దమ్మపేట రూరల్, మే 30 ;అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రారంభించిన నాటినుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్ (ఓఈఆర్) సాధనలో రికార్డుల పరంపర సృష్టిస్తోంది. అప్పారావుపేట ఫ్యాక్టరీలోని ఓఈఆర్ ఆధారంగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఆయిల్పాం గెలల ధరను నిర్ణయిస్తున్నారు. ఈ స్ఫూర్తితోనే కొత్తగా ఆయిల్పాం సాగు, కొత్త ఫ్యాక్టరీల ఏర్పాటుకు కసరత్తు జరుగుతున్నది. రాష్ట్రంలో అశ్వారావుపేట, అప్పారావుపేట ఫ్యాక్టరీల్లోని ఓఈఆర్ను సరిపోలిస్తే అప్పారావుపేట ఫ్యాక్టరీలోనే అధికంగా వస్తోంది. 2020-21లో అశ్వారావుపేటలో 19.10, అప్పారావుపేటలో 19.22 వచ్చింది.
టీఎస్ ఆయిల్ఫెడ్ యాజమాన్యం అప్పారావుపేట ఫ్యాక్టరీలో టెక్నాలజీని ఆధునీకరిస్తూ ఓఈఆర్ పెంచడంలో సఫలీకృతమవుతున్నది. గతేడాది రూ.కోటితో ఈఎఫ్బీ (ఎమ్టీ ప్రూట్ బంచ్) ఫైబర్ ప్రస్ అనే నూతన పరికరం ఏర్పాటు చేసింది. ఇది ఓఈఆర్ పెంచడానికి దోహదపడడంతో మరో రెండు పరికరాలను మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వీటి అమరిక పూర్తయితే ఓఈఆర్ మరింత పెరుగనున్నది. అంతేకాదు, ఆయిల్పాం సాగు విస్తీర్ణం పెరగడంతో ఫ్యాక్టరీ సామర్థ్యానికి మించి గెలలు వస్తున్నాయి. దీంతో రూ.17.7 కోట్లతో గంటకు 60మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో పనిచేసేలా విస్తరణ పనులు చేపట్టారు. జూన్ మాసాంతానికి పూర్తయ్యేలా పనులు వేగంగా జరుగుతున్నాయి. –
దేశంలోని పామాయిల్ పరిశ్రమలకే అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ గీటురాయిగా వెలుగొందుతోంది. తెలంగాణ ఏర్పడిన కొద్దిరోజులకే ముఖ్యమంత్రి కేసీఆర్ పామాయిల్కు ఉన్న డిమాండ్ను గుర్తించారు. పంట విస్తరణకు అనుగుణంగా రైతుల సౌకర్యార్థం అప్పారావుపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతులతోపాటు రూ.10 కోట్లు నిధులు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ పూచికత్తుతో నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రూ.70 కోట్ల రుణాన్ని సైతం టీఎస్ ఆయిల్ఫెడ్కు ఇప్పించారు.
వీటితో శరవేగంగా ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తిచేసుకుని ఉత్పత్తి ప్రారంభించిన నాటినుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్ (ఓఈఆర్) సాధనలో వరుస రికార్డులు సృష్టిస్తోంది. దీనికి తార్కాణం ఆంధ్రప్రదేశ్లో పండిన పామాయిల్ గెలలు సైతం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీకి తీసుకొచ్చి క్రషింగ్ చేస్తున్నారు. నాటి నుంచి రైతులకు ఆయిల్పాం గెలల ధర నిర్ణయం అప్పారావుపేట ఫ్యాక్టరీలోని ఓఈఆర్ ఆధారంగానే తెలంగాణాతోపాటు ఆంధ్రప్రదేశ్లో నిర్ణయం జరుగుతున్నది. ఈ స్ఫూర్తితోనే రాష్ట్రంలో కొత్తగా ఆయిల్పాం సాగు, కొత్త ఫ్యాక్టరీల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది.
ఓఈఆర్ 19.22శాతం వరకు…
రాష్ట్రంలో అశ్వారావుపేట, అప్పారావుపేట ఫ్యాక్టరీల్లోని ఓఈఆర్ను సరిపోలిస్తే అప్పారావుపేట ఫ్యాక్టరీలోనే అధికంగా వస్తోంది. 2016-17 ఆయిల్ ఇయర్ నుంచి అప్పారావుపేట ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రారంభమైంది. 2016-17లో అశ్వారావుపేట ఫ్యాక్టరీ ఓఈఆర్ 18.43 శాతం, అప్పారావుపేటలో 18.65, 2017-18లో అశ్వారావుపేటలో 18.84, అప్పారావుపేటలో 18.94, 2018-19లో అశ్వారావుపేటలో 18.33, అప్పారావుపేటలో 18.45, 2019-20లో అశ్వారావుపేటలో 18.64, అప్పారావుపేటలో 18.68, 2020-21లో అశ్వారావుపేటలో 19.10, అప్పారావుపేటలో 19.22 వచ్చింది. టీఎస్ ఆయిల్ఫెడ్ అశ్వారావుపేట, అప్పారావుపేట ఫ్యాక్టరీల్లో అధిక ఓఈఆర్ వచ్చిన దాని ప్రాతిపదికనే ధర నిర్ణయిస్తున్నది.
ప్రభుత్వ ప్రోత్సాహంతో పెరిగిన సాగు
రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆయిల్పాం సాగు విస్తీర్ణం శరవేగంగా పెరుగుతున్నది. రైతులంతా ఆయిల్పాం సాగుకు పోటీ పడుతున్నారు. దీంతో మొక్కలకు తీవ్రమైన డిమాండ్ ఏర్పడింది. డిమాండ్కు అనుగుణంగా టీఎస్ ఆయిల్ఫెడ్ సీడ్ లింక్స్ను దిగుమతి చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కొత్త నర్సరీలను ప్రారంభించింది. డిమాండ్కు అనుగుణంగా ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే 12వేల ఎకరాలకు మొక్కలను సిద్ధం చేసి జూలై నుంచి పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
త్వరలో 60టన్నుల సామర్థ్యం..
గంటకు 30 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ప్రారంభమైన అప్పారావుపేట ఫ్యాక్టరీ గత ఏడాది 45టన్నుల సామర్థ్యానికి విస్తరించింది. అయితే సాగు విస్తీర్ణం పెరగడంతో ఫ్యాక్టరీ సామర్థ్యానికి మించి గెలలు వస్తుండడంతో రూ.17.7 కోట్లతో గంటకు 60మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో పనిచేసేలా విస్తరణ పనులు చేపట్టారు. జూన్ మాసాంతానికి పూర్తయ్యేలా పనులు వేగంగా జరుగుతున్నాయి.
పెరుగుతున్న విస్తీర్ణం
1993-94 ఆర్థిక సంవత్సరం నుంచి 2012-14 వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 26,377 ఎకరాలు ఆయిల్పాం సాగు జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో 2014 జూన్ నుంచి 21,907 ఎకరాల్లో సాగు జరిగింది. 2022-23 సంవత్సరానికి 12వేల ఎకరాల్లో ఆయిల్పాం సాగు చేయించాలన్నది ఆయిల్ఫెడ్ లక్ష్యం.
టెక్నాలజీ ఆధునీకరిస్త్తూ…
టీఎస్ ఆయిల్ఫెడ్ యాజమాన్యం అప్పారావుపేట ఫ్యాక్టరీలో టెక్నాలజీని ఆధునీకరిస్తూ ఓఈఆర్ పెంచడంలో సఫలీకృతమవుతున్నది. గత ఏడాది రూ.కోటితో ఈఎఫ్బీ(ఎమ్టీ ప్రూట్ బంచ్) ఫైబర్ ప్రస్ అధునాతన పరికరం ఏర్పాటు చేసింది. ఇది ఓఈఆర్ పెంచడానికి దోహదపడడంతో మరో రెండు పరికరాలను మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వీటి అమరిక పూర్తయితే ఓఈఆర్ మరింత పెరగనున్నది.
మా కష్టాలు తీరాయి..
ఆయిల్పాం సాగు ప్రారంభం నుంచి మా కష్టాలు పోయాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ 24గంటల కరెంటు ఇస్తుండడంతో మరింత ఆదాయం పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్పాం సాగుకు ఇస్తున్న ప్రాధాన్యతతో రైతుల్లో ఆర్థిక సుస్థిరత కలుగుతున్నది.
– దారా తాతారావు, పామాయిల్ రైతు, దమ్మపేట