ఖమ్మం, మే18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):ఖమ్మం జిల్లాకు ‘పెద్ద’ గౌరవం దక్కింది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో సీఎం కేసీఆర్ జిల్లాకు పెద్దపీట వేశారు. జిల్లా నుంచి ఇద్దరు పారిశ్రామికవేత్తలకు పెద్దల సభకు వెళ్లే అవ కాశం లభించింది. నగరానికి చెందిన వద్దిరాజు రవిచంద్రతోపాటు వేంసూరు మండలం కందుకూరుకు చెందిన బండి పార్థసారథిరెడ్డి రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికయ్యారు. వీరికి సీఎం కేసీఆర్ బీఫారాలు అందజేశారు. బీసీ నాయకుడిగా, పారిశ్రామిక వేత్తగా వద్దిరాజు రవిచంద్రకు మంచి పేరుంది. జిల్లా ప్రజలతో అవినాభావ సంబంధాలు కలిగిన ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా పదవి కట్టబెట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. బండి పార్థసారధిరెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయనకు సత్తుపల్ల్లితో విడదీయలేని అనుబంధం ఉంది. హెటిరో డ్రగ్స్ సంస్థను స్థాపించి సత్తుపల్లి ప్రాంతానికి చెందిన ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు. సామాజిక సేవకుడిగా, ఆధ్యాత్మికవేత్తగా ఆయనకు గుర్తింపు ఉంది.
రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో టీఆర్ఎస్ అధిష్ఠానం ఖమ్మం జిల్లాకు ప్రాధాన్యం ఇచ్చింది. పార్టీ జిల్లా నాయకుడు, గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్రతోపాటు వేంసూరు మండలం కందుకూరుకు చెందిన పారిశ్రామికవేత్త, హెటిరో డ్రగ్స్ అధినేత డాక్టర్ బండి పార్థసారథిరెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేసింది. ఈ మేరకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారికి బీఫారాలు అందజేశారు. రాష్ట్రంలో మూడు రాజ్యసభ సభ్యుల పదవులు ఖాళీ అవడంతో వాటికి ఎన్నిక జరగాల్సి ఉంది. వీటిలో రెండు పదవులను ఖమ్మం జిల్లాకే కేటాయించడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ అధిష్ఠానం ఖమ్మం జిల్లాకు ప్రాధాన్యం ఇస్తున్నదనడానికి ఇదే తార్కాణమని నాయకులు పేర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ మరింత పటిష్టమవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 10 శాసనసభ స్థానాలు, ఒక ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి పార్టీ అధినేత కేసీఆర్ ముందుచూపుతో వ్యవహరిస్తున్నారని వెల్లడిస్తున్నారు.
పారిశ్రామికవేత్త నుంచి పార్లమెంట్ వరకు వద్దిరాజు ప్రస్థానం..
బీసీ నాయకుడిగా, పారిశ్రామిక వేత్తగా వద్దిరాజు రవిచంద్రకు మంచి పేరుంది. జిల్లా ప్రజలతో అవినాభావ సంబంధాలు కలిగిన ఆయనకు రాజ్యసభ సభ్యుడి పదవి కట్టబెట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. టీఆర్ఎస్ నాయకుడిగా వద్దిరాజు రవిచంద్ర పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. గ్రానైట్ వ్యాపారుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. 2018ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన రవిచంద్ర తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో టీఆర్ఎస్లో చేరారు.
పార్టీకి విశిష్ట సేవలందించి పార్టీ అధినేత కేసీఆర్కు సన్నిహితుడయ్యారు. సామాజిక సేవకుడిగానూ రవిచంద్రకు మంచి గుర్తింపు ఉన్నది. సుదీర్ఘకాలం నుంచి ఖమ్మం జిల్లా ప్రజలతో అనుబంధం కొనసాగిస్తున్న ఆయన హుజురాబాద్ ఉప ఎన్నికలో పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం శ్రమించి గుర్తింపు పొందారు. ములుగు జిల్లాలో రెండేళ్లకు ఒకసారి నిర్వహించే మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర ఉత్సవ కమిటీ అధికారిక సభ్యుడిగా వ్యవహరించి భక్తులకు విశిష్ట సేవలు అందించారు.
పార్లమెంట్కు ‘బండి’ ప్రయాణం..
తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి సభ్యుడిగా కొనసాగుతున్న బండి పార్థసారథిరెడ్డి స్వస్థ లం ఖమ్మం జిల్లాలోని వేంసూరు మండలం కందుకూరు గ్రామం. 10వ తరగతి వరకు సొంత ఊర్లో చదివిన ఆయన ఇంటర్మీడియట్, డిగ్రీ సత్తుపల్లిలో పూర్తి చేశారు. సత్తుపల్ల్లితో ఆయనకు విడదీయలేని అనుబంధం ఉంది. 20ఏళ్ల క్రితమే ఆయన సత్తుపల్లిలో ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత హెటిరో డ్రగ్స్ సంస్థను స్థాపించి సత్తుపల్లి ప్రాంత నిరుద్యోగులకు సంస్థలో ఉపాధి అవకాశాలు కల్పించారు. సామాజిక సేవకుడిగా, ఆధ్యాత్మికవేత్తగా పార్థసారథిరెడ్డికి మంచి పేరుంది. ముఖ్యమంత్రి కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు.
వద్దిరాజు రవిచంద్ర బయోడేటా
పుట్టిన తేదీ: 22-03-1964
స్వస్థలం : ఇనుగుర్తి గ్రామం, కేసముద్రం మండలం, మహబూబాబాద్ జిల్లా.
విద్యార్హతలు: బీకాం
తల్లిదండ్రులు: కీర్తిశేషులు వద్దిరాజు నారాయణ, వెంకట నర్సమ్మ
కుటుంబ సభ్యులు: వద్దిరాజు విజయలక్ష్మి (భార్య), గంగుల గంగాభవాని- సందీప్(కూతురు-అల్లుడు), వద్దిరాజు సాయి నిఖిల్ చంద్ర-అనీల (కొడుకు-కోడలు)
వృత్తి : గ్రానైట్ వ్యాపారం
సంస్థ: గాయత్రి గ్రానైట్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఖమ్మం, వరంగల్
హోదా: మేనేజింగ్ డైరెక్టర్
చేపట్టిన పదవులు : తెలంగాణ గ్రానైట్ క్వారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ మున్నూరు కాపు ఆల్ అసోసియేషన్ జేఏసీ గౌరవ అధ్యక్షుడు, నేషనల్ యూనియన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్స్ గౌరవ అధ్యక్షుడు, శ్రీరాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రం వేములవాడ ముఖ్య సలహాదారుడు, సుమన్ షోటోకాన్ కరాటే స్పోర్ట్స్ అకాడమీ జాతీయ అధ్యక్షుడు, ఖమ్మం జిల్లా జూడో అసోసియేషన్ (ఒలింపిక్స్) అధ్యక్షుడు పదవులు చేపట్టారు.
బండి పార్థసారథిరెడ్డి బయోడేటా
తల్లిదండ్రులు: బండి శ్రీనివాసరెడ్డి-సోమాకాంతమ్మ
సోదరుడు: రమేష్రెడ్డి
పుట్టిన తేదీ: 06-03-1954
స్వస్థలం: కందుకూరు గ్రామం, వేంసూరు మండలం, ఖమ్మం జిల్లా
విద్యాభ్యాసం: వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన 10వ తరగతి వరకు కందుకూరులోని ప్రభుత్వ పాఠశాల, ఇంటర్మీడియట్, డిగ్రీ సత్తుపల్లిలో పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ, పీహెచ్డీ పూర్తి చేశారు. 1993లో ‘హెటిరోడ్రగ్స్’ను స్థాపించారు.
జిల్లాలో అరుదైన రికార్డు..
గతంలో ఖమ్మం జిల్లా నుంచి రాజ్యసభ సభ్యులుగా వామపక్ష పార్టీల నుంచి నల్లమల గిరిప్రసాద్, డాక్టర్ వై.రాధాకృష్ణమూర్తి ఎంపికయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు పర్యాయాలు రేణుకా చౌదరి ఎంపికయ్యారు. కానీ ఒకేసారి జిల్లాకు చెందిన ఇద్దరికి రాజ్యసభ సభ్యులుగా ఎంపీలుగా అవకాశం రావడం ఇదే మొదటి సారి. ఈ అరుదైన రికార్డును టీఆర్ఎస్ సొంతం చేసుకున్నది. జిల్లాతో రాజకీయ, వ్యక్తిగత అనుబంధం కలిగిన వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథిరెడ్డి రాజ్యసభ సభ్యులుగా ఎంపిక కావడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డికి సీఎం కేసీఆర్ బీఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన వారికి అభినందనలు తెలిపారు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
ఖమ్మం, మే 18: దివికొండ దామోదర్రావు, వద్దిరాజు రవిచంద్ర, డాక్టర్ బండి పార్థసారథిరెడ్డిని టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేసిన పార్టీ అధినేత కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు తెలిపారు. ప్రత్యేకించి ఖమ్మం జిల్లా నుంచి డాక్డర్ బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్రను ఎంపిక చేయడం ఆనందాన్నిచ్చిందన్నారు. అందరి సహకారంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.