భద్రాద్రి కొత్తగూడెం, మే 27 (నమస్తే తెలంగాణ) : నూతన అంనగ్వాడీ కేంద్రాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని యాస్పిరేషనల్ ప్రభారి అధికారి యువరాజ్ సూచించారు. యాస్పిరేసనల్ అంశాలపై భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ అధ్యక్షతన జిల్లా అధికారులతో భద్రాద్రి కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన సమీక్షించారు. విద్య, వైద్య, వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, పశు సంవర్ధక, పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ, ఎల్డీఎం, విద్యాశాఖ అధికారులతో ముఖాముఖి మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బిడ్డ పుట్టిన నాటి నుంచి రెండేళ్ల వరకు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ చాలా ముఖ్యమని, ప్రతి మూడు నెలలకూ చిన్నారులకు రక్త పరీక్షలు చేసి ఆరోగ్య పరిరక్షణ చర్యలు పాటించాలని సూచించారు.
చిన్నారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం వల్ల భవిష్యత్తులో వారి విద్యాభ్యాస వివరాలను తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు. జిల్లాలో సాగవుతున్న 5.50 లక్షల ఎకరాల సాగు భూమి డేటాను రెవెన్యూ రికార్డులతో పరిశీలించాలని, అప్పుడే వాస్తవ పంటల సాగు విస్తీర్ణం తెలుస్తుందని అన్నారు. జనన, మరణాలను గ్రామ పంచాయతీ అధికారులు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. హైరిస్క్ ఉన్న గర్భిణులకు మెరుగైన వైద్య సేవలందించాలని, ప్రసవ తేదీ కంటే 15 రోజులు ముందుగానే ఆస్పత్రుల్లో పర్యవేక్షించాలని సూచించారు. అందువల్ల మాతా, శిశు మరణాలు తగ్గించడానికి అవకాశం కలుగుతుందన్నారు. హైరిస్క్ గర్భిణుల సమాచారం అంగన్వాడీ, పంచాయతీ, డీఆర్డీవో కార్యాలయాల్లో వెంటనే తెలియజేయాలన్నారు.
పోషణ లోపాన్ని అధిగమిస్తున్నాం: కలెక్టర్
భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ చిన్నారుల పోషణలోపాన్ని అధిగమించేందుకు చేపట్టిన చర్యలను పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. పోషణ లోపాన్ని అధిగమించేందుకు ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. మిల్లెట్స్తో కూడిన ఆహారాన్ని అందించేందుకు జిల్లాలో 1,120 ఎకరాల్లో 1,210 మంది రైతుల ద్వారా మిల్లెట్స్ సాగు చేయిస్తున్నామని వివరించారు. పోషణ లోపాన్ని అధిగమించేందుకు అశ్వారావుపేట, పాల్వంచ మండలాల్లోని 100 అంగన్వాడీ కేంద్రాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నామని, తదుపరి జిల్లా మొత్తం అమలు చేస్తామని అన్నారు. డీఆర్డీవో మధుసూదన్రాజు, డీపీవో రమాకాంత్, మహిళా, శిశు సంక్షేమాధికారి వరలక్ష్మి, డీఎంహెచ్వో దయానందస్వామి, ఆస్పత్రుల సమన్వయ అధికారి ముక్కంటేశ్వరరావు, డీఏవో అభిమన్యుడు, డీహెచ్ఎస్వో మరియన్న, మార్కెటింగ్ అధికారి ఆలీం, పశుసంవర్ధక శాఖ అధికారి పురందర్, పీఆర్ ఈఈ సుధాకర్, డీఆర్వో అశోక్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.