అశ్వారావుపేట, మే 27: వానకాలం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నది.. రైతులు వేసవి దుక్కులు దున్ని భూమిని సాగుకు సిద్ధం చేస్తున్నారు.. వ్యవసాయశాఖ అధికారులు సాగు విస్తీర్ణంపై అంచనాలు రూపొందించారు.. పంటలకు అవసరమైన ఎరువులు, విత్తనాలను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సీజన్కు ముందే రైతుబంధు సాయం అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కల్తీ విత్తన విక్రయాలను కట్టడి చేసేందుకు ఇతరశాఖల అధికారులతో కలిసి తనిఖీలు చేపడుతున్నారు. ఈసారి రైతులు వరి సాగుకు ప్రత్యామ్నాయంగా పత్తి, మొక్కజొన్న పంటలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రభుత్వం ఆయిల్పాం సాగుకు ప్రోత్సాహకాలు అందిస్తుండడంతో ఈ పంట సాగుకూ అడుగులు పడుతున్నాయి.
వానకాలం సమీపిస్తున్నది. రైతులు భూములను పంటలకు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు వ్యవసాయశాఖ అధికారులు సీజన్ సాగు అంచనాను సిద్ధం చేస్తున్నారు. సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సీజన్కు ముందే రైతుబంధు సాయం అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కల్తీ విత్తన విక్రయాలను కట్టడి చేసేందుకు ఇతరశాఖల అధికారులతో కలిసి తనిఖీలు చేపడుతున్నారు. ఈసారి పత్తి, మొక్కజొన్న, కంది పంటల సాగు విస్తీర్ణం పెంచే దిశగా ప్రణాళికలు రూపొందించారు. గతేడాది వానకాలం కంటే ఈసారి సాగు విస్తీర్ణం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. గతేడాదిలో 5,44,292 ఎకరాల్లో రైతులు సాగు చేపట్టగా ఈసారి ఏకంగా 5,50,734 ఎకరాల్లో సాగు చేపట్టవచ్చని అంచనా వేస్తున్నారు. గతేడాది కంటే ఈసారి సాగు విస్తీర్ణం 6,500 వేల ఎకరాలు ఎక్కువ. ఈసారి ఆయిల్ పాం సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రణాళికలకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులు సమకూర్చే పనిలో నిమగ్నమయ్యారు.
ఆయిల్పాం, పత్తికి ప్రాధాన్యం..
వరికి ప్రత్యామ్నాయంగా దీర్ఘకాలికంగా ఆదాయాన్ని అందించే ఆయిల్పాం, పత్తి పంటలకు ఈసారి వ్యవసాయశాఖ అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. పంటల ప్రణాళికలో ఆయిల్పాం, పత్తి సాగు విస్తీర్ణాన్ని పెంచార. గతేడాది 34,038 ఎకరాల్లో ఆయిల్పాంను విస్తరించగా ఈఏడాది మరో 19,206 ఎకరాల్లో సాగు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పెరగనున్న విస్తీర్ణానికి అనుగుణంగా మొక్కలు సమకూర్చేందుకు ఉద్యానశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా పత్తికి ధర రికార్డు స్థాయి ధరలు పలుకుతుండడంతో ఈసారి పత్తి విస్తీర్ణమూ అమాంతం పెరగనున్నది. గతేడాది 1,60,548 ఎకరాల్లో పత్తి సాగు చేసిన రైతులు ఈసారి ఏకంగా 1,75,628 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు అంచనా.
సాగు ప్రణాళిక ఇలా..
వానకాలంలో జిల్లావ్యాప్తంగా రైతులు పత్తి 1,75,628 ఎకరాలు, వరి 1,71,210 ఎకరాలు, కంది 15,121 ఎకరాలు, ఆయిల్పాం 53,244 ఎకరాలు, మొక్కజొన్న 60,200 ఎకరాలు, మినుములు 1,600 ఎకరాలు, మిర్చి 22,000 ఎకరాల్లో సాగు చేయనున్నారు. మిగతా విస్తీర్ణంలో కూరగాయలు, మామిడి, జీడి మామిడి, జొన్న పంటలు సాగు చేయనున్నారు. ప్రధాన పంటల్లో వరి గతేడాదితో పోల్చితే 3,727, మొక్కజొన్న 5,800 ఎకరాలు తగ్గింది. ఆయిల్పాం 19,206, పత్తి 15,080, కంది 3,603 ఎకరాల సాగు విస్తీర్ణం పెరుగుతున్నది.
సాగు విస్తీర్ణం పెరగనున్నది..
గతేడాది కంటే ఈసారి వానకాలం సాగు విస్తీర్ణం మరింత పెరగనున్నది. వ్యవసాయశాఖ అధికారులు ఈ మేరకు పంటల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పంటలకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నకలీ విత్తనాలను కట్టడం చేయడానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. రైతులు అనుమతులు ఉన్న దుకాణాల్లోనే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలి. తీసుకున్న విత్తనాలు, ఎరువులకు తప్పకుండా రశీదులు తీసుకోవాలి. వాటిని పంట కాలం పూర్తయ్యే వరకు భద్రపరుచుకోవాలి. పీఎం కిసాన్ పథక లబ్ధి కోసం ఈ నెల 31లోపు రైతులు బ్యాంక్ ఖాతాకు ఆధార్ను అనుసంధానం చేసుకోవాలి. 2019 ఫిబ్రవరికి ముందు పాస్ పుస్తకాలు పొందిన రైతులు పథకానికి అర్హులు.
– అఫ్జల్ బేగం, వ్యవసాయశాఖ సహాయ సంచాలకురాలు, అశ్వారావుపేట