ఖమ్మం ఎడ్యుకేషన్, మే 20: ఇంటర్మీడియట్ జవాబు పత్రాల వాల్యూయేషన్లో పటిష్ట జాగ్రత్తలు తీసుకుంటూ నిర్లక్ష్యానికి తావివ్వకుండా నిర్ణీత పద్ధతి ప్రకారం మూల్యాంకనం చేసేలా నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. జిల్లాకు గతం కంటే అధికంగా 25 వేల సమాధాన పత్రాలు వచ్చాయి. జూన్ 10లోగా స్పాట్ ముగుస్తుందని అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లు పేర్కొంటున్నారు. జూన్ 20 నాటికి పరీక్షల ఫలితాలను విడుదల చేసేలా బోర్డు చర్యలు తీసుకుంటోంది.
రేపటి నుంచి ప్రధాన సబ్జెక్టులు..
ఇప్పటి వరకు సంస్కృతం సబ్జెక్టుకు సంబంధించిన 6 వేల పేపర్లను వాల్యూయేషన్ చేశారు. ఈ నెల 22 నుంచి ప్రధాన సబ్జెక్టుల్లో వాల్యూయేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఆయా సబ్జెక్టుల చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లకు రిపోర్ట్ చేశారు. పరీక్షలు జరుగుతుండగానే కంట్రోల్ రూముకు సమాధాన పత్రాలు చేరుకున్నాయి. సమాధాన పత్రాల ఆధారంగా ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో పనిచేసే సీనియర్ అధ్యాపకులకు, ఇంటర్ పరీక్షల నిర్వహణలో భాగస్వామ్యులు కాని అధ్యాపకులు వెనువెంటనే వారికి కేటాయించిన స్పాట్ విధుల్లో నిమగ్నమయ్యారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్పాట్లో పాల్గొనున్నారు.
నాలుగు స్పెల్స్లో..
ఈ నెల 12న సంస్కృతం పేపర్ వాల్యూయేషన్ ప్రారంభమైంది. ఫస్ట్ స్పెల్లో ఈ నెల 22 నుంచి ఇంగ్లిష్ పేపర్ 1, 2; తెలుగు పేపర్ 1, 2; హిందీ పేపర్ 1, 2; గణితం పేపర్ 1 (ఏ), 1 (బీ), 2 (ఏ) (బీ); పొలిటికల్ సైన్స్ 1, 2 వాల్యూయేషన్ చేయనున్నారు. సెకండ్ స్పెల్లో ఈ నెల 26 నుంచి ఫిజిక్స్ పేపర్ 1, 2; ఎకనమిక్స్ పేపర్ 1, 2; థర్డ్ స్పెల్లో ఈ నెల 28 నుంచి కెమిస్ట్రీ పేపర్ 1, 2; కామర్స్ పేపర్ 1, 2; ఫోర్త్ స్పెల్లో ఈ నెల 31 నుంచి హిస్టరీ పేపర్ 1, 2; బోటనీ పేపర్ 1, 2; జువాలజీ పేపర్ 1, 2 వాల్యూయేషన్ చేయనున్నారు.
3,85,852 సమాధాన పత్రాలు..
జిల్లాలో జరుగుతున్న క్యాంపునకు ఉన్నతాధికారులు 3,85,852 సమాధాన పత్రాలను కేటాయించారు. అవి స్పాట్ కేంద్రానికి చేరుకున్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో భాగంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఆన్సర్ షీట్లు పొందుపరిచారు. ఈ వాల్యూయేషన్ ప్రక్రియలో రెండు జిల్లాలకు (ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం) సంబంధించిన అధ్యాపకులు పాల్గొంటారు. వీటిల్లో తెలుగు13,001, సంస్కృతం-31,061, హిందీ-4,820, ఇంగ్లిష్-73,490, గణితం (ఏ)-32,617, గణితం (బీ)లో-33,029, బోటనీ-20,236, జువాలజీ-19,475, సివిక్స్-17,924, హిస్టరీ-1,998, భౌతికశాస్త్రం-45,322, కెమిస్ట్రీ-46,250, కామర్స్-21,238, ఎకనమిక్స్-23,261 పత్రాలు ఉన్నాయి. వాల్యూయేటర్లతో పాటు కంట్రోల్ అధికారులు, కోడింగ్ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వాల్యూయేషన్ స్టేటస్ను ఉన్నతాధికారులకు నివేదిస్తుంటారు. ప్రతి రోజూ క్యాంప్ ఆఫీసర్తో బోర్డు సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ క్యాంపు పరిస్థితులను పర్యవేక్షిస్తారు.
పూర్తి సౌకర్యాలు..
నయాబజార్ కేంద్రంలో పూర్తి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బోర్డు అందజేస్తున్న బడ్జెట్తోపాటు కళాశాల ప్రిన్సిపాల్ రామారావు ప్రత్యేకంగా దృష్టి సారించి కళాశాలలో అన్ని వసతులు కల్పించారు. లైట్లు, కూలర్లు, ఫ్యాన్లు అమర్చారు. మంచినీటితోపాటు ఇతరత్రా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. హరితహారం మొక్కలు చల్లని గాలిని అందిస్తున్నాయి.
11 సీసీ కెమెరాల నిఘా మధ్య..
స్పాట్ కేంద్రంలో పటిష్ట భద్రతతోపాటు సీసీ కెమెరాలను అమర్చారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా, స్పాట్లోని అన్ని పరిసరాలూ కనిపించేలా 11 అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
2,121 మంది భాగస్వామ్యం..
పరీక్షల మూల్యాంకనంలో అన్ని హోదాల్లో 2,121 మంది విధులను నిర్వర్తిస్తున్నారు. క్యాంప్ ఆఫీసర్గా జిల్లా ఇంటర్ విద్యాధికారి కే.రవిబాబు వ్యవహరిస్తున్నారు. అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లలో జనరల్-1లో నయాబజార్ కళాశాల ప్రిన్సిపాల్ కేఎస్ రామారావు, జనరల్-2లో వీరభద్రం విధులు నిర్వర్తిస్తున్నారు. 1,830 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 110 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 113 మంది స్క్రూటినైజర్లు, 10 మంది సబ్జెక్ట్ నిపుణులు, 45 మంది ఏసీవోలు, 10 మంది స్ట్రాంగ్ రూమ్, ప్యాకింగ్, కోడింగ్ విభాగాల బాధ్యులు పనిచేస్తున్నారు.