లక్ష్మీదేవిపల్లి, మే 27: ఎండలు దంచికొడుతున్నాయి.. భానుడి ప్రతాపానికి పిల్లాపాపా అల్లాడుతున్నారు.. గొంతు తడారక ముందే చల్లటి నీరు తాగి దాహం తీర్చుకుంటున్నారు.. శీతల పానీయ దుకాణాలనూ ఆశ్రయిస్తున్నారు.. బాబోయ్ ఎండలు అంటూ ఇంటికే పరిమితమవుతున్నారు.. మన పరిస్థితే ఇలా ఉంటే మరి అడవుల్లో వన్యప్రాణుల సంగతేంటి? పాపం కదా..! వీటి సంరక్షణ కోసమే వినూత్నంగా ఆలోచించింది అటవీశాఖ. జీవాల కోసమే అటవీప్రాంతాల్లో ప్రత్యేకంగా ‘రెస్టారెంట్స్’ ఏర్పాటు చేస్తున్నది.. రెస్టారెంట్స్ అంటే పట్టణాల్లో ఉండే లాంటివి కాదండోయి.. చిన్న చిన్న షెల్టర్ల లాంటివి. ఒక్కమాటలో చెప్పాలంటే వన్యప్రాణులకు ‘విడిది’ ప్రదేశాలన్న మాట. ఇక్కడ ఉన్న నీటి కుంటలు, సాసర్ పిట్లలో జీవాలు దాహాన్ని తీర్చుకుంటాయి. దుప్పులు, జింకలు గడ్డి మొక్కలను ఆరగించి ఆకలి తీర్చుకుంటాయి.. పక్షులు కృత్రిమంగా ఏర్పాటు చేసిన గూటిలో సేద తీరవచ్చు.. ఏమైనా అటవీశాఖ ఆలోచన సూపర్ కదా..! ఆ ఏర్పాట్లపైనే నేటి కథనం.
ఎండలు మండిపోతున్నాయి.. భానుడు భగభగమంటూ మన నెత్తిన కుంపటి పెడుతున్నాడు. గొంతు తడారుతున్నదని గుర్తించిన వెంటనే మనకు వచ్చే మొదటి ఆలోచన శీతల పానీయాల దుకాణాల వద్దకు వెళ్లడం. చల్లటి పానీయాన్ని గొంతులోకి పంపి.. ‘హమ్మయ్య దాహం తీరింది..’ అనుకుంటాం.. ఇక ఆకలైతే రోడ్డు పక్కనైనా ఫర్వా లేదు. ఇడ్లీ అయినా దోసె అయినా, ఆఖరికి పండ్ల కొట్టు వద్దకైనా వెళ్లి పండ్లు తింటాం. మనలోని ఆత్మారాముడిని సంతృప్తి పరుస్తాం. అంతవరకు బాగానే ఉంది. కానీ పాపం అటవీప్రాంతాల్లో వన్యప్రాణాలు తమ దాహాన్ని ఎలా తీర్చుకుంటాయంటారు..? తమ చిన్ని బొజ్జను ఎలా నింపుకుంటాయంటారు.. ? ఈ ప్రశ్నలకు ఆచరణాత్మకంగా సమాధానం ఇవ్వాలనుకున్నారు అటవీశాఖ అధికారులు. అటవీప్రాంతాల్లో వన్యప్రాణుల కోసం రెస్టారెంట్లు (విడిది) ఏర్పాటు చేయాలనుకున్నారు. రెస్టారెంట్లంటే అక్కడ బట్లర్లు, చెఫ్లు, సర్వర్లు ఉంటారనుకుంటారేమో.. అదేం లేదంటి. అడవిలో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలను గుర్తించి అక్కడ జంతువుల దాహార్తి తీర్చేందుకు నీటి కుంటలు, సాసర్ పిట్లు ఏర్పాటు చేస్తున్నారు. వాటి కడుపు నింపడానికి గడ్డి జాతి మొక్కలు, పండ్ల మొక్కలను పెంచుతారు.
జీవాల గొంతు తడారకుండా…
వేసవిలో వన్యప్రాణులు దాహార్తితో అలమటించకుండా ఉండేందుకు అటవీశాఖ చర్యలు చేపడుతున్నది. నీటి వసతి లేక కొన్నిసార్లు వన్య మృగాలు సమీప గ్రామాల్లోకి వచ్చే ప్రమాదం ఉంది. తద్వారా గ్రామస్తులకు హానీ కలిగే అవకాశమూ ఉంటుంది. దీనిని నివారించేందుకు నీటి వసతి కల్పిస్తున్నది.
గ్రిడ్లుగా విభజించి..
అటవీ ప్రాంతంలో నీటి లభ్యత ఆధారంగా అధికారులు గ్రిడ్లుగా విభజించారు. ప్రతి గ్రిడ్లో కనీసం ఒక నీటి ఆవాసం ఉండేలా శాస్త్రీయబద్ధంగా ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని అమలు చేస్తున్నారు. సహజ నీటి ఆవాసాలైన నీటి కుంటలు, చెలిమలు, ఊటలు, సజీవ వాగుల్లో పూడిక తీయిస్తున్నారు. నీటి లభ్యతను మరింత పెంచుతున్నారు. సహజ నీటి వనరులు లేని ప్రదేశాల్లో చెక్డ్యాంలు, సాసర్ పిట్లు నిర్మిస్తున్నారు. ఎడ్లబండ్లు, ట్రాక్టర్ ట్యాంకర్లతో వాటిలో నీరు నింపుతున్నారు. కొన్ని చోట్ల రాతి కట్టల నిర్మించి చిత్తడి నేలలను వృద్ధి చేస్తున్నారు. తద్వారా సూక్ష్మజీవులకు నీటి లభ్యతను పెంచుతున్నారు. నిరంతరం నీరు పారే వాగులపైన ప్రతి 200 మీటర్లకు ఒక చెక్వాల్ నిర్మిస్తున్నారు. 2- 3 కిలో మీటర్ల మేర సంవత్సరం పొడవునా నీరు లభ్యమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. నీటి లభ్యతకు ఆస్కారం లేని అత్యంత దట్టమైన అటవీ ప్రాంతాల్లో సోలార్ బోర్వెల్స్ నిర్మిస్తున్నారు. సంవత్సరం పొడవునా వన్యప్రాణులకు నీటి వసతి కల్పిస్తున్నారు.
ఫారెస్ట్ అధికారుల వినూత్న ఆలోచన
వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యం అటవీ ప్రాంతంలోని వన్యప్రాణులను సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ప్రస్తుతం ఎండలు మండుతున్న నేపథ్యంలో జంతువులకు ఎక్కడికక్కడ నీటి వసతి కల్పిస్తున్నాం. దాహార్తికి అల్లాడకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఆహార కొరత తీర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. కొత్తగా వన్యప్రాణి రెస్టారెంట్ల ఏర్పాటుకు అటవీప్రాంతంలో కొన్ని పాయింట్లను గుర్తించాం. దీనిలో భాగంగా బేస్ క్యాంప్లు ఏర్పాటు చేశాం. క్యాంపుల నుంచి అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు ఆటవీప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నారు.
– ఎఫ్డీవో, అప్పయ్య
విశ్రాంతి తీసుకోవడానికి గుహలు..
అటవీశాఖ అధికారులు నీటి ఆవాసాల దగ్గర కెమెరా ట్రాప్లు ఏర్పాటు చేసి వన్యప్రాణుల సంచారాన్ని గమనిస్తున్నారు. వన్యప్రాణులకు ఎలాంటి హాని జరగకుండా జాగ్రత్త వహిస్తున్నారు. నీటి ఆవాసాల వద్ద వన్యప్రాణుల దాహం తీర్చేందుకు కుంటలు, ఆహారం కోసం గడ్డి జాతి మొక్కలను పెంచుతున్నారు. అడవి దుప్పులు సంచరించే ప్రాంతాల్లో పెద్ద రకం గడ్డిజాతి విత్తనాలు చల్లుతున్నారు. అవి పెరిగి దుప్పులకు ఆహారంగా మారుతున్నాయి. జంతువుల నాలుక చప్పపడకుండా ఉండేందుకు అటవీశాఖ సిబ్బంది ఆవాసాల చుట్టూ ఉప్పు ముద్దలు వదులుతున్నారు. ఆయా ప్రాంతాల్లో వన్యప్రాణులు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా సహజ సిద్ధమైన మొక్కలతో ఏర్పడే చల్లటి గుహలను ఏర్పాటు చేసస్తున్నారు. ఎండ తాపాన్ని తట్టుకులేని కొన్ని ప్రాణులు నీటి కుంటల్లోకి వచ్చి సేద తీరుతాయి. అందుకు వీలుగా అటవీశాఖ సిబ్బంది కృతిమ బురద గుంటలను ఏర్పాటు చేస్తున్నారు. జంతువుల పాదముద్రల సేకరణకు పగ్ ఇంప్రెషన్ ప్యాడ్లను అటవీప్రాంతాల్లో అమర్చారు.