చర్ల, మే 20 : ఏజెన్సీ పల్లెలు మురిసిపోతున్నాయి. నాడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఏజెన్సీ గ్రామాలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయి. తాగునీటికి అరిగోస పడిన గిరిబిడ్డలకు మిషన్భగీరథ దాహర్తి తీర్చింది. పారిశుధ్య సమస్యతో వ్యాధులు, అంటురోగాలతో సతమతమైన పల్లెల్లో నేడు స్వచ్ఛ వాతావరణం స్వాగతం పలుకుతున్నది. ఎప్పటికప్పుడు చెత్తాచెదారాన్ని డంపింగ్యార్డులకు తరలిస్తుండడంతో ఈగలు, దోమలజాడ మచ్చుకైనా కనిపించడం లేదు. కంకర తేలిన దారులు సీసీ రోడ్లుగా మారాయి. ఇదీ తెలంగాణ పల్లెల్లో ‘పల్లె ప్రగతి’ తీసుకొచ్చిన మార్పు..
ఒకప్పుడు ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజల ను పట్టి పీడించిన సీజనల్, అంటువ్యాధులు ఇప్పుడు ఆమడ దూరంలో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని అమలు చేయడం, అందులోనూ పారిశుధ్యానికి అధిక ప్రా ధాన్యం ఇవ్వడంతో పారిశుధ్యం మెరుగుపడింది. దీనికితోడు మురికి వాడల్లోనూ సిమెంట్ రోడ్లు వేసి సైడు కాలువలు నిర్మించడంతో అప్పటి వరకూ అక్కడ తిష్టవేసినట్లుగా ఉన్న బురద మటుమాయమైంది. ఇక డం పింగ్ యార్డులు ఏర్పాటు చేయడం, వీధుల్లో ట్రాక్టర్ల ద్వారా సేకరించిన చెత్తను అక్కడికి తరలించడంతో గ్రా మాలాన్నీ పరిశుభ్రంగా ఉంటున్నాయి. దీంతో ఈగలు, దోమలు లేకపోవడంతో వ్యాధులు జాడే లేకుం డా పోయింది. ఇక డంపింగ్ యార్డుల్లోని తడి, పొడి చెత్తలను రీసైకిల్ చేసి వర్మీ కంపోస్టు తయారు చేయడంతో పంచాయతీలకు ఆదాయమూ సమకూరుతోంది. దీంతో పల్లె వాసులంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
జాడలేని అంటు రోగాలు..
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో పల్లెల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. మట్టి రోడ్లు, వర్షం వస్తే ఇళ్ల చుట్టూ చేరే మురుగునీళ్లు వంటివి లేకపోవడంతో అన్ని గ్రామాల్లోనూ అంటురోగాల జాడ లేకుండా పోయింది. పారిశుధ్య కార్యక్రమాల్లో భాగంగా డ్రెయిన్లలో పూడిక తీత, రోడ్ల పక్కన, ఇళ్ల మధ్యలో ఉన్న మురుగునీటి తొలగింపు వంటి చర్యలను పంచాయతీ అధికారులు ఎప్పటికప్పుడు చేపట్టడంతో వ్యాధి కారక దోమలు పత్తా లేకుండా పోయాయి. గ్రామ పంచాయతీల ప్రత్యేక వాహనాల ద్వారా సేకరించిన చెత్త, ఇతర వ్యర్థ పదార్థాలను రీ సైకిల్ చేసి వర్మీకంపోస్టు తయారు చేయడంతో ప్రతి పంచాయతీకి నెలకు అదనంగా రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఆదాయం వస్తోంది.
మురికివాడల్లో సిమెంట్ రోడ్లు..
పల్లెప్రగతి ద్వారా చేపట్టిన పనుల్లో పల్లె ప్రాంతాల్లో ప్రజల అభినందనలను అందుకుంటున్న మరో కార్యక్రమం సీసీ రోడ్ల నిర్మాణం. వర్షాకాలంలోనైనా, మామూలు రోజుల్లోనైనా నడిచేందుకు కూడా వీలులేకుని అంతర్గత రహదారులు ఇప్పుడు మెరిసిపోతున్నాయి. అంతర్గత రోడ్లను సిమెంట్, కాంక్రీట్తో నిర్మించడంతో వర్షాకాలంలోనూ అవి అద్దంలా మెరుస్తున్నాయి. చర్ల మండలంలోని 26 గ్రామ పంచాయతీల్లోనూ ఇదే విధమైన అభివృద్ధి కన్పిస్తోంది. మన్యం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పారిశుధ్య పనుల వల్లే రోగాలు తగ్గాయి..
మా గ్రామంలో ఇంతకుముందు చెత్తా చెదారం ఎక్కడపడితే అక్కడ పేరుకు పోయేది. ఇళ్ల చుట్టూ మురుగునీరు చేరి దోమలు పెరిగేవి. అవి విజృంభించడం ద్వారా సీజనల్ జ్వరాలు చుట్టుముట్టేవి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెప్రగతి పేరుతో చేస్తున్న పనుల వల్ల గ్రామంలో చాలా మార్పు వచ్చింది. పంచాయతీ వాళ్లు ప్రత్యేక వాహనాలను తీసుకొచ్చి ప్రతి రోజూ ఇంటి నుంచి చెత్త తీసుకెళ్తున్నారు. దూరంగా డంపింగ్ యార్డులో వేస్తున్నారు. దీంతో అంటురోగాలు రావట్లేదు. జ్వరాలు లేవు.
–శ్యామల పాపమ్మ, జీపీ పల్లి, మొగళ్లపల్లి పంచాయతీ
పారిశుధ్యం మెరుగుపడింది..రహదారి సౌకర్యం వచ్చింది..
గతంలో పారిశుధ్యం పరిస్థితి అధ్వానంగా ఉండేది. వీధుల్లో చెత్త పేరుకుపోయి దుర్వాసన వచ్చేది. ఇప్పుడు గ్రామంలో ఏరోజు చెత్తను ఆ రోజు తీసుకెళ్తున్నారు. ఎప్పటికప్పుడు వీధులను శుభ్రం చేస్తున్నారు. ఇళ్ల పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటున్నాయి. అంతేగాక ప్రతి వీధిలోనూ సీసీ రోడ్లు నిర్మించారు. ఇంతకుముందు ఆ వీధుల్లో నడవాలంటే మోకాళ్ల లోతున బురద ఉండేది. సిమెంటు రోడ్లు వేశాక ఆ ఇబ్బందులు తప్పాయి.
–మాన్యం పురుషోత్తమరావు, చర్ల గ్రామ పంచాయతీ