కారేపల్లి రూరల్, సెప్టెంబర్ 4: కారేపల్లి మండలంలో మారుమూల పల్లె కొత్తకమలాపురం. గ్రామానికి చెందిన వారంతా వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పనులపైనే ఆధారపడి జీవిస్తారు. ఈ గ్రామానికి ఉన్న ఒక ప్రత్యేకత ఇటీవల అందరినీ ఆకర్షిస్తున్నది. గ్రామానికి చెందిన 30 మంది యువకులు ఉన్నత చదువులు చదువుకుని విదేశాల్లో స్థిరపడ్డారు. ‘అంతేకదా..’ అనుకుంటే పొరపాటే. ఇలా విదేశాల్లో స్థిరపడిన యువకులంతా ఆయా దేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా రాణిస్తూనే ‘వీ కేర్’ అనే వేదికను ఏర్పాటు చేసుకుని గ్రామానికి చెందిన విద్యార్థులకు చేయూతనిస్తున్నారు. పుట్టిన ఊరు, తాము చదువుకున్న పాఠశాలకు అండగా నిలుస్తున్నారు. రేపటి తరం గురించి ఆలోచించి విద్యార్థుల చదువు కోసం మూడేళ్ల నుంచి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఆరు దేశాల్లో ఉద్యోగాలు..
గ్రామ జనాభా 689 కాగా 272 కుటుంబాలు నివ సిస్తున్నాయి. 13 ఏండ్ల క్రితం ఒకరిద్దరు యువకులు ఉన్నత చదువులు చదుకుని ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాకు వెళ్లి సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా స్థిరపడ్డారు. వీరిని ఆదర్శంగా తీ సుకుని మరో 30 మంది విదేశాలకు వెళ్లారు. ప్రస్తుతం వీరు అమెరికా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, నెదర్లాండ్, కెనడా తదితర దేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. వీరిలో 19 మంది ఒక్కటై ఒక గ్రూప్ ఏర్పాటు చేయాలనుకున్నారు. వీరే మండెపుడి వెంకట్, వడ్డె ఉదయ్, వడ్డె సంపత్, రేపాల సురేశ్, రేపాల సతీశ్, దూదిపాళ్ల విజయ్, నున్నా వెంకటేశ్వర్లు, చాగంటి సతీశ్, చాగంటి శివ, చాగంటి కిరణ్, చాగంటి కార్తీక్, చాగంటి గోపి, చాగంటి లక్ష్మీనారాయణ, గమిడి హరీశ్, గమిడి అనీల్, గమిడి వేణు, కేతారపు రామకృష్ణ, నాగండ్ల శేఖర్, ఆళ్ల ఉపేందర్.
గ్రామాభివృద్ధి కోసం ‘వీ కేర్’
గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుకున్న 19 మంది ‘వీ కేర్’ పేరుతో 2019లో సంఘాన్ని ఏర్పాటు చేశారు. మొదటి ప్రాధాన్యతగా తాము చదువుకున్న పాఠశాలకు ఏదైనా చేయాలనుకున్నారు. విద్యార్థులు ఇంగ్లిష్ బాగా నేర్చుకుంటే భవిష్యత్తులో వారికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ప్రత్యేకంగా టీచర్ను నియమించాలనుకున్నారు. అందుకు యాజమాన్యాన్ని ఒప్పించారు. కరోనాకు ముందు పాఠశాలలు నడిచిన సమయంలో ఆ టీచర్కు నెలకు రూ.10 వేల చొప్పున గౌరవ వేతనం ఇచ్చారు. ఇటీవల క్లాసులు తిరిగి ప్రారంభమైన తర్వాత ఇంగ్లిష్ టీచర్ తిరిగి విద్యార్థులకు పాఠాలు చెప్పడం ప్రారంభించారు. అలాగే సంఘం సభ్యులు పాఠశాలకు బల్లలు సమకూర్చారు. సంఘం ప్రారంభమైన దగ్గర్నుంచి ప్రతి సంవత్సరం విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, యూనిఫాం, స్కూలు బ్యాగులు, బూట్లు, స్పోర్ట్స్ మెటీరియల్, ప్లేట్లు, గ్లాసులు అందజేస్తున్నారు. ఇప్పటివరకు ఇలా సుమారు రూ.5 లక్షల వరకు వెచ్చించారు. కరోనా కారణంగా చిన్న అవాంతరాలు వచ్చినప్పటికీ ఇకనుంచి గ్రామాభివృద్ధిపైనా దృష్టి సారిస్తామని యువకులు వెల్లడిస్తున్నారు.
మెరుగైన విద్య అందిస్తాం..
నేను 7వ తరగతి వరకు కొత్త కమలాపురం పాఠశాలలోనే చదివాను. సంఘం తరఫున గ్రామానికి చెందిన పిల్లలకు మెరుగైన ప్రాథమిక విద్య అందించేందుకు కృషి చేస్తున్నాం. మున్ముందు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే దిశగా పని చేస్తాం. ఉన్నత చదువులతోనే విద్యార్థుల భవిష్యత్తు బాగుటుందని నమ్మి ప్రణాళికలు రూపొందిస్తాం.
అందరికీ అండగా..
కొత్త కమలాపురాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేలా ‘వీ కేర్’ ప్రణాళికలు రూపొందిస్తున్నది. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతాం. నిరుపేద విద్యార్థులు చదువుకునేందుకు సభ్యులంతా సహకరిస్తున్నారు. మున్ముందు పేదరిక నిర్మూలనతో పాటు గ్రామాభివృద్ధికి కృషి చేస్తాం.