ఖమ్మం రూరల్, మే 22: గతంలో ఎడారిని తలపించిన పొన్నెకల్లు గ్రామం నేడు పచ్చందాల పొదరిల్లుగా మారింది. మండల కేంద్రానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో, జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఈ పొన్నెకల్లు మొక్కల పెంపకంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. గ్రామస్తులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ బాధ్యులు, గ్రామ అధికారులు సమన్వయంతో హరితహారంలో ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. సీఎం కేసీఆర్ ఎంతో దూరదృష్టితో ప్రవేశపెట్టిన పల్లెప్రగతి ద్వారా గ్రామంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇతర గ్రామాల మాదిరిగానే ఈ గ్రామంలో సైతం వైకుంఠధామం, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు.
నాటిన ప్రతి మొక్కనూ బతికించేందుకు వారు పడిన శ్రమ.. నేడు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందేందుకు దోహదం చేశాయి. ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా అవెన్యూ ప్లాంటేషన్ ద్వారా గతంలో నాటిన వెయ్యి మొక్కలు నేడు గ్రామస్తులకు నీడనిస్తున్నాయి. ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. నిత్యం నీరు పోయడం, పశువుల నుంచి కాపాడుకునేందుకు ప్రతి చెట్టుకూ ట్రీగార్డు ఏర్పాటు చేయడంతో 99 శాతం మొక్కలను బతికించుకునేందుకు మార్గం సుగమమైంది. మొక్కలను నాటడంతోపాటు కాపాడి పెద్ద చేసిన సందర్భంగా నిరుడు ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డును సొంతం చేసుకుంది.
పబ్లిక్ పార్కులను తలపించేలా..
పల్లె ప్రగతిలో భాగంగా గతేడాది ఏర్పాటు చేసిన వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం.. పబ్లిక్ పార్కులను తలపిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. గ్రామ సమీపంలోని ఎకరా సువిశాల స్థలంలో పంచాయతీ పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసింది. వివిధ ప్రాంతాల నుంచి 200 రకాల పూలు, పండ్లు, ఇతర రకాల మొక్కలు తీసుకువచ్చింది. పార్కులో ఉదయం, సాయంత్రం గ్రామస్తులు నడిచేందుకు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. గతేడాది నాటిన మొక్కలు ఇప్పటికే పూలు, పండ్లను అందిస్తున్నాయి. అగ్రి ఫారెస్టుకు అద్దం పట్టే విధంగా టేకు, నల్లమద్ది, తెల్ల ఉసిరి, నల్ల ఉసిరి, నేరేడు, దేవకాంచన, స్వీట్ లెమన్, సీతాఫలం వంటి చెట్లతోపాటు దాదాపుగా 30 రకాల పూల మొక్కలు గ్రామస్తులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ప్రస్తుతం నీటి ఎద్దడి ఉన్నప్పటికీ మొక్కలను బతికించుకునేందుకు సిబ్బంది పార్క్ సమీపంలోని ఓ రైతు బావి నుంచి మొక్కలకు అందిస్తున్నారు. ప్రతిరోజు గ్రామ ప్రజలు ఉదయం, సాయంత్రం ఇక్కడికి వచ్చి సేదతీరుతుండడం విశేషం.
నర్సరీ నిర్వహణ భేష్..
ఉపాధి పథకంలో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీ నిర్వహణపై ఉన్నతాధికారులు నుంచి ప్రశంసలు అందుతున్నాయి. గతేడాది ఓ ప్రైవేట్ భూమిలో నర్సరీ నిర్వహణ కొనసాగింది. ఆరు నెలల క్రితం ప్రభుత్వ భూమిలో వైకుంఠధామం సమీపంలో ఏర్పాటు చేసిన ఈ నర్సరీ రోడ్డుపైపు నుంచి వస్తున్న ప్రయాణికులను ఎంతగానో ఆకర్షిస్తున్నది. మొక్కలు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకొనేందుకు గ్రీన్నెట్లు సైతం ఏర్పాటయ్యాయి. సిబ్బంది గోరింటాకు, గులాబీ, టేకుతో పాటు ఇతర మెక్కలను పెంచుతున్నారు. ప్రస్తుతం నర్సరీలో 2,400 మొక్కలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కలెక్టర్ వీపీ గౌతమ్, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి నర్సరీని సందర్శించారు. ఇటీవల నర్సరీ జిల్లాలోనే ఉత్తమ నర్సరీగా ఎంపికైంది. గ్రామస్తులు, రైతులు ఇక్కడ పెరిగిన మొక్కలనే పొలాలు, ఇంటి ఆవరణలో పెంచుతున్నారు. హరితహారానికీ నర్సరీలో పెరిగిన మొక్కలనే వినియోగిస్తున్నారు.
నాటిన ప్రతి మొక్కనూ బతికించుకున్నాం..
గ్రామంలోని ప్రధాన వీధులతో పాటు జాతీయ రహదారి నుంచి గ్రామానికి వచ్చే రోడ్డుకు ఇరువైపులా సుమారు వెయ్యి మొక్కలను నాటాం. ట్రీగార్డులు సైతం ఏర్పాటు చేశాం. వైకుంఠధామంలో మరో 500 మొక్కలు నాటాం. పల్లెపకృతి వనంలో మరో 4 వేల మొక్కలు నాటాం. నాటిన మొక్కల సంరక్షణకు కోసం ఆరుగురు సిబ్బందిని నియమించాం. మరో ఇద్దరు వాచర్లు మొక్కలను పర్యవేక్షిస్తున్నారు. నర్సరీలో 24 వేల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి.
–తాటికొండ సుదర్శన్రావు, సర్పంచ్, పొన్నెకల్లు