కల్లూరు, జూన్ 4;తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్న విషయం యావత్ దేశానికి తెలిసిన విషయమే. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతును రాజు చేసేందుకు ఎన్నో పథకాలు చేపట్టడంతో ఈ ప్రాంత రైతులు వ్యవసాయ రంగంలో మరింత అభివృద్ధి సాధించారు. నాడు ఆంధ్రా పాలకుల పాలనలో తెలంగాణ ప్రాంతంలోని భూములు బీడుభూములుగా మారి దేనికీ పనికిరాకుండా పోయాయి. స్వరాష్ట్రం ఏర్పడిన ఏడేళ్ల కాలంలోనే తెలంగాణలో వ్యవసాయం దండగ నుంచి పండుగలా మారి ప్రతి రైతు వ్యవసాయ సాగులో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడంటే దానికి సీఎం కేసీఆరే ప్రత్యక్ష సాక్ష్యం.
రైతు సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, చెరువుల అభివృద్ధికి మిషన్ కాకతీయ వంటి ఎన్నో బృహత్తర పథకాలను చేపట్టి అమలుచేస్తున్నారు. దీంతో రైతులు దర్జాగా వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. భూగర్భ జలాలు సైతం పెరగడంతో సారవంతంగా మారిన భూములకు ఎంతో విలువ పెరిగింది. గతంలో కరెంటు సదుపాయం అరకొరగా ఉండడంతోపాటు ఉన్న కొద్దిసేపు విద్యుత్ సరఫరాతో రైతులు రాత్రిళ్లు సైతం పొలం గట్లపై వెళ్లి ఎన్నో వ్యయప్రయాసలు పడాల్సిన పరిస్థితి ఉండేది. రాత్రి సమయాల్లో ఎందరో రైతులు పాముకాటు, విద్యుత్షాక్కు గురై మృత్యువాత పడిన సంఘటనలూ లేకపోలేదు. కరెంటు సరఫరాలో హెచ్చుతగ్గుల కారణంగా విద్యుత్ మోటార్లు సైతం కాలిపోయి తీవ్రంగా నష్టపోయేవారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తే రాబడి లేక రైతులు ఆత్మహత్యలకు సైతం పాల్పడిన దాఖలాలూ ఉన్నాయి. వాటన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టి అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే రైతుల సమస్యలను తన సమస్యలుగా భావించిన సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణగా మార్చి రైతును రాజుచేశాడు. దీంతో దేశంలోనే వ్యవసాయ రంగంలో రాష్ట్రం నంబర్వన్ స్థానానికి ఎదిగింది.
భూములు కొనేందుకు ఎగబడుతున్న ఆంధ్రా రైతులు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే రైతులు వ్యవసాయాన్ని ఎంతో మక్కువతో చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రా రైతులు తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ భూములను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే మండలంలో సుమారు 50మంది రైతులు కల్లూరు పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ భూములను అధిక ధరలకు విక్రయించి గత మూడేళ్లుగా వ్యవసాయ సాగును సైతం చేపట్టారు. ఈ ప్రాంతంలో భూముల విలువ ఉన్నప్పటికీ వ్యవసాయ సాగులో ఇక్కడ వచ్చిన అధిక దిగుబడులు మరెక్కడా రావని తెలుసుకున్న ఆంధ్రా రైతులు భూములను ఎంత ధర అయినా ఇచ్చి కొనుగోలు చేసి తమకు నచ్చిన పంటను వేసుకుని అధిక లాభాలను సాధిస్తున్నారు. భూముల విలువ పెరిగి మూడు సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటికీ ఆంధ్రా రైతులు ఇక్కడ భూములను అధిక ధరకైనా కొనుగోలు చేసి వ్యవసాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎకరా ధర రూ.10 లక్షలు ఉండగా ఆంధ్రా రైతులు ఇక్కడ భూములు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడంతో ఆ ధర కాస్తా ఎకరానికి రూ.35 లక్షలకు చేరింది. అయినప్పటికీ ఆ విలువను మరింత పెంచైనా కొనుగోలు చేసేందుకు అక్కడి రైతులు సిద్ధంగా ఉన్నారు.
మూడేళ్లుగా సాగులో ఆంధ్రా రైతులు…
కల్లూరు మండలంలో గత మూడు సంవత్సరాల క్రితం ఆంధ్రా నుంచి వచ్చిన సుమారు 50మంది రైతులు ఇక్కడ భూములను కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తూ అధిక లాభాలు సాధిస్తున్నారు. ఆంధ్రాలోని విజయవాడ, వైజాగ్, ద్వారపూడి, తిరువూరు, మైలవరం, అవనిగడ్డ, జగ్గయ్యపేట తదితర ప్రాంతాల నుంచి ఆంధ్రా రైతులు మండలానికి వచ్చి కల్లూరుతోపాటు ముచ్చవరం, లక్ష్మీపురం, లింగాల, ముగ్గువెంకటాపురం, పేరువంచ తదితర గ్రామాల్లో వ్యవసాయ సాగు చేపట్టారు. దీంతో ప్రభుత్వం తెలంగాణలో రైతులకు అందిస్తున్న రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ తదితర సదుపాయాలు సైతం వీరికి అందడంతో ఎంతో లబ్ధి పొందుతున్నారు.
రెండు ఎకరాలు రూ.40 లక్షలకు కొనుగోలు చేశా…
మండల పరిధిలోని ముచ్చవరంలో 2020లో ఎకరానికి రూ.20 లక్షల చొప్పున రెండు ఎకరాలు కొనుగోలు చేశా. 2021 అదే గ్రామంలో మరో రైతు వద్ద రూ.30 లక్షలతో మరో ఎకరం కొనుగోలు చేశాను. అప్పటినుంచి ఆ భూమిలో వరిని సాగుచేసి అనుకున్న దానికంటే ఎక్కువగానే లాభాలను సాధించా. ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ అందించడంతో రైతుగా ఎంతో సంతృప్తిగా ఉంది. సీఎం కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు.
– కేతా శ్రీకాంత్, రైతు, వైజాగ్
ఎంతో మక్కువతో వ్యవసాయం చేస్తున్నా..
తెలంగాణలో భూములు సిరులు కురిపిస్తున్నాయి. ఎంతో మక్కువతో ఇక్కడ వ్యవసాయం చేయాలని విజయవాడ నుంచి కల్లూరు వచ్చి కొర్లగూడెం, ముచ్చవరం గ్రామాల్లో రైతుల నుంచి 5ఎకరాలు రూ.కోటికి కొనుగోలు చేశాను. మూడేళ్లుగా వరి సాగుచేయడంతో సిరులు పండాయి. పంట పెట్టుబడిగా ప్రభుత్వం రైతుబంధు సాయం అందించడం చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ సారథ్యంలో ఇక్కడి రైతులు రాజుగా మారి వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నారు. – కేతా సత్యనారాయణ, ఆంధ్రా రైతు, విజయవాడ