కొత్తగూడెం ఎడ్యుకేషన్/ఖమ్మం ఎడ్యుకేషన్, మే 18: ఈ నెల 6 నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు బుధవారంతో ముగిశాయి. విద్యార్థులు చివరి రోజు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు రాశారు. భద్రాద్రి జిల్లా నుంచి జనరల్- 7,190, వొకేషనల్- 1,594 కలిపి 8,784 మంది పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 8,046 మంది హాజరయ్యారు. భద్రాచలంలోని పరీక్షా కేంద్రాలను జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ సులోచనారాణి తనిఖీ చేశారు. ఖమ్మం జిల్లాలో చివరిరోజు 15,169 మంది విద్యార్థులకు 14,373 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పెనుబల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక విద్యార్థి మాల్ప్రాక్టీస్ చేస్తుండగా అతడిపై కేసు నమోదు చేసినట్లు డీఐఈవో రవిబాబు తెలిపారు.