కూసుమంచి, జూన్ 6: తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో ముందంజలో ఉన్నందుకే కుట్ర పన్నుతోందని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.75 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు చెప్పారు. కూసుమంచి మండలం నాయకన్గూడెంలో మాజీ సర్పంచ్ కంచర్ల వీరారెడ్డి ఇంటి వద్ద సోమవారం ఆయన టీఆర్ఎస్ నాయకులతో మాట్లాడారు. అనేక విషయాల్లో తెలంగాణ రాష్ట్రం అవసరాలను గుర్తు చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు. కేంద్ర నుంచి రావాల్సిన నిధుల కోసం కేంద్ర మంత్రులను కలిసినా పట్టించుకోవడం లేదని, ఉద్దేశ పూర్వకంగానే నిధుల విడుదలలో జాప్యం చేస్తున్నారని అన్నారు. ఉపాధి హామీ కింద ఉమ్మడి జిల్లాకు రూ.75 కోట్ల నిధులను తీసుకొచ్చినట్లు నామా తెలిపారు. ఈజీఎస్ కింద ఖమ్మం జిల్లాకు రాష్ట్రం నుంచి రూ.20.59 కోట్లు, భద్రాద్రి జిల్లాకు రూ.13 కోట్లు ఇచ్చామన్నారు. కేంద్రం నుంచి ఖమ్మం జిల్లాకు రూ.35 కోట్లు మంజూరు కాగా భద్రాద్రి జిల్లాకు రూ.100 కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు.