ఖమ్మం ఎడ్యుకేషన్, మే 22: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించేలా నిబంధన అమలు చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలకు మొత్తం 17,592 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లా వ్యాప్తంగా రెగ్యులర్ పరీక్షలకు 46 జోన్లుగా విభజించి పరీక్షలను నిర్వహించనున్నారు. 104 కేంద్రాల్లో పరీక్షలు జరుగనున్నాయి. 104 మంది వైద్య సిబ్బంది (ఏఎన్ఎం) పరీక్ష కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంటారు. సిట్టింగ్ స్కాడ్ బృందాల్లో 104 మంది, ఫ్లయింగ్ స్కాడ్ బృందాల్లో ఆరుగురు ఉండి పరీక్షలను పర్యవేక్షించనున్నారు. 1,003 మందికి పైగా ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వర్తించనున్నారు. కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులుంటే హెల్ప్లైన్ నెంబర్ 8331851510కు ఫిర్యాదు చేసేలా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసినట్లు డీఈవో యాదయ్య తెలిపారు.
ఫ్లయింగ్ స్కాడ్స్తో డీఈవో సమావేశం..
కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సిబ్బందికి సూచనలు అందజేస్తూ సక్రమంగా పరీక్షలు పూర్తి చేయనున్నారు. ఈ మేరకు ఆదివారం డీఈవో కార్యాలయంలో ఫ్లయింగ్ స్కాడ్స్తో డీఈవో సమావేశమయ్యారు. తిరుమలాయపాలెం, బచ్చోడు, సుబ్లేడ్, పిండిప్రోలు ప్రభుత్వ పాఠశాలల్లోని కేంద్రాలను తనిఖీ చేశారు.
నిరంతర పర్యవేక్షణ..
పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు డీఈవో యాదయ్య నిత్యం పర్యవేక్షిస్తున్నారు. పరీక్ష కేంద్రాల ఎంపిక నుంచి ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్లుగా కేటాయించే ప్రక్రియ వరకు అన్నింట్లోనూ నిబంధనలు పాటిస్తూ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కేంద్రంలో కీలకంగా వ్యవహరించే చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు ప్రత్యేక సూచనలిచ్చారు.
16 మందికి సహాయకులుగా అనుమతి..
పరీక్షలు రాసే వారిలో మూగ, చెవిటి, అంధ విద్యార్థులకు సహాయకుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతిచ్చారు. జిల్లాలో మూగ, చెవిటి కేటగిరిలో ఏడుగురు, అంధ విభాగంలో ఆరుగురు, ప్రమాదం జరిగిన సంఘటనలు ఉన్న విద్యార్థులు ముగ్గురు దరఖాస్తు చేసుకోగా వారికి పరీక్షల విభాగం డైరెక్టర్ అనుమతిచ్చారు.