పెనుబల్లి, జూన్ 17: కల్లూరు మండలం గోపాలదేవ బోయినపల్లిలో గురువారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో మండలంలోని మండాలపాడుకు చెందిన ఇడుపులపాటి కౌశిక్ (15), చాట్ల కార్తీక్ (17) మృతిచెందిన సంగతి తెలిసిందే. మంచి స్నేహితులు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసే వెళ్లేవారు. కలిసి ఆడుకునే వారు. ఒకరిని విడిచి ఇంకొకరు ఉండేవారు కాదు. తల్లిదండ్రులకు పొలం పనుల్లో సాయం చేసేవారు. ఇంటి పనులకు తోడ్పడేవారు. గురువారం వీరిద్దరూ కల్లూరు మండలంలోని చెన్నూరులో జరిగిన శుభకార్యానికి వెళ్లి అనంత లోకాలకు చేరుకున్నారు.
వారి మృతదేహాలకు శుక్రవారం పెనుబల్లి ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం కుటుంబ సభ్యులు మృతదేహాలను స్వగ్రామానికి తీసుకువచ్చారు. వాహనం గ్రామానికి ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. ‘నాన్న స్కూలుకు వెళ్తాను.. బ్యాగ్ తీసుకురా.. నాన్న తెచ్చేలోపే మమ్మల్ని వదిలిపోయావా?.’ అని పదోతరగతి చదవుతున్న కౌశిక్ తల్లి గుండెలవిసేలా రోదించింది.. ‘కొండంత అండగా నిలుస్తావనుకుంటే వదిలేసి వెళ్లిపోయావా..’ అంటూ కార్తీక్ తల్లి విలపించిన తీరు చూపరులు కంటతడి పెట్టించింది. ‘ఇద్దరి స్నేహాన్ని ఓర్వలేని విధి తొందరగా వాళ్లని తీసుకెళ్లింది..’ అని గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామంలో ఉద్విగ్న వాతావరణం నెలకొన్నది.
ఎమ్మెల్యే సండ్ర పరామర్శ..
గోపాలదేవ బోయినపల్లిలో గురువారం రోడ్డు ప్రమాదం సంభవించిన సమయం నుంచి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య క్షతగాత్రులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఖమ్మంలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు సూచించారు. శుక్రవారం పెనుబల్లి ప్రభుత్వ వైద్యశాలలో కౌశిక్, కార్తీక్ మృతదేహాలకు పోస్ట్మార్టం చేయించారు. అనంతరం మండాలపాడు గ్రామానికి వచ్చి వారి మృతదేహాలకు నివాళి అర్పించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు.