భద్రాద్రి కొత్తగూడెం, మే 22 (నమస్తే తెలంగాణ) : చదువుల వెలుగు భాగ్యరెడ్డి వర్మ సేవలను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలో పాల్గొని భాగ్యరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారినవర్గాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు అమోఘమన్నారు. వెనుకబడిన వర్గాల వారు చదువులకు దూరంగా ఉంటే వారికి రాత్రి బడులు పెట్టి విద్యపై ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. తొలిసారిగా హైదరాబాద్ ఇసామియాలో బాలికల విద్యాభివృద్ధి కోసం తెలుగు మీడియం పాఠశాల ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.
ముఖ్యంగా మహిళల అభివృద్ధికి పొదుపు సంఘాలను ఏర్పాటు చేశారని తెలిపారు. సాంఘిక దురాచారాలపై వ్యాసాలు రాసి ప్రజల్ని చైతన్యపరిచారని పేర్కొన్నారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న బాల్యవివాహాలు, జోగిని వ్యవస్థ నిర్మూలన కోసం పాటుపడ్డారని తెలిపారు. బస్తీల్లో ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారని, ఇలాంటి గొప్ప వ్యక్తుల ఆశయసాధన కోసం మనందరం కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్సీ అభివృద్ధిశాఖ అధికారి డి.అనసూర్య, మైనారిటీ సంక్షేమ అధికారి సంజీవరావు, భూగర్భ జలవనరుల అధికారి బాలు, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రవిశంకర్, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.