మణుగూరు రూరల్, మే 22 : జూన్ 3వ తేదీ నుంచి 15రోజుల పాటు నిర్వహించే నాల్గో విడుత పట్టణ ప్రగతి పనులను సమర్థంగా నిర్వహించాలని వార్డులు, పట్టణంలో పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం పంచాయతీరాజ్, మున్సిపాలిటీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతేడాది పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన కార్యక్రమాలతోపాటు నాల్గో విడుత పట్టణ ప్రగతిలో చేపట్టబోయే కార్యక్రమాలను ముందుగానే కార్యాచరణ రూపొందించుకుని అందుకనుగుణంగా పనులు చేపట్టాలన్నారు.
బుక్లెట్ను తయారు చేసుకుని ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలన్నారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఖాళీగా ఉన్న నివాసాలను గుర్తించి వాటిలో చెత్తను తొలగించి మురుగుకాల్వల్లో చెత్తను వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల అవసరాలకు ఉపయోగపడే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మణుగూరు ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ మాధవి, ఏఈ సత్యనారాయణ, పంచాయతీరాజ్ ఏఈ రెయిన్హార్డ్ పాల్గొన్నారు.
కష్టపడి పనిచేసే వారికి భవిష్యత్తు; ఎమ్మెల్యే రేగా
పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని టీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. నియోజకవర్గ టీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా తాళ్లపల్లి రాహుల్గౌడ్ని నియమించగా, ఆ విభాగ రాష్ట్ర కార్యదర్శి ఎన్ఎన్ రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నియామక పత్రాన్ని ఆదివారం క్యాంపు కార్యాలయంలో రాహుల్కి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్న టీఆర్ఎస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడానికి గులాబీ శ్రేణులంతా సమష్టిగా పని చేయాలన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు స్వరాష్ట్రం సాధించిపెట్టిన ఘనత ఉద్యమనేత సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్కే దక్కుతుందన్నారు.
పేద ప్రజల రైతులు మహిళలు అన్నివర్గాల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరేలా చూడాలన్నారు. సీఎం కేసీఆర్ పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. రాహుల్గౌడ్ని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్గౌడ్ మాట్లాడుతూ టీఆర్ఎస్వీ బలోపేతానికి కృషి చేస్తానని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. విద్యార్థి విభాగం బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు వట్టం రాంబాబు, యూత్ నాయకులు సాగర్, హర్షనాయుడు, రుద్రవెంకట్, సిరికొండ శ్యాంసుందర్, భరత్, గుర్రం సృజన్ పాల్గొన్నారు.