ఖమ్మం, జూన్ 20 : గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆన్లైన్ షాపింగ్పై రోజురోజుకు క్రేజ్ పెరుగుతున్నది. కేవలం నగర, పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఆన్లైన్ కొనుగోళ్లు నేడు మారుమూల పల్లెలకు సైతం విస్తరించాయి. ప్రజలు ఆన్లైన్ కొనుగోళ్లపై అమితాసక్తిని కనబరుస్తున్నారు. చేతిలో ఉన్న సెల్ఫోన్లో కోరుకున్న వస్తువును బుక్ చేస్తున్నారు. ఇంటి నుంచి కదలకుండానే నచ్చిన వస్తువు ఆన్లైన్లో షాపింగ్ చేసి ఇంటికి తెప్పించుకుంటున్నారు. ఆఫర్లు, తక్కువ ధరలు చూసి వస్తువులు బుక్ చేసుకుంటున్నారు. నిత్యావసర సరుకులు మొదలుకొని అవసరాలకు అనుగుణంగా నచ్చిన బ్రాండ్తో ఉన్న వస్తువులను ఆన్లైన్ వ్యాపార సంస్థలు అందించడంతో ప్రజల వద్దకు చేరుతున్నాయి.
ఈ యేడాది కరోనా, లాక్డౌన్తో చాలామంది దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేసేందుకు ఇష్టపడలేదు. కొద్దిరోజులుగా సాధారణ పరిస్థితులు వస్తుండడంతో దుకాణాలకు వెళ్తున్నారు. అయినా ఆన్లైన్లోనే షాపింగ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. ప్రముఖ ఆన్లైన్ కంపెనీలైన అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆజీయో, స్నాప్డీల్, మింత్రా తదితర కంపెనీలు తాము అమ్మే వస్తువులను ఆన్లైన్లో ఉంచి, పలు సందర్భాల్లో కొనుగోలుదార్లకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దీంతో వినియోగాదారులు పెద్దఎత్తున ఆన్లైన్ షాపింగ్కు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలు, దుస్తులు మొదలుకొని ఏ వస్తువు ఎంత ధర, ఎంత నాణ్యతతో ఉందో వివరంగా తమ సైట్లలో అందుబాటులో ఉంచుతుండడంతో కొనుగోలుదారులు నచ్చిన వస్తువును కొనుగోలు చేస్తున్నారు.
కరోనా ప్రభావంతో పెరిగిన కొనుగోళ్లు
కరోనా కారణంగా ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లి వస్తువులను కొనుగోలు చేయడానికి భయపడుతున్న సమయంలో, ఆన్లైన్ వ్యాపారానికి మంచిరోజులు వచ్చాయి. ప్రజలు నిత్యావసర సరుకులను కొనుగోలు చేసేందుకు సైతం మొగ్గు చూపుతున్నారు. ఇంటి వద్ద నుంచే తమకు నచ్చిన వస్తువులను మొబైల్ ఫోన్లో ఎంపిక చేసుకుని ఆర్డర్లు చేస్తున్నారు. ప్రజలకు అవసరమయ్యే అన్నిరకాల వస్తువులను ఆన్లైన్ సంస్థలు అందుబాటులో ఉంచి విక్రయిస్తున్నాయి. తాము ఆర్డరు చేసే వస్తువు వచ్చిన తర్వాత డబ్బులు చెల్లించి తీసుకునే క్యాష్ అండ్ క్యారీ సదుపాయం అన్ని ఆన్లైన్ వ్యాపారసంస్థలు కల్పిస్తున్నాయి. దీంతో తీసుకున్న వస్తువులు తమకు నచ్చకుంటే తిరిగి ఇచ్చే సదుపాయాన్ని కొనుగోలుదార్లకు కల్పిస్తుండడంతో ఆన్లైన్ బిజినెస్ జోరందుకుంది. అంతేకాకుండా బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులపై ఆన్లైన్ సంస్థలు క్యాష్ బ్యాక్ ఆఫర్లతోపాటు ఈఎంఐ సౌకర్యాన్ని కల్పిస్తుండడంతో ప్రజలు ఆన్లైన్ షాపింగ్కు మొగ్గు చూపుతున్నారు.
యువతలో పెరిగిన ఆసక్తి…
ముఖ్యంగా ఆన్లైన్లో వస్తువులు కొనుగోలు చేసేందుకు యువతే ఎక్కువ శాతం ఆసక్తి చూపుతున్నారు. తమకు కావాల్సిన వస్తువులను వివిధ ఆన్లైన్ వ్యాపారసంస్థల యాప్ల ద్వారా మొబైల్ ఫోన్లో ఎంపిక చేసుకొని కొనుగోలు చేస్తున్నారు. నచ్చిన బ్రాండెడ్ వస్తువుల్లో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆట వస్తువలు, పుస్తకాలు, దుస్తులు, షూలు కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. కొనుగోలు చేసిన వస్తువులు కేవలం రెండు, మూడ్రోజుల్లో ఇంటి వద్దకు చేరుతున్నాయి. ఆన్లైన్ సంస్థలు వినియోగదార్లు కోరుకున్న సమయానికి వస్తువులను చేరవేస్తున్నాయి.
స్థానిక వ్యాపారులకు నష్టం…
ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థలు తమ వస్తువులను మారుమూల గ్రామీణ ప్రాంతాలకు అందిస్తుండడంతో స్థానిక వ్యాపారులకు శాపంగా మారింది. నచ్చిన వస్తువును మొబైల్ ద్వారా ఆన్లైన్లో కొనుగోలు చేయడం, అనుకున్న సమయానికి ఇంటి వద్దకు రావడంతో స్థానిక వ్యాపారం పూర్తిగా దెబ్బతింటుండడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. టూత్బ్రెష్లు మొదలుకొని టీవీలు, ఫ్రిజ్లు, వాషింగ్మిషన్లు, టూ వీలర్ వరకు కొనుగోలు చేస్తుండడంతో గిరాకీ లేక దుకాణాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలోనే కరోనా వైరస్ కారణంగా దుకాణాల కొనుగోళ్లు చాలా తగ్గిపోయాయి. చిన్నచిన్న మండల కేంద్రాల్లో ఉన్న వ్యాపారం పూర్తిగా తగ్గిపోగా భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుందని చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలా బుక్ చేస్తే.. అలా ఇంటికే..
కాలంతోపాటు రోజులు ఎంతలా మారిపోయాయి. ఒకప్పుడు ఏది కావాలన్న పట్టణాలకు వెళ్లి కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం కూర్చున్న దగ్గరే నుంచే మనకు అవసరమైన వస్తువును ఆన్లైన్లో షాపింగ్ చేసి బుక్చేస్తే, నేరుగా హోం డెలివరీ చేస్తున్నారు. స్మార్ట్ఫోన్ అరచేతిలో ఉంటే చాలు కావాల్సిన వస్తువులు నేరుగా ఇంటికి వచ్చేస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, స్నాప్డీల్ వంటి యాప్ల్లో పార్ట్టైమ్ ఉద్యోగాలు చేసుకుంటూ, ఆన్లైన్లో బుక్ చేసుకున్న వస్తువులను నేరుగా ఇంటికి తెచ్చి అందిస్తున్నారు. ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేస్తున్న వారు ప్రతిరోజు లక్షల రూపాయలకు సంబంధించిన వస్తువులు హోం డెలివరీ చేస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్ చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది.