ఖమ్మం ఎడ్యుకేషన్, మే 28 : ఇంగ్లిష్ మీడియం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థులందరికీ అత్యుత్తమ భవిష్యత్తు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని టీఎస్ ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. ‘మన ఊరు – మన బడి’ పథకం విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందన్నారు. ‘మన బడి’ మొదటి దశకు ఉమ్మడి జిల్లాలో ఎంపికైన పాఠశాలలను శనివారం ఆయన పరిశీలించారు. జిల్లాలోని తెలంగాణ రాష్ట్ర విద్య, సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఈడబ్ల్యూఐడీసీ) అధికారులతో ఇంజినీరింగ్ పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ‘మన బడి’ పథకం అమలుపై ‘నమస్తే తెలంగాణ’తో ఆయన మాట్లాడారు. ఆ వివరాలన్నీ ఆయన మాటల్లోనే..
రూపురేఖలు మారుతాయి..
రాబోయే రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి వాటికి మహర్దశ కల్పిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అభీష్టానికి అనుగుణంగా ‘మన ఊరి – మన బడి’ మొదటి దశ పనులు వేగంగా జరుగుతున్నాయి. జిల్లాలో 426 స్కూళ్లు ఎంపిక కాగా ఏడు ఇంజినీరింగ్ విభాగాల అధికారుల పర్యవేక్షణలో అంచనాలు పూర్తయ్యాయి. రూ.30 లక్షల్లోపు పనులను ఎస్ఎంసీ బాధ్యులు, హెచ్ఎంలు, ఏఈలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రధానంగా విద్యుత్, తాగునీరు, ఓవర్హెడ్ ట్యాంకులు, మరుగుదొడ్లు, ఇతర మరమ్మతుల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మహబూబ్నగర్, హైదరాబాద్ల్లోని కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పర్యవేక్షించే సమయంలో అక్కడున్న గ్రామాల్లోని ప్రజలు చాలా ఉత్సాహంగా స్పందించారు. గ్రామాల్లో కొత్త చర్చ జరుగుతోంది. స్కూళ్ల అభివృద్ధి కోసం గతంలో రూ.లక్ష తెచ్చుకునేందుకు చాలా కష్టంగా ఉండేది. ప్రస్తుతం రూ.కోట్లలో నిధులు కేటాయించడం పై ప్రధానోపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జూన్ 10లోగా పనులు పూర్తయ్యేలా..
మొదటి దశలో ఎంపికైన పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పించే ప్రక్రియను జూన్ 10లోగా పూర్తి చేయాలనే లక్ష్యంలో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రధానమైన అంచనాలు పూర్తయి అనుమతులు రావడంతో పనులు మొదలయ్యాయి. జిల్లాస్థాయిలో పనులు పూర్తయిన అనంతరం అన్ని స్కూళ్లకూ ఒకేసారి పెయింటింగ్ వేయించి ఫర్నీచర్ అందిస్తాం. హైస్కూల్ విద్యార్థుల తరగతి గదుల్లో డిజిటల్ విద్యాబోధనకు అవసరమైన సాంకేతిక పరికరాలను బడులు తెరిచేలోగా సమకూరుస్తాం. క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు సైతం ‘మన బడి’ పనులను పర్యవేక్షిస్తున్నారు.
‘మన బడి’ పనులపై సమీక్ష
పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి ‘మన ఊరు – మన బడి’ పనులను పూర్తి చేయాలని ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి ఇంజినీరింగ్ విభాగం అధికారులకు సూచించారు. ఖమ్మంలోని సంస్థ ఈఈ కార్యాలయంలో ‘మన బడి’ పనులపై వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులతో శనివారం ఆయన సమీక్షించారు. ఈఈ నాగశేషు, డీఎం సాంబశివరావు, సిబ్బంది సురేందర్రెడ్డి, నాగేశ్వరరావు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.
‘మన బడి’ పనులు పూర్తి చేయండి
జూలూరుపాడు, మే 28: సర్కార్ బడుల్లో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ‘మన ఊరు- మన బడి’ పనులను వచ్చే నెల 10 నాటికి పూర్తి చేయాలని రాష్ర్ట విద్యా, సంక్షేమ మౌలిక సముదాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి ఆదేశించారు. జూలూరుపాడు మండలంలోని పడమట నర్సాపురం, కాకర్ల, కొమ్ముగూడెం ప్రాథమిక పాఠశాలల్లో చేపడుతున్న పనులను శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. పాఠశాలల అభివృద్ధి పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు, దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈఈ నాగశేషు, డీఈ ఆశీర్వాదం, ఏఈ రామ్కుమార్, ఎంఈవో వెంకట్, పడమట నర్సాపురం ఉప సర్పంచ్ రవి పాల్గొన్నారు.
భారీగా నిధులు..
గతంలో పాలకులు పాఠశాలల అభివృద్ధికి నిధులు నామమాత్రంగానే కేటాయించేవారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ మాత్రం విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. సర్కారు బడుల బలోపేతం చేయడం; బడుగు, బలహీన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిండమే ధ్యేయంగా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇంగ్లిష్ మీడియం అమలు, కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాల కోసం ‘మన బడి’ని రూపొందించారు. ఇందులో దాతలను సైతం భాగస్వామ్యం చేశారు. ఎన్ఆర్ఐలు చేయూతనిస్తున్నారు. నేను చదువుకున్న కల్లూరు మండలంలోని పేరువంచ పరిసర గ్రామాల్లోని కొందరిని కలిసి ‘మన బడి’కి విరాళాలు ఇచ్చేందుకు కృషి చేస్తా. రూ.2 లక్షల కంటే ఎక్కువగా విరాళం ఇస్తే పర్యవేక్షణలో బాధ్యత ఇస్తున్నాం. భవిష్యత్లో సర్కారు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రావీణ్యం సాధించేలా తీర్చిదిద్దుతాం.