సత్తుపల్లి, మే 18 : కేంద్రం తీరుతో ప్రజలు విసుగెత్తిపోతున్నారు. ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నది. దీనికితోడు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఆటోవాలాల జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఆటోలను జీవనాధారంగా చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్న తమ పరిస్థితి దయనీయంగా ఉందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగా ఛార్జీలు లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేసిన తమకు రోజుకూలీ కూడా గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. వచ్చే డబ్బులు డీజిల్కే సరిపోతున్నాయంటున్నారు. నెలవారీ ఫైనాన్స్ కట్టలేకపోతున్నామన్నారు.
సత్తుపల్లి పట్టణ, మండల పరిధిలో సుమారు 700లకు పైగా ఆటోలు నడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరలు పెంచుతుండడంతో బతుకుబండి డీలా పడింది. గతంలో లీటరు డీజిల్ రూ.65 ఉండగా.. ప్రస్తుతం రూ.110కు చేరింది. ఆటోలపై వచ్చే ఆదాయం సరిపోక, ఇల్లు గడవక, ఆటోల కిస్తీ కట్టలేక నలిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తక్షణమే స్పందించి పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
ధరలు తగ్గించాలి
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతుండడంతో ఆటోల నిర్వహణ భారంగా మారింది. కుటుంబపోషణ కష్టమవుతోంది. తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకోవాలి. – కాటినేని మల్లికార్జున్, ఆటోడ్రైవర్, తాళ్లపెంట
గిట్టుబాటు కావడం లేదు
కేంద్రం వైఖరితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొద్దంతా ఆటో నడిపినా ఫలితం దక్కడంలేదు. ఆటోలను నమ్ముకుని జీవిస్తున్న మాకు కూలీ డబ్బులు గిట్టుబాటు కావడంలేదు. నాలుగు కాసులు కూడా వెనుకేసుకోలేకపోతున్నాం. ఫైనాన్స్ సంస్థలకు కిస్తీలు కట్టలేకపోతున్నాం. కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి ఆదుకోవాలి.
– షేక్ బాజి, ఆటోడ్రైవర్, పెనుబల్లి