సారపాక/ జూలూరుపాడు, మే 20: స్నానం చేసేందుకు గోదావరిలోకి దిగి ముగ్గురు గల్లంతైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని మోతే పట్టీనగర్లో చోటుచేసుకున్నది. తెలిసిన వివరాల ప్రకారం.. చండ్రుగొండకు చెందిన సయ్యద్ రిహానా (35)కు ఇద్దరు కుమారులు. ఇమ్రాన్, ఇర్ఫాన్(11). ఆమె భర్త కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో రిహానా కూలి పనులకు వెళ్లి పిల్లలను పోషిస్తున్నది. శుక్రవారం ఆమె పిల్లలతో కలిసి జూలూరుపాడు మండలంలోని కాకర్లకు చెందిన ఆటోడ్రైవర్ రాయపూడి నర్సింహారావు (28) ఆటోలో భద్రాచలం చూడడానికి వచ్చింది. అక్కడి నుంచి స్నానం చేసేందుకు మోతే పట్టీనగర్లోని పుష్కరఘాట్కు వచ్చారు. స్నానం చేసేందుకు నర్సింహారావు, రిహానా, ఇర్ఫాన్ గోదావరిలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో దిగడంతో ముగ్గురూ గల్లంతయ్యారు. గమనించిన ఇమ్రాన్ కేకలు వేశాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చిన స్థానికులు నీట మునిగిన వారిని కాపాడడానికి యత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న ఎస్సై దారం సురేశ్ పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు ప్రారంభించారు. రాత్రి వరకు గాలించినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు.