ఖమ్మం రూరల్, మే 18 : పద్మశ్రీ వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఖమ్మంరూరల్ మండల పరిధిలోని రెడ్డిపాలెం గ్రామానికి చెందిన వనజీవి రామయ్య మొక్కలకు నీరు పెట్టేందుకు బుధవారం తెల్లవారుజామున ఇంట్లో నుంచి బయటకు వచ్చి ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతున్నారు. ఈక్రమంలో ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో రామయ్య అక్కడికక్కడే సృహ తప్పి పడిపోయారు. గమనించిన కుటుంబసభ్యులు, గ్రామస్తులు రామయ్యను ఖమ్మంలోని ప్రభుత్వ జిల్లా ప్రధాన వైద్యశాలకు తరలించారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ఆయా గ్రామాల నాయకులు, ప్రజలు రామయ్య ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.
సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని వేడుకున్నారు. విషయం తెలుసుకున్న పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి వైద్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. రామయ్య కుటుంబ సభ్యులకు సైతం ఫోన్చేసిన ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆందోళనకు గురికావొద్దని భరోసా కల్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వనజీవి రామయ్యను టీఆర్ఎస్ పార్టీ మండ ల అధ్యక్షుడు బెల్లం వేణు, ఎంపీపీ ఉమ పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం కల్పించారు.
నిలకడగా రామయ్య ఆరోగ్యం..
ఖమ్మం సిటీ, మే 18 : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వనజీవి, పద్మశ్రీ దరిపెల్లి రామయ్య ఆరోగ్యం నిలకడగా ఉందని ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వైద్యులు తెలిపారు. రామయ్య ఆసుపత్రికి వచ్చిన తక్షణమే స్పందించిన వైద్యులు సిటీస్కాన్, ఎక్స్రే, ఈసీజీ, టుడీ ఎకో వంటి అన్నిరకాల పరీక్షలు నిర్వహించారు. కుడికాలు(మోకాలు కింద భాగంలో) ఎముక విరగడంతోపాటు చర్మం చిట్లి కండరం తెగిపోయింది. అదేవిధంగా తల పుర్రె భాగంలో స్వల్ప గాయమైనట్లు నిర్ధారించారు. కాలికి తగిలిన గాయాన్ని శుభ్రం చేసి కుట్లు వేసినట్లు దవాఖానా మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి.వెంకటేశ్వర్లు తెలిపారు. వైద్యసేవలు అందించిన వారిలో ఆర్థో సర్జన్ డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు(ఆర్ఎంవో), న్యూరో సర్జన్ డాక్టర్ చైతన్య, మత్తు వైద్యుడు రవికుమార్, ఐసీయూ ఇన్చార్జ్ డాక్టర్ రాజశేఖర్గౌడ్, కార్డియాలజీ డాక్టర్ సీతారాం ఉన్నారు.
రాష్ట్ర మంత్రుల ఆరా..
విషయం తెలిసిన వెంటనే మంత్రులు హరీశ్రావు, పువ్వాడ అజయ్కుమార్, ఎంపీలు సంతోష్కుమార్, నామా నాగేశ్వరరావు ఖమ్మం వైద్యులకు ఫోన్ చేశారు. వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. అవసరమైతే హైదరాబాద్కు తరలించాలని సూచించారు. రామయ్య కుటుంబ సభ్యులతో మాట్లా డి అన్నివిధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు.
రామయ్యకు పలువురి పరామర్శ..
రామయ్యను సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ పరామర్శించారు. వీరితోపాటు టీఆర్ఎస్ నగర మాజీ అధ్యక్షుడు, కార్పొరేటర్ కమర్తపు మురళి, సీనియర్ నాయకులు మడూరి సైదారావు, యువజన విభాగం నాయకులు మాటేటి కిరణ్, సాయి కిరణ్, బన్నీ ఉన్నారు.
కేసు నమోదు
వనజీవి రామయ్య రోడ్డు ప్రమాద ఘటనపై రూరల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని ఎం.వెంకటయపాలేనికి చెందిన నేరెళ్ల సమ్మయ్యగా గుర్తించారు. రామయ్య కుమారుడు దరిపల్లి కనకయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
మెరుగైన చికిత్స అందించాలి
వనజీవి రామయ్యకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వైద్యులను ఆదేశించారు. ఫోన్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య సమాచారం అందించాలని పేర్కొన్నారు.
–మంత్రి పువ్వాడ