టేకులపల్లి, మే 25 : చిన్నతనం నుంచే మొక్కలంటే అతనికెంతో ఇష్టం. తాను పనిచేసిన ప్రతి పాఠశాలలో మొక్కలు నాటాడు. ఇంటినైతే ఏకంగా వృక్షాలయంగా మార్చేశాడో రిటైర్డ్ ఉపాధ్యాయుడు. వివరాల్లోకేళ్తే.. టేకులపల్లి మండల కేంద్రానికి చెందిన ఎండీ మౌలానా ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. చిన్న వయస్సులోనే మొక్కల ప్రాముఖ్యతను తెలుసుకున్న మౌలాన ఉపాధ్యాయ వృత్తిలో చేరిన నాటినుంచి పనిచేసిన ప్రతి పాఠశాలలోనూ మొక్కలు నాటాడు. నాటిన మొక్కలన్ని ఇప్పుడు పెద్దవృక్షాలయ్యాయి. రిటైర్మెంట్ సమయం నాటికి టేకులపల్లి మండలం దాస్తండా గ్రామంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. 10 సంవత్సరాల క్రితం తన ఇంటి స్థలం ఐదు గుంటల్లో నాలుగు గదుల ఇళ్లు నిర్మించి దాని చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేశాడు. మొక్కలపై ఉన్న ప్రేమతో సొంత ఖర్చుతో కడెం, రాజమండ్రి ప్రాంతాలకు వెళ్లి మొక్కలు తీసుకొచ్చి నాటాడు. కొత్త కొత్త రకాల మొక్కలతో ఇంటి పరిసరాలను సుందరంగా మార్చాడు. ఆహ్లాదకర వాతావరణంలో ఇంటినే వృక్షాలయంగా తయారుచేశాడు.
ఇంటి ఆవరణలో 200రకాల మొక్కలు
ఇంటి ఆవరణంలో సుమారు 200 రకాల మొక్కలను నాటి వాటి సంరక్షణ కోసం ప్రతి రోజు నీరు పోస్తూ, అవసరమైనప్పుడు ఎరువు వేస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఈ మొక్కలు ఉండడం వల్ల ఆహ్లాదకర వాతావరణంలో ఇంట్లో హాయిగా సేద తీరుతున్నారు.
పీస్ లిల్లీతో ప్రాణవాయువు మెరుగు
ఇండోర్ స్టేడియాల్లో అధికంగా పెంచే, అరుదుగా కనిపించే మొక్క పీస్ లిల్లీ. ఈ మొక్క గాలిలో ఉండే కార్బన్మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి త్వరగా ఆక్సిజన్ను మనకు ఇస్తుంది. వేసవికాలం ప్రారంభం దశ(వసంత రుతువు)లో ఈ పుష్పం వికసిస్తుంది. పుష్పం ఐదు నుంచి ఆరు నెలలపాటు ఉంటుంది. ఈ మొక్క వెనుజులాలో పుట్టింది. వాతావరణ కాలుష్యాన్ని నియంత్రణ చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ప్రతి పాఠశాలలో మొక్కలు పెంచాను
నాకు చిన్నతనం నుంచి మొక్కల విలువ తెలుసు. నేను చండ్రుగొండలో పని చేసినప్పుడు నాటిన చెట్లు చాలా పెద్దయ్యాయి. టేకులపల్లి మండలం కుంటల్ల పంచాయతీ అందుగులగూడెం పాఠశాలలో సొంత ఖర్చుతో 160మొక్కలు , మొక్కంపాడు ప్రాథమిక పాఠశాలలో 130 మొక్కలు నాటాను. చెట్లు అంటే ప్రాణం, వాటి పోషణ నాకు చాలా సంతోషాన్నిస్తుంది.
– మౌలానా, రిటైర్డ్ ఉపాధ్యాయుడు