లక్ష్మీదేవిపల్లి, మే 10 : కర్ణుడికి కవచకుండలాల మాదిరిగా అడవికి బేస్ క్యాంప్లు రక్షణగా ఉపయోగపడుతున్నాయి. ఈ బేస్ క్యాంప్ల్లో ఉండే బృందాలు 24గంటలూ అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతూ ఎక్కడ ఎటువంటి ఘటనలు జరిగినా అప్రమత్తమవుతాయి. అడవిలో సహజంగా పెరిగే అటవీ సంపదను రక్షించడంతోపాటు జంతువులకు హానీ కలగకుండా చూసుకోవడం ఈ బృందాల బాధ్యత. అటవీ ప్రాంత పరిరక్షణ కోసం ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ బేస్ క్యాంప్లను జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేశారు. వీటిలో అటవీ సిబ్బందితోపాటు స్థానిక యువకులను భాగస్వాములను చేస్తున్నారు. దీంతో గిరిజన యువకులకు ఉపాధి అవకాశం దొరుకుతున్నది. వీరికి అడవిపై పూర్తి అవగాహన కలిగి ఉండడంతో అడవిలో తిరగడం సులువుగా ఉంటుంది. జిల్లావ్యాప్తంగా 6 డివిజన్లలో 25 బేస్ క్యాంప్లను ఏర్పాటు చేసింది అటవీశాఖ.
అడవుల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు
తెలంగాణ ప్రభుత్వం అడవుల అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నది. అడవుల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించగా, ఉన్న అడవిని రక్షించుకునేందుకు పలు చర్యలు చేపడుతున్నది. అటవీశాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు జిల్లా అటవీ అధికారులు అడవులను రక్షించుకునేందుకు, అడవిలో పెరిగే సహజ మొక్కలను పూర్తిస్థాయిలో పెరిగేలా చూడడంతోపాటు అటవీ సంపద, జంతువులను కంటికి రెప్పలా కాపాడేందుకు ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలతో ముందుకెళ్తున్నది. ఇక బేస్క్యాంప్ల ఏర్పాటుతో పూర్తిస్థాయిలో అడవి పరిరక్షణకు అవకాశం కలిగింది. అటవీ ప్రాంతంలో స్మగ్లింగ్ వంటి కార్యకలాపాలు, ప్రకృతి విపత్తులు జరగకుండా ఈ బృందాలు 24గంటలూ అప్రమత్తంగా ఉంటూ అడవిని కంటికి రెప్పలా పరిరక్షిస్తుంటాయి. అడవిలో అత్యంత సునిశితమైన ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా ఈ బేస్ క్యాంప్లను ఏర్పాటు చేశారు. ఇందులో అటవీ సిబ్బందితోపాటు స్థానిక గిరిజన యువకులు వలంటీర్లుగా అక్కడే నివాసం ఉంటారు. వీరు రాత్రింబవళ్లు గస్తీ కాస్తుంటారు. ప్రతిరోజు ఒక స్మగ్లింగ్ రూట్ను ఎంచుకుని ఈ బృందాలు కూంబింగ్ చేస్తాయి.
అడవిని కలియతిరుగుతూ
అడవిలో ఏర్పాటు చేసుకునే బేస్క్యాంప్లో నివాసం ఉండే బృందాలు అటవీ ప్రాంతం మొత్తం కలియ తిరుగుతుంటాయి. అడవిలో మంటలు వ్యాపించినప్పుడు వాటిని ఆర్పివేసి, సంబంధిత అటవీ సిబ్బందికి సమాచారం అందిస్తారు. అడవిలో వన్యప్రాణుల వేట కొనసాగకుండా, ఉచ్చులు, కరెంట్ తీగలు వేయకుండా చూస్తారు. వేటకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెడతారు. అడవిలో పశువుల మేతను నియంత్రిస్తారు. అత్యంత దట్టమైన అడవిలోకి పశువులు పోకుండా చూస్తారు. అక్రమ కలప రవాణా, అక్రమంగా చెట్లు నరకడం, అక్రమంగా ఇసుక, మట్టి, వంట చెరకు తీసుకెళ్లకుండా అడ్డుకుంటారు. అడవిలో ఉండే నీటి ఆవాసాలను శుభ్రం చేస్తూ అడవి జంతువులకు శుభ్రమైన నీరు అందేలా చూస్తారు. అడవిలో ఉండే వివిధ రకాల మొక్కల గింజలను సేకరించిన నర్సరీలకు పంపిస్తారు. అడవిలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు లేకుండా చూస్తారు. అటవీ ప్రాంతంలోని గడ్డి మైదానాల్లో గడ్డి విత్తనాలు సేకరించి నీటి మడుగుల వద్ద చల్లుతారు.అటవీ ప్రాంతాల్లో కెమెరా ట్రాప్లను ఏర్పాటు చేసి జంతువులు, స్మగ్లర్లు, వేటగాళ్ల కదలికలను గమనిస్తూ ఉంటారు.
బేస్ క్యాంప్లిక్కడే..
జిల్లాలోని పలు ప్రాంతాల్లో మొత్తం 25 బేస్ క్యాంప్లను ఏర్పాటు చేయగా.. ప్రధానంగా కొత్తగూడెం అటవీ డివిజన్లో రామవరం రేంజ్లో జగ్గారం, చండ్రుగొండ రేంజ్లో బెండాలపాడు, జూలూరుపాడు రేంజ్లో పాపకొల్లు, టేకులపల్లి రేంజ్లో జంగాలపల్లి, కొత్తగూడెం రేంజ్లో హేమచంద్రాపురం బేస్ క్యాంప్లను ఏర్పాటు చేశారు. బేస్క్యాంప్లకు అదనంగా స్ట్రైకింగ్ ఫోర్స్ను ఏర్పాటు చేసి వాహన సౌకర్యం కల్పించారు. ఒకవైపు అటవీ సిబ్బంది, మరోవైపు బేస్క్యాంప్లు, స్ట్రైకింగ్ ఫోర్స్తో మూడంచెల రక్షణ కవచం లాగా అడవుల రక్షణకు వ్యూహాలను పటిష్టంగా అమలు చేస్తున్నారు.
అడవికి రక్షణగా ఉంటున్నాం
అటవీ ప్రాంతంలో కలియ తిరుగుతూ రక్షణగా ఉంటున్నాం. అటవీ సంపదను రక్షించేందుకు మాకు అవకాశం వచ్చింది. అడవిలో స్మగ్లింగ్ చేయడం, వంట చెరకు, మట్టి వంటివి తరలించుకుపోవడం జరుగుతుంటాయి. అలాంటివి జరగకుండా మేము అడవి మొత్తం తిరుగుతూ పర్యవేక్షణ చేస్తుంటాం.
– శ్రీకాంత్, వలంటీర్, జగ్గారం బేస్ క్యాంప్
వేసవిలో సంరక్షణ అత్యవసరం
వేసవి కాలంలో అటవీ సంరక్షణకు చర్యలు చేపట్టడం అత్యవసరం. అడవిలో మొక్కలు, చెట్లు ఎండిపోయిన సమయంలో వేడిమికి మంటలు చెలరేగుతాయి. అటువంటి సమయంలో ఏమరుపాటుతో వ్యవహరిస్తే అడవి మొత్తం కార్చిచ్చుకు బలయ్యే అవకాశం ఉంటుంది. మేము బేస్క్యాంప్ల నుంచి గస్తీ తిరిగే సమయంలో చిన్నపాటి మంట కనిపించినా వెంటనే ఆర్పడం చేస్తుంటాం. మాకు వీలు కాకపోతే అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చి ఫైరింజన్ల ద్వారా ఆర్పించేస్తాం.
– మురళి, వలంటీర్, చండ్రుగొండ
బేస్ క్యాంప్లపై నిరంతర పర్యవేక్షణ
బేస్ క్యాంప్లున్న అటవీ ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ట్రాప్ కెమెరా ద్వారా బేస్ క్యాంప్లను పరిశీలిస్తుంటాం. వలంటీర్లు, అటవీశాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు అక్కడి సమాచారం మాకు చేరవేస్తుంటారు. వీటికి తగినట్లుగా మేము సూచనలు, సలహాలు ఇస్తుంటాం. బేస్క్యాంప్ల ద్వారా అడవి జంతువుల సంరక్షణ వీలవుతుంది. అలాగే జంతువుల కదలికలు తెలుసుకోవడం ద్వారా వాటికి అవసరమైన ఆహారం, నీటిని అందించగలుగుతాం. ఇక స్మగ్లింగ్, జంతువుల వేట వంటివి అరికట్టేందుకు వీలవుతుంది.
– అప్పయ్య, ఎఫ్డీవో, కొత్తగూడెం