భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, మే 10 : జిల్లాలో వానకాలం, యాసంగి సీజన్లలో దాదాపు 40 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నారు. తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి రావడం వల్ల రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. గడిచిన నాలుగేళ్ల నుంచి మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు తీవ్ర సమస్యగా మారింది. పంటను ఆశించి విపరీతమైన నష్టాన్ని కలిగిస్తోంది. ఈ పురుగు ఆశించిన పంట నుంచి కంకులు రావు. చెట్టు పూర్తిగా ఎండిపోయి చనిపోతుంది. రైతులు కత్తెర పురుగును సకాలంలో గుర్తించి సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని కేవీకే కో ఆర్డినేటర్ డాక్టర్ వీ లక్ష్మీనారాయణమ్మ చెబుతున్నారు.
కత్తెర పురుగు వివిధ దశలుగా రూపాంతం చెందుతూ వస్తుంది. తొలుత రెక్కల పురుగుగా ఉంటుంది. ఇది బూడిద గోధుమ రంగులో ఉంటుంది. ముందు రెక్కలు బూడిద రంగుగా, వెనక రెక్కలు పారదర్శకంగా ఉంటాయి. తరువాత లద్దె పురుగు ఆరు దశలను కలిగి ఉంటుంది. మొదటి దశలో లేత ఆకుపచ్చ వర్ణంలో ఉంటుంది. చివరి దశలో గోధుమ, బూడిద లేదా నలుపు రంగులోకి మారుతుంది. మూడో దశ లద్దె పురుగు. తలమీద ‘వై’ ఆకారపు మచ్చ ఉంటుంది. ఆఖరి ఖండితంపై నాలుగు నల్లటి చుక్కలు చతురస్రాకారంలో ఉంటాయి. మధ్యలో రోమం కలిగి ఉంటుంది.
నష్టం కలిగించే విధానం..
మొదట కత్తెర పురుగు జీవిత చక్రాన్ని గమనించాలి. ముందుగా రెక్కల పురుగు దశలో ఉంటుంది. ఈ రెక్కల పురుగు దశ లేత ఆకుల అడుగు భాగంలో 1,500-2,000 గుడ్లు పెడుతుంది. ఆ గుడ్ల నుంచి 3 – 5 రోజుల తర్వాత లార్వాలు గుంపులుగా ఆకుల మీద పత్రహరితాన్ని గోకి తింటూ రంధ్రాలు చేస్తాయి. ఈ రంధ్రాలు ఆకులపై నిలువుగా కనిపిస్తాయి. రెండో దశలో లద్దె పురుగులు కాండం మొవ్వలో చేరి లోపలి కాండాన్ని తీనేస్తాయి. శాఖీయ దశలో ఆశించినప్పుడు మొవ్వను పూర్తిగా తినేయడం వల్ల మొవ్వ కత్తిరించినట్లుగా కనిపిస్తుంది. పురుగు తిని విసర్జించిన మల పదార్థంతో మొవ్వంతా నిండి ఉంటుంది. మొవ్వ లోపల ఉన్న పూత కూడా నష్టపోయి కంకి తయారవదు.
జీవిత చక్రం..
వాతావరణ పరిస్థితులను బట్టి కత్తెర పురుగు జీవిత కాలం ఒకటి నుంచి మూడు నెలలు ఉంటుంది. తల్లి పురుగు జీవితకాలంలో 900 1,500 గుడ్లను పెడుతుంది. గుడ్ల సమూదాయం దూది వంటి పదార్థంతో కప్పబడి ఉంటుంది. గుడ్లు ఆకుపచ్చ, నలుపు, బూడిద రంగుల్లో ఉంటాయి. లద్దె పురుగులు పగటి పూట ఆకుల అడుగు భాగాన చేరి రాత్రిపూట పంటలపై దాడి చేస్తాయి. లద్దె పురుగులు కోశస్థ దశలో భూమిలోకి చేరతాయి. తల్లి రెక్కల పురుగులు తమ జీవిత కాలంలో 500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి.
సమగ్ర యాజమాన్య విధానం..
మొక్కజొన్నను వానకాలంలో జూన్ నెలలో, యాసంగిలో నవంబర్ నెలలో విత్తుకుంటే మంచిది. ఆలస్యంగా విత్తుకునే పంటలో పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కత్తెర పురుగు నివారణకు విత్తన శుద్ధి చేయాలి. సయాన్ ట్రినిలిప్రోల్ + థయోమిథాక్సమ్ 5ఎంఎల్ను కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. కంచె పంటగా లేదా అంతర పంటగా నేపియర్ గడ్డిని వేసుకుంటే ఉధృతి తగ్గుతుంది. పంట విత్తిన 15 నుంచి 20 రోజుల్లో వేప నూనె 1,500 పీపీఎంను 5 మిల్లీలీటర్లను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇలా చేస్తే తొలి దశలో తల్లిపురుగు గుడ్డు పెట్టకుండా నివారించవచ్చు.
రసాయన మందులతో నివారించొచ్చు..
పురుగును గమనించిన తొలి దశలో క్లోరాంట్రానిలిప్రోల్ 0.4 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోమేట్ 0.4 గ్రాములు లీటర్ నీటిలో కలిపి మొక్క సుడిలో పిచికారీ చేయాలి. ఇలా చేయడం వల్ల పురుగు ఉధృతి తగ్గిపోతుంది. ఇసుక + సున్నం (9:1), విషపు ఎరలను మొక్కల సుడుల్లో వేయాలి. లద్దె పురుగులను ఆకర్షించేందుకు విషపు ఎరలను సాయంత్రం వేళల్లో పొలంలో ఉంచాలి. విషపు ఎర తయారీకి 10 కిలోల తవుడు, 2 కిలోల బెల్లం కావాలి. ఆ రెండింటికీ కలిపి రాత్రంతా పులియబెట్టాలి. ఉదయం వేళ 500 మిల్లీలీటర్లు మోనోక్రోటోఫాస్ లేదా 300 గ్రాముల థయోడికార్బ్ మందును కలిపి ఉండలుగా చేయాలి. సాయంత్రం వేళ పొలంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల రైతులకు మేలు కలుగుతుంది. అధిక దిగుబడి సాధించేందుకు అవకాశం ఏర్పడుతుంది.
-డాక్టర్ లక్ష్మీనారాయణమ్మ, కేవీకే కో ఆర్డినేటర్