డెయిరీ యూనిట్ల లబ్ధిదారులకు శిక్షణ ఇవ్వాలి
అధికారుల సమావేశంలో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్
మామిళ్లగూడెం, మే 20: దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ను మరింత వేగవంతం చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. గ్రౌండింగ్ పురోగతిపై చింతకాని మండలంతోపాటు నియోజకవర్గాల స్థాయి ప్రత్యేక అధికారులు, సెక్టార్ యూనిట్ గ్రౌండింగ్ అధికారులతో కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డెయిరీ యూనిట్ల పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని, ఇప్పటికే డెయిరీ యూనిట్ల లబ్ధిదారులకు విడుదల చేసిన నిధులతో షెడ్ల పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆధికారులను ఆదేశించారు. పశుగ్రాసం కోసం అందించిన విత్తనాలు నాటే విధంగా పర్యవేక్షించాలన్నారు. గొర్రెల యూనిట్లకు దరఖాస్తు చేసుకున్న లభ్ధిదారులను క్షేత్రస్థాయిలో పెంపకందారుల వద్దకు తీసుకెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. డెయిరీ యూనిట్ల లబ్ధిదారులకు శిక్షణ అందించాలన్నారు. లబ్ధిదారులకు మంజూరైన యూనిట్లు పూర్తి స్థాయిలో వెంటనే గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సంబంధిత వెండర్లను సంప్రదించి యూనిట్లను అందించాలని సూచించారు. దీంతోపాటు ట్రాన్స్పోర్ట్ సెక్టార్, మొబైల్ టిఫిన్ సెంటర్లు, దాల్ మిల్లులు, ఫ్లోర్ మిల్లుల యూనిట్ల గ్రౌండింగ్కు సంబంధించి వెండర్స్తోపాటు లబ్ధిదారులకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే వృత్తి పరంగా నిర్వహించుకుంటున్న వివిధ రంగాల లబ్ధిదారులకు ఆయా యూనిట్లను వెంటనే గ్రౌండింగ్ చేయాలని సూచించారు. డీజే, సెంట్రింగ్, ఎలక్ట్రికల్ షాపుల యూనిట్లను లాఖరులోగా గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. ట్రాక్టర్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి ఇంజిన్తోపాటు వ్యవసాయ యంత్రాలను అనుసంధానం చేయాలని, దీనిపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, డీఆర్వో శిరీష, జడ్పీ సీఈవో అప్పారావు, ఎస్సీ అభివృద్ధి శాఖ ఇన్చార్జి అధికారి శ్రీరామ్, డీఎఫ్వో ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.