కూసుమంచి, మే 28 : గత పాలకుల హయాంలో తాగునీటి కష్టాలు అన్నీఇన్నీ కావు.. గుక్కెడు నీటి కోసం కోసుల దూరం ఎడ్లబండ్లు, కాలినడకన వెళ్లేది. బోర్లు, బావుల వద్దకు పరుగులు తీసి వరసలో నిల్చునేది. కుళాయిల వద్ద గంటల తరబడి బిందెలతో బారులు తీరేది. నల్లాల వద్ద ‘పానీ’పట్టు యుద్ధాలు జరిగేవి. తాగునీటి కోసం పని వదిలేసిన సందర్భాలూ ఉన్నాయి. నాటి కష్టం తలుచుకుంటే నేటికీ కన్నీళ్లు సుడులు తిరుగుతాయి. ఆ రోజులు యాదికొస్తే గుండె చెరువు అవుతుంది. కానిప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.. క‘న్నీటి’ కష్టాలు తీరాయి. కుళాయిల వద్ద పంచాయితీల్లేవ్. సీఎం కేసీఆర్ ‘మిషన్ భగీరథ’ పథకంతో ఇంటింటికీ శుద్ధజలం అందుతున్నది. మారుమూల పల్లెలు, గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలకు సైతం తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో రూ.325 కోట్లు వెచ్చించి 2,73,355 ఇండ్లకు నీరందిస్తున్నారు. పాలేరు, వైరా రిజర్వాయర్లు సమీపంలో 24 గంటల పాటు నీటిని శుద్ధి చేస్తుండడంతో గ్రామాలకు నిరంతరాయంగా నీరు సరఫరా అవుతున్నది.
వీధుల్లో ‘పానీ’పట్టు యుద్ధాలు లేవు.. కుళాయి వద్ద గంటల తరబడి బిందెలతో బారులు తీరే అవసరం లేదు.. వేసవిలో నీటి కోసం వ్యవసాయ బోర్ల వద్దకు పరుగులు తీయనక్కర్లేదు. అంత కష్టపడి ఉప్పుడు నీళ్లు, ఫ్లోరైడ్ నీళ్లు తాగాల్సిన పరిస్థితి అంతకంటే లేదు. కలుషిత నీరు తాగి రోగాల బారిన పడనక్కర్లేదు. తెలంగాణ ప్రభుత్వం ‘మిషన్ భగరథ’తో ప్రజల క‘న్నీటి’ కష్టాలు తీర్చింది. దశాబ్దాలు పేరుకున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది. ఇంటింటికీ శుద్ధజలాన్ని సరఫరా చేస్తున్నది. ఖమ్మం జిల్లాలో రూ.325 కోట్లు వెచ్చించి 2,73,355 ఇండ్లకు నీరు అందిస్తున్నది. వీటిలో 1,70,434 ఇండ్లు కొత్త కనెక్షన్లు కావడం విశేషం. జిల్లాలోని 969 హెబిటేషన్లలో నీటి సరఫరా కోసం గతంలోని 901 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్లకు అదనంగా ప్రభుత్వం మరో 582 ట్యాంకులు నిర్మించింది. నీటి సరఫరాకు జిల్లావ్యాప్తంగా గతంలో 2,000 కిలోమీటర్ల మేర పైప్లైన్ ఉండగా మిషన్ భగీరథ కోసం 2,200 కిలోమీటర్ల మేర పైప్లైన్ నిర్మించింది.
గ్రీన్జోన్ పరిధిలో 826 హెబిటేషన్లు..
జిల్లాలో ఆవాస ప్రాతాలను నీటిసరఫరా అధికారులు మొత్తం మూ డు జోన్లుగా విభజించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 969 ఆవాస ప్రాంతాలు ఉండగా వీటిలో 826 ప్రాంతాలను గ్రీన్ జోన్గా గుర్తించింది. గ్రీన్జోన్ పరిధిలోని ప్రాంతాల్లో ఒక మనిషికి రోజుకు 100 లీటర్లు సరఫరా చేసే ప్రాంతాలు. ఆరెంజ్ జోన్ పరిధిలో 138 ఆవాస ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ ఒక మనిషికి రోజుకు 100 లీటర్ల కంటే తక్కువ నీరు సరఫరా అవుతుంది. ఇక రెడ్ జోన్ పరిధిలో 11 ఆవాస ప్రాంతాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో అధికారులు ప్రత్యేకంగా పైప్లైన్, ట్యాంకుల నిర్మాణం జరుగుతున్నది. ఈ ప్రాంతాల్లోనూ ప్రజలకు తాగునీరు అందించేందుకు యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. నీటి సరఫరాపై ఎప్పటికప్పుడు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమీక్షలు నిర్వహిస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్, కలెక్టర్ పీవీ గౌతమ్తో పాటు ఇతర ఉన్నతాధికారులు నీటి సరఫరాపై ఆరా తీస్తున్నారు. ఎప్పటికప్పుడు సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నారు. షెడ్యూలు ప్రకారం గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నారు.
రెండు చోట్ల నీటి శుద్ధి కేంద్రాలు..
పాలేరు, వైరా రిజర్వాయర్స్ సమీపంలో గ్రామీణ నీటి సరఫరా అధికారులు 24 గంటల పాటు నీటిని శుద్ధి చేస్తున్నారు. ప్రజలకు శుద్ధజలాన్ని సరఫరా చేస్తున్నారు. పాలేరు శుద్ధి కేంద్రంతో ఏడు మండలాలు, వైరా కేంద్రంతో 11 మండలాలు అనుసంధానమై ఉన్నాయి. గతంలో నీటి సరఫరా వ్యవస్థకు రోజుకు 18 గంటలు మాత్రమే విద్యుత్ సర
ఫరా అయ్యేది. కానీ ఇప్పుడు అన్ని వ్యవస్థలకు 24 గంటల పాటు
విద్యుత్ సరఫరా అవుతున్నది. దీంతో గ్రామాలకు నిరంతరాయంగా నీరు సరఫరా అవుతున్నది. కూసుమంచి మండలంలోని గుర్వాయిగూడెం ప్లాంట్ ద్వారా గ్రామాలకు నీరు సరఫరా అవుతున్నది. గ్రామాల్లో సమస్యలు తలెత్తితే స్థానిక పాలకవర్గ సభ్యులు ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తున్నారు. తీవ్రతను బట్టి మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు రంగంలోకి దిగి మరమ్మతులు చేయిస్తున్నారు.
ఎండాకాలంలో నీళ్లు దొరికేవి కావు..
మాది కూసుమంచి మండలం గంగబండ తండా. వేసవి వచ్చిందంటే ఎనకట మా ఊర్లో నీళ్లు దొరకక ఇబ్బంది పడేటోళ్లం. నీళ్లు ఇవ్వాలని అధికారులను అడిగేటోళ్లం. అయినా పట్టించుకునేటోళ్లు లేకపోయె. ట్యాంకర్ను ఊరికి పంపించినా అందరికీ నీళ్లు అందేటివి కాదు. బోర్ల కాడికిపోయి నీళ్లు తెచ్చుకునేటోళ్లం. ఇప్పుడా కష్టాలన్నీ పోయినయి. సర్కారే ఇంటింటికీ నల్లా పెట్టి నీళ్లు ఇస్తున్నది. – బానోతు మంగమ్మ,గంగబండ తండా గ్రామస్తురాలు
మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం..
మా పుట్టినిల్లు తిరుమలాయపాలెంలోని గోపాల్రావుపేట. మా చిన్నప్పుడు తీవ్రమైన నీటి ఎద్దడి ఉండేది. ఆడపిల్లలంతా నీటి కోసం బిందెలు పట్టుకుని కుళాయి వద్ద నించునేవారు. గంటల తరబడి నిలబడి ఇంటికి నీటిని తీసుకొచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటికే నీళ్లు సరఫరా అవుతున్నాయి. మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. – ఇంటూరి బేబీ, జడ్పీటీసీ, కూసుమంచి
తాగునీటి సమస్యలకు పరిష్కారం..
జిల్లాలో ఎక్కడ తాగునీటి సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తున్నాం. వెంటనే పరిష్కరిస్తున్నాం. గతంలో నెలకొన్న సమస్యలన్నింటికీ ఒక్క మిషన్ భగీరథతో పరిష్కారం లభించింది. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. వ్యవసా య బావులనూ అద్దెకు తీసుకుంటున్నాం. మాకు కొందరు మహిళలు ఫోన్లో సంప్రదించి సమస్యలు చెప్తున్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి సమస్యను పరిష్కరిస్తున్నారు. – పుష్పలత, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ