్రామానికి చెందిన దంపతులు గంగాల వెంకటేష్, రాణి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వీరి సమీప బంధువులు తెలిపిన వివరాలు.. వీరిద్దరూ పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు (పాప, బాబు) ఉన్నారు. మాదిగప్రోలు గ్రామానికే చెందిన గాజుల నగేష్.. దేవుడమ్మ పేరుతో పూజలు చేస్తున్నాడు. ఇతని వద్దకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు.
నగేష్ వద్ద వెంకటేష్-రాణి దంపతులు ఐదేళ్ల నుంచి శిష్యరికం చేస్తూ, అతడి వద్దనే ఉంటున్నారు. నగేష్ వద్దకు పూజల కోసం వచ్చే వారిని ఆటోలో వెంకటేష్ తీసుకొచ్చేవాడు. రాణి కూడా అక్కడ ఆశ్రమం (ఇల్లు) పనులు చూసుకునేది. నగేష్కు, వెంకటేష్ దంపతులకు మధ్య కొన్ని రోజులుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, వారు అక్కడి నుంచి బయటకు రావాలనుకున్నారు. జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో ఉంటున్న వెంకటేష్ పిన్ని స్వరూప ఇంటికి కొన్ని రోజుల కిందట ఆ దంపతులు, పిల్లలు వచ్చారు. అప్పటి నుంచి ఆ నలుగురూ అక్కడే ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న గాజుల నగేష్.. అక్కడికి వెళ్లి వెంకటేష్-రాణి దంపతులపై దాడి చేశాడు. ఈ నేపథ్యంలో ఆ దంపతులు శనివారం రాత్రి పురుగు మందు తాగారు.
ఆదివారం తెల్లవారుజామున రాణి(30) మృతిచెందింది. ఆమె అంత్యక్రియలు అదే రోజు పూర్తయ్యాయి. కొన్ని గంటల తరువాత.. ఆదే రోజు రాత్ర వెంకటేష్(33) మృతిచెందాడు. వారి ఇద్దరు అనాథలుగా మారారు. నగేష్ అలియాస్ దేవుడమ్మ వేధింపుల కారణంగానే వెంకటేష్-రాణి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారని వెంకటేష్ పిన్ని స్వరూప, బంధువులు ఆరోపిస్తున్నారు. లక్ష్మీదేవిపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు పోలీసులు అప్పగించారు.