కొత్తగూడెం కల్చరల్/ లక్ష్మీదేవిపల్లి/ పాల్వంచ రూరల్/ పాల్వంచ/ జూలూరుపాడు, మే 25 : కొత్తగూడెం నియోజకవర్గంలో బుధవారం హనుమజ్జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఎంజీరోడ్లో ఉన్న శ్రీ విజయవిఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ సువర్చలా ఆంజనేయ స్వామివారి దివ్య కల్యాణాన్ని అర్చకులు జరిపించారు. స్వామికి పుష్పార్చన, ఒంటె వాహనంపై సువర్చలాంజనేయ స్వామివారిని గ్రామోత్సవం చేశారు. భక్తులకు నీరాజన మంత్రపుష్పం, తీర్ధప్రసాద వితరణ చేశారు. ఆలయ ఈవో సులోచన ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. లక్ష్మీదేవిపల్లి మొర్రేడువాగు ఒడ్డున ఉన్న హనుమాన్ టెంపుల్లో 108 మామిడిపండ్లతో హనుమాన్ చాలీసా పారాయణం, సింధూర అలంకరణ, విశేషాలంకరణ, నూతన వస్ర్తాలంకరణ, నగర సంకీర్తన నిర్వహించారు.
పాల్వంచ మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయంలో పత్రపూజ చేసి, పంచామృతాలతో అభిషేకం చేశారు. కిన్నెరసాని, యానంబైలులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాల్వంచ పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆంజనేయస్వామి వారిని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు దర్శించుకొని పూజలు చేశారు. 800మంది భక్తులకు అన్నదానం చేశారు. పాల్వంచ శాస్త్రీరోడ్లో ఉన్న శ్రీ సీతారామాలయం భజనమందిరంలో పంచామృతాభిషేకాలు, తమలపాకు పూజలు, సూర్యాపేట జిల్లా గుడిమల్కాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వరస్వామి భక్తి భజన బృందంతో 41సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయించారు. జూలూరుపాడు మండలంలోని పాపకొల్లు, కాకర్ల, గుండెపుడి, పడమటనర్సాపురం, బేతాళపాడు గ్రామాల్లో భక్తులు ప్రత్యేక పూజలు గోత్రనామార్చనలు, అభిషేకాలు నిర్వహించి శోభాయాత్రలు నిర్వహించారు. పూజల్లో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.