భద్రాచలం, మే 28: ప్రభుత్వ ఆసుపత్రులో సాధారణ ప్రసవాలు జరిగేలా అధికారులు కృషి చేయాలని నీతి ఆయోగ్ ప్రబారి అధికారి యువరాజ్ సూచించారు. భద్రాద్రి కలెక్టర్ అనుదీప్, ఐటీడీఏ పీవో గౌతమ్ పొట్రుతో కలిసి శనివారం భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే వైద్యసేవల గురించి ఆదివాసీ గ్రామాల్లో గిరిజనులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించాలని సూచించారు. గర్భిణుల పై శ్రద్ధ తీసుకోవాలని, న్యూట్రిషన్ వార్డులో చిన్నారులకే గాక తల్లులకు కూడా ప్రత్యేకమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. మాతా, శిశు మరణాలు జరుగకుండా చూడాలని ఆదేశించారు.
అనంతరం ఏరియా ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించారు. రోగులకు, గర్భిణులకు, రక్తహీనత ఉన్న వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు. హైరిస్క్ ఉన్న గర్భిణులు.. అంచనా ఉన్న ప్రసవ తేది కంటే ముందే ఆసుపత్రికి వచ్చేలా చూడాలని, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా వైద్య సిబ్బంది గిరిజన కుటుంబాలకు అవగాహన కల్పించాలని సూచించారు. భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలకు ప్రత్యేక గుర్తింపు ఉందని, కేంద్రంతో మాట్లాడి ఆసుపత్రికి కావాల్సిసిన సౌకర్యాలను సమకూరుస్తామని అన్నా రు. ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ రామకృష్ణ, జిల్లా వైద్యాధికారి దయానంద స్వామి, ఆసుపత్రి వైద్యులు పూజ, సుమన్, విజయ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు
శిక్షణతోపాటు పోటీతత్వం ఉంటేనే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని నీతి ఆయోగ్ ప్రబారి యువరాజ్ అన్నారు. శనివారం భద్రాచలం వచ్చిన ఆయన.. ఐటీడీఏ ఆధ్వర్యంలో పోలీసు శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులతో మాట్లాడారు. ఏపీవో జనరల్ డేవిడ్రాజ్, ఏసీఎంవో రమణయ్య, జీసీడీవో అలివేలు మంగతాయారు, జేడీఎం హరికృష్ణ, సెంటర్ మేనేజర్స్ నాగేందర్, హరిత, వెంకట రమణ, పోలీసు శిక్షణ ఇన్చార్జి సర్వేశ్వర్ దొర తదితరులు పాల్గొన్నారు.