అశ్వారావుపేట, మే 25: ‘మహిళలు ఆర్థికంగా ఎదగాలి.. ఆర్థిక స్వావలంబన సాధించాలి..’ అన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) కు చేయూతనందిస్తున్నది.. జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ (డీఆర్డీవో) ఏటా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా రుణాలు అందజేస్తున్నది.. గతేడాది 16,115 గ్రూపులకు రూ.431.15 కోట్ల రుణాలు అందజేయగా డీఆర్డీవో 9,845 గ్రూపుల నుంచి రూ.437.70 కోట్ల రికవరీ చేసి రికార్డు సృష్టించింది.. ఈ ఏడాది 14,819 గ్రూపులకు రూ.510.75 కోట్ల్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే 236 గ్రూపులకు రూ.14 కోట్ల రుణాలు అందించింది. రుణం తీసుకున్న వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి రుణాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.
స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళలు ఆర్థికంగా ఎదగాలి.. ఆర్థిక స్వావలంబన సాధించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఏటా వారికి సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) రుణాలు అందజేస్తున్నది. భద్రాద్రి జిల్లాకు చెందిన సభ్యులకు ప్రభుత్వం గతేడాది లక్ష్యానికి మించి రుణాలను మంజూరు చేసింది. జిల్లాలోని 14,819 గ్రూపులకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.510.75 కోట్లు రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. జిల్లాలో అత్యధికంగా బూర్గంపాడు మండలానికి రూ.44.75 కోట్ల రుణాలు మంజూరు చేసింది. గతేడాది 16,115 గ్రూపులకు రూ.431.15 కోట్లు రుణాలు అందించింది.
రికవరీ 100 శాతం దాటింది. 9,845 గ్రూపుల నుంచి రూ.437.70 కోట్లు రికవరీ చేసి 102 శాతం నమోదు చేసింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన డీఆర్డీవో మధుసూదన్రాజు ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. ఈనెల 18న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. జిల్లాలో 14,819 స్వయం సహాయక సంఘాల్లో 1,48,190 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికే సెర్ప్ 236 గ్రూపులకు రూ.14 కోట్ల రుణాలు అందించింది. సెర్ప్ అధికారులు ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించుకుని సంఘాలకు రుణాలు అందజేస్తున్నారు.
రుణ లక్ష్యం రూ.510.75 కోట్లు..
ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా మహిళా సంఘాలకు రూ.510.75 కోట్ల రుణం అందించాలని సెర్ప్ నిర్ణయించింది. ఈ రుణంగా గతేడాది కంటే సుమారు 20 శాతం ఎక్కువ. ప్రతి సంఘంలోనూ పది మంది మహిళలకు అధికారులు భాగస్వామ్యం కల్పిస్తున్నారు. సెర్ప్ ద్వారా రుణాలు అందుకున్న సంఘాల సభ్యులు తమకు ఇష్టమైన రంగాల్లో రాణించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సెర్ప్ అధికారులు ప్రతి నెలా సమావేశాలు నిర్వహించి సంఘాల పనితీరును పర్యవేక్షిస్తున్నారు.
9,845 గ్రూపుల రుణం 100 శాతం చెల్లింపు..
సకాలంలో రుణాలు చెల్లించిన గ్రూపులకు సెర్ప్ అధికారులు రుణ లక్ష్యాన్ని పెంచారు. గతేడాది మొత్తం 16,115 సంఘాలు రూ.431.15 కోట్ల రుణాలు తీసుకున్నాయి. వీటిలో కేవలం 9,845 గ్రూపులు మాత్రమే 100 శాతం రుణం చెల్లించాయి. ఈ సంఘాల ద్వారా రికవరీ శాతం 102 దాటింది. 100 శాతం రుణాలు చెల్లించిన సంఘాలను గుర్తించిన సెర్ప్ అధికారులు వాటికి రూ.20 లక్షల వరకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు.
డీఆర్డీవోకు అవార్డు..
మహిళా సంఘాలు తాము తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి రికవరీ శాతం 102 నమోదు చేశాయి. రుణాల చెల్లింపు ప్రక్రియను సమన్వయం చేసిన డీఆర్డీవో మధుసూదన్రాజుకు ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. ఈ నెల 18న హైదరాబాద్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చేతుల మీదుగా డీఆర్డీవో అవార్డు అందుకున్నారు. కలెక్టర్ అనుదీప్ రికవరీ సాధించిన సెర్ప్ అధికారులకు అభినందనలు తెలిపారు. డీఆర్డీవో మధుసూదన్రాజు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించే దిశగా యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు.
మహిళల ఆర్థికాభివృద్ధి కోసమే..
మహిళలు ఆర్థికా స్వావలంబన సాధించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సెర్ప్ ద్వారా స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందజేస్తున్నది. రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో అందించిన రుణాల్లో రికవరీ 102 శాతం పూర్తి చేశాం. ఈ ఏడాది కూడా 14,819 సంఘాలకు రూ.510.75 కోట్లు రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఇప్పటికే 236 సంఘాలకు రూ.14 కోట్ల వరకు రుణాలు అందించాం. ఈ ఏడాదిలోనూ రుణాల రికవరీని 100 శాతం పూర్తి చేస్తామన్న నమ్మకం ఉంది.
–మధుసూధన్రాజు, డీఆర్డీవో, కొత్తగూడెం