లక్ష్మీదేవిపల్లి, మే 22: ప్రజలకు నాణ్యమైన, కోతలు లేని విద్యుత్ను సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఏ ఇతర రాష్ట్రంలోనూ లేనట్లుగా మండు వేసవిలోనూ ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు ట్రాన్స్కో అధికారులు అనేక కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి పాలనలో వేసవి కాలం వచ్చిందంటే చాలు.. పగటి పూటనే దాదాపు 6 గంటల కంటే ఎక్కువ సమయంలో విద్యుత్ కోతలు ఉండేవి. తెలంగాణ సిద్ధించాక టీఆర్ఎస్ ప్రభుత్వం కోతలకు చెక్ పెట్టింది. ఇటు గృహావసరాలకు, అటు వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు నిరంతరం విద్యుత్ను అందిస్తోంది. పరిశ్రమల్లో పవర్ హాలీడే అనే మాటే మటుమాయమైంది. ఇలాంటి పరిస్థితుల్లో వినియోగదారులు విద్యుత్ పొదుపుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. విద్యుత్ వృథాను అరికడితే విద్యుత్ను ఉత్పత్తి చేసినంత లాభం చేకూరినట్లే. పొదుపుతోపాటు వినియోగదారులు అవనసర విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
జాగ్రత్తగా ఉందాం..
ఇంకో నెల రోజుల తరువాత వర్షాకాలం వస్తుంది. ఈ సమయంలో వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతుంది. రైతులు వ్యవసాయ మోటార్లను వినియోగిస్తుంటారు. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తెగి పడిన విద్యుత్ తీగెలను, వర్షాల కారణంగా విరిగిన విద్యుత్ స్తంభాలను ముట్టుకోవడం వల్ల విద్యుత్ ప్రమాదాలు సంభవిస్తాయి. వీటిని గమనించినప్పుడు సమీపంలోని విద్యుత్ అధికారులకు తెలియజేయాలి. అలాగే అనుమతి లేని వ్యక్తులు, వినియోగదారులు.. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు ఫ్యూజులు మార్చడం, సర్వీస్ వైర్లు, వీధి దీపాలను సరిచేయడం వల్ల ప్రమాదాలకు గురవుతారు. అందువల్ల అనుమతి ఉన్న వ్యక్తులు మాత్రమే వీటిని సరిచేయాలి.
వ్యవసాయ పంపు సెట్లు వినియోగించేటప్పుడు కరెంట్ మోటర్ల పుట్వాల్వ్లు, సర్వీస్ వైర్లకు ఇన్సులెషన్ సరిగా లేకపోవడం వల్ల విద్యుత్ ప్రసారం జరిగి ఏమరుపాటులో వాటికి తాకడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి. వీటిని ఉపయోగించే ముందు జాగ్రత్తలు పాటించాలి. విద్యుత్ వైర్లకు దగ్గరగా జీవీ వైర్లను దండెంలా కట్టవద్దు. చార్జింగ్ పెట్టి సెల్ఫోన్ మాట్లాడడంతో కొన్నిసార్లు చార్జింగ్ వైర్కు విద్యుత్ ప్రసారం జరిగి ప్రమాదాలు జరుగుతాయి. దీనిని గమనించాలి.
ఇలా పొదుపు చేద్దాం..
-విద్యుత్ వినియోగాన్ని అరికడితే అటు సంస్థకు ఉత్పత్తి భారాన్ని తగ్గించడంతోపాటు వినియోగదారుడు అధిక బిల్లుల నుంచి ఉపశమనం పొందినట్లు అవుతుంది. ఈ దిశగా విద్యుత్ పొదుపుపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించినట్లయితే మెరుగైన సేవలను పొందేందుకు వీలు కలుగుతుంది.
-సాధారణ గుండ్రటి ఫిలమెంట్ బల్బులకు బదులుగా కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బులు వాడాలి.
-ఇళ్లల్లో వినియోగించే ఫ్రిజ్ను గాలి ఎక్కువగా తగిలే ప్రదేశంలో అమర్చుకోవాలి. దీనివల్ల విద్యుత్ వాడకం తగ్గుతుంది. అలాగే ఫ్రిజ్ గ్యాస్ కిట్ను పరిశీలించి ఏమైనా లీకేజీ గమనిస్తే వెంటనే సరిచేయడం, మార్చడం వల్ల విద్యుత్ చాలా ఆదా అవుతుంది.
-టీవీని రిమోట్తో ఆఫ్ చేసినా విద్యుత్ వినియోగం అవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని టీవీకి వచ్చే పవర్ స్విచ్ను ఆఫ్ చేయాలి. జీరో బల్బులను వినియోగిస్తే కొంత విద్యుత్ ఆదా అవుతుంది.
-ఇక అత్యంత ప్రాముఖ్యత కలిగింది గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్లు, లైట్లను ఆఫ్ చేయడం మర్చిపోవద్దు.
-ఎలక్ట్రికల్ వాటర్ హీటర్, ఎలక్ట్రికల్ గీజర్లకు బదులుగా సోలార్ వాటర్ హీటర్లను వాడాలి.
-ఒక రోజు ఒక యూనిట్ విద్యుత్ను ఆదా చేస్తే జీవితకాలంలో రూ.లక్ష పొదుపు చేసినట్లు అవుతుంది.