సుజాతనగర్, మే 25: సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’ గ్రామాల రూపురేఖలను మారుస్తున్నది. ప్రభుత్వం ప్రతి నెలా కేటాయిస్తున్న పల్లె ప్రగతి నిధులతో సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు గ్రామాభివృద్ధికి బాటలు వేస్తున్నారు. ఈ నిధులతో గ్రామాల్లో ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, వైకుంఠ ధామం, కంపోస్టు షెడ్డు ఏర్పాటయ్యాయి. పంచాయతీలకు ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్లూ సమకూరాయి. అవెన్యూ ప్లాంటేషన్, వనాల్లో పెరుగుతున్న మొక్కలను సంరక్షిస్తున్నారు. నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. పక్కాగా పారిశుధ్య నిర్వహణ చేపడుతున్నారు. పల్లెప్రగతి నెలకు జిల్లావ్యాప్తంగా 481 పంచాయతీలకు రూ.9.32 కోట్ల నిధులు విడుదలవుతున్నాయి. ఇలా ఇప్పటివరకు రూ.112 కోట్ల నిధులు విడుదలయ్యాయి.
పక్కాగా పనులు..
పల్లె ప్రగతి నిధులతో పంచాయతీల్లో పాలకవర్గ సభ్యులు, పారిశుధ్య సిబ్బంది పక్కాగా పారిశుధ్య నిర్వహణ చేపడుతున్నారు. కరెంట్ చార్జీలు, ట్రాక్టర్ లోన్ చెల్లిస్తున్నారు. ప్రతిరోజూ చెత్తా చెదారాన్ని సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అక్కడ తడి, పొడి చెత్తను వేరుచేసి ఎరువులు తయారు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో అన్ని వసతులతో వైకుంఠధామాలు ఏర్పాటు కావడంతో గ్రామస్తులకు ఆఖరి మజిలీ కష్టాలు తీరాయి. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు అక్కడ సేద తీరుతున్నారు. పథకంలో భాగంగా ఇప్పటికే పాలకవర్గాలు శిథిల భవనాలు కూల్చివేయించారు. పాడుబడిన బావులను పూడ్పించారు. ఖాళీస్థలాల్లోని పిచ్చిమొక్కలను తొలగింపజేశారు. ఈ చర్యలతో సీజనల్ వ్యాధులు పూర్తిగా దూరమయ్యాయి.
ప్రతి వీధిలో డ్రైనేజీ కాలువలు నిర్మించడం, సీసీ రోడ్లు నిర్మించడంతో గ్రామస్తుల ఇబ్బందులు తప్పాయి. జిల్లావ్యాప్తంగా 1,240 హ్యాబిటేషన్లలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటయ్యాయి. ఎకరా స్థలంలో ఏర్పాటు చేసిన ఒక వనంలో నాలుగు వేల మొక్కలు పెరుగుతున్నాయి. ఒక్కో వనానికి ప్రభుత్వం రూ.9 లక్షల చొప్పున కేటాయించింది. వనాల్లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడంతో ఉదయం సాయంత్రం గ్రామస్తులు వ్యాయామం చేస్తున్నారు. ప్రతి పంచాయతీకి కేటాయించిన 10 శాతం ప్రీ బడ్జెట్ నుంచి ప్రకృతి వనాలకు నిధుల కేటాయింపు జరిగింది. ఇవేకాక ప్రతి మండలానికి పది ఎకరాల చొప్పున ఒక బృహత్ పల్లె ప్రకృతి వనం కూడా ఏర్పాటైంది.
గ్రామాభివృద్ధి కోసమే ప్రతి నెలా నిధులు
పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయి. పథకం కింద ప్రభుత్వం గ్రామాభివృద్ధి కోసం ప్రతి నెలా పంచాయతీలకు రూ.9.32 కోట్ల నిధులు విడుదల చేస్తున్నది. నిధులతో పంచాయతీ పాలకవర్గాలు గ్రామస్తులకు మౌలిక వసతులు కల్పిస్తున్నాయి. పారిశుధ్య నిర్వహణ చేపడుతున్నాయి. మొక్కలను సంరక్షిస్తున్నాయి.
– రమాకాంత్, జిల్లా పంచాయతీ అధికారి
సీఎం సారథ్యంలో పల్లెలు అభివృద్ధి
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయి. మారుమూల గ్రామాలకు రోడ్లు, డ్రైన్లు, ప్రతి గ్రామానికి పల్లె ప్రకృతి వనం, డంపింగ్యార్డుతోపాటు ట్రాక్టర్ను ప్రభు త్వం మంజూరు చేసింది. పల్లెలు పచ్చగా ఉండేందుకు ప్రకృతి వనాలతోపాటు అవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సీఎం కేసీఆర్ కలలు కన్న బంగారు తెలంగాణలో భాగస్వాములవుతున్నందుకు మాకు ఆనందంగా ఉంది.
– లావుడ్యా మంగమ్మ, సర్పంచి, సీతంపేట బంజర