భద్రాద్రి కొత్తగూడెం, మే 18 (నమస్తే తెలంగాణ) : వంటింట గ్యాస్ మంట పుట్టిస్తున్నది. గ్యాస్ కంటే కట్టెల పొయ్యే నయమనే పరిస్థితి దాపురించింది. పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పప్పులు ఉడకనంటున్నాయి. కూరగాయలు కుత కుత మంటున్నాయి. కేంద్రం తీరుతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అడ్డూఅదుపూలేని ధరలతో సామాన్యులు చితికిపోతున్నారు. వచ్చే అరకొర సంపాదన వీటికే పోతే బతుకు బండి ఎలా సాగుతున్నదని ప్రశ్నిస్తున్నారు. గతేడాది నుంచి ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్ మీద రూ.185 పెంచుకుంటూ వచ్చారు.ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.1100కి చేరింది. ధరల నియంత్రణలో బీజేపీ సర్కార్ పూర్తిగా విఫలం కావడంతో ఏం కొనాలన్నా.. తినాలన్నా.. భారంగా మారింది.
‘ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు..’ అన్నట్లుగా ఉంది సామాన్య, మధ్య తరగతి ప్రజల పరిస్థితి. నిత్యావసర ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటడడంతో ఏమీ మాట్లాడలేని పరిస్థితి సామాన్యుడి సంపాదనలో సింహభాగం వంటింటి సరుకుల ఖర్చులకే వెళ్తుండడంతో కుటుంబం గడవడం కష్టతరమవుతోంది. వంట గ్యాస్ ధర ఇప్పటికే రూ.వెయ్యి దాటింది. వంట గది సరుకుల్లో అధిక ధర దీనిదే. ఇక మిగిలిన నిత్యావసర సరుకులు అందనంత ధరల్లో ఉన్నాయి. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం మొత్తం వీటిపైనే పడుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
పేదోడి బతుకు బరువెక్కుతోంది. కేంద్ర ప్రభుత్వం అమాంతం పెంచిన ధరలతో సామన్యుడి తన బతుకు బండిని లాగడం కష్టమవుతోంది. నిరుటి నుంచి ప్రతి నెలా వంట గ్యాస్ ధరను పెంచుతూ వెళ్లిన కేంద్రం సామాన్యుడి బతుకును గుల్ల చేసింది. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను విపరీతంగా పెంచుతూ వచ్చింది. దీంతో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.1,100కి చేరింది. 2021 జూలైలో రూ.887 ఉన్న గ్యాస్ ధర ఇప్పుడు ఏకంగా రూ.1,100కి పెరిగింది. దీంతో దీన్ని కొనడం కూలీలు, వీధి వ్యాపారులు, ఇతర పేదలకు మరింత భారంగా మారుతోంది.
అడ్డూ అదుపు లేకుండా ధరల పెరుగుదల..
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పెట్రోలియం ఉత్పత్తుల ధరలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. దాని ప్రభావం మిగతా అన్నింటిమీదా పడుతోంది. ముఖ్యంగా వంటి గదిలోకి తెచ్చే సరుకుల చిట్టీ ధరలు చూస్తే గుండెకు దడ పుట్టేలా ఉంది.
భగ్గుమంటున్న వంటగ్యాస్
గతేడాది నుంచి ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్పై రూ.185 పెంచుకుంటూ వచ్చారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.1,100కి చేరింది. గతేడాది జూలై 2021లో రూ.887 ఉండేది. ఇప్పుడు రూ.1,100కి పెరగడంతో పేదలు గ్యాస్ కొనలేక ఇబ్బందులు పడుతున్నారు. కూలి చేసుకునే బతుకులు, చిరువ్యాపారుల జేబులు ఖాళీ అయిపోతున్నాయి. భార్యాభర్తలు కలిసి పనులకు పోయినా పెరిగిన ధరలకు కుటుంబాన్ని పోసించలేక పోతున్నారు.
గ్యాస్ బండ కాదది.. గుది బండ..
కేంద్ర ప్రభుత్వం ఇష్టమొచ్చిన విధంగా ధరలను పెంచడం వల్ల మాలాంటి నిరుపేదలకు ఖర్చులు మరింత భారమవుతున్నాయి. రోజువారీ పనులు చేసుకొని జీవించే మాకు ధరల పెంపు కష్టతరంగా ఉంది. ‘ఏం కొనేటట్టు లేదు… ఏం తినేటట్టు లేదు..’ అన్నట్లుగా ఉంది మా జీవితం. కూరగాయలు, ఉప్పు, పప్పు, నిత్యావసరాల ధరలన్నీ అమాంతం పెరిగిపోయాయి. గ్యాస్ ధరను చూస్తే.. ‘గ్యాస్ బండ కాదది.. గుదిబండ..’ అన్నట్లుగా ఉంది.
-భూపతి ధనలక్ష్మి, గృహిణి, రావికంపాడు, చండ్రుగొండ
వంట గ్యాస్ ధర ‘తగ్గేదేలే..’ అంటోంది..
వంట గదిలోకి తెచ్చుకునే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర ‘తగ్గేదేలే..’ అంటోంది. నెలలో రెండు మూడు సార్లు ధర పెరుగుతూనే ఉంది. గ్యాస్ సిలిండర్ కొనాలంటేనే భయంగా ఉంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ విధంగా గ్యాస్ ధరలను పెంచడం వల్ల మాలాంటి నిరుపేదలపై మరింత భారం పడుతోంది. గ్యాస్ సబ్సిడీ అన్నారు.. ఇప్పుడు అదీ లేదు. కూరగాయల ధరలూ అమాంతం పెరిగాయి.
–రామిశెట్టి చంద్రకళ, గృహిణి, కోయగూడెం