ఖమ్మం, మే 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చేలల్లో విత్తనాలు నాటి, పొలాల్లో నాట్లు వేసి వానదేవుడి జాడ కోసం ఆకాశం వైపు చూసే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం చరమగీతం పాడింది. గిరిజనుల వ్యవసాయాభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోంది. ఇందులో భాగంగా ‘గిరి వికాస్’ పథకాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా రైతులకు పంటలకు సాగు నీటిని అందించేందుకు పెద్దపీట వేసినట్లయింది. ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేపట్టే వారికి ఈ పథకం వరమైంది. ఐదు ఎకరాలకు పైబడిన సాగు భూమి ఉన్న రైతులకు ప్రభుత్వమే రాయితీపై బోర్వెల్స్ను అందిస్తోంది. విద్యుత్, మోటరు వంటి సౌకర్యాలు కల్పిస్తోంది. తక్కువ సాగు భూమి ఉన్న రైతులు ఉమ్మడిగా ఐదు ఎకరాలను చూపిస్తూ దరఖాస్తు చేసుకుంటే పథకం వర్తిస్తుంది. ఉమ్మడి జిల్లాకు ఇప్పటికే రూ.8.77 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ పథకం ద్వారా 959 ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తే ఉభయ జిల్లాల్లో మొత్తంగా సుమారు 2,626 ఎకరాల భూమి సాగులోకి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -ఖమ్మం, మే 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
గిరి పుత్రుల వ్యవసాయానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయూతను అందిస్తోంది. ఉపాధి హామీ పథకం ద్వారా గిరిజనుల వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వారి వ్యవసాయానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందకు ప్రత్యేక పథకానికి రూపకల్పన చేసింది. ఇప్పటికే వ్యవసాయ రంగానికి ఎంతో సహకారం అందిస్తున్న ప్రభుత్వం.. ఇప్పటికే రైతులకు రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేస్తోంది. దీంతోపాటు అనేక రాయితీలనూ అందిస్తోంది. దీంతోపాటు ప్రత్యేకంగా గిరిజన రైతులకు మరింత సహకారం అందించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా గిరివికాస్ పథకాన్ని అమలు చేస్తోంది.
పథకం అమలు ఇలా..
భద్రాద్రి జిల్లాలో గుర్తించిన గిరిజన మండలాలతోపాటు గిరిజన రైతులు ఉన్న మండలాల్లోనూ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రధానంగా వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులకు ఉపాధి హామీ జాబ్ కార్డు ఉండడంతోపాటు ఒకే ప్రాంతంలో ఇద్దరు రైతులకు కలిపి సుమారు 5 ఎకరాల భూమి ఉంటే ఈ పథకానికి అర్హులుగా పరిగణిస్తారు. ఇదే పద్ధతిలో జిల్లా వ్యాప్తంగా 12 మండలాల్లో గిరిజన రైతులకు గిరి వికాస పథకం అమలవుతోంది. జిల్లాకు మంజూరైన రూ.8.77 కోట్లతో జిల్లా వ్యాప్తంగా గిరిజన రైతులకు బోర్వెల్స్ వేస్తోంది. వాటికి విద్యుత్ లైన్, మోటార్ సౌకర్యం వంటి వాటిని ఉచితంగా కల్పిస్తోంది. ఈ పథకం ద్వారా రైతులకు సాగునీటి ఇబ్బందులు రాకుండా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఏ మండలాల్లో ఎన్నంటే..
ఏన్కూరు మండలంలో బోర్వెల్స్-107, కల్లూరు-2, కామేపల్లి-12, కొణిజర్ల-7, ముదిగొండ-1, పెనుబల్లి-7, ట్యూబ్వెల్స్-6, రఘునాథపాలెం-14, సింగరేణి-60, ట్యూబ్ వెల్స్-15, సత్తుపల్లిలో ట్యూబ్వెల్స్-34, వేంసూరు-1 కలిపి మొత్తంగా బోర్వెల్స్-211, ట్యూబ్వెల్స్- 55 వరకు వేశారు. దీని ద్వారా ఇప్పటికే రూ.3.01 కోట్లు ఖర్చు చేసి ఆయా ప్రాంతాల్లో పంటల సాగుకు సౌకర్యాలకు కల్పించారు. దీంతో 959 ఎకరాల విస్తీర్ణంలో భూమి సాగులోకి వచ్చింది. ఈ పథకం పూర్తిస్థాయిలో అమలు చేసి సాగు నీటి సౌకర్యం లేని భూములకు ఈ సదుపాయం కల్పిస్తే మొత్తంగా సుమారు 2,626 ఎకరాల భూమి సాగులోకి వస్తుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు.
వెంటనే బోర్లు వేశారు..
గిరిజనులకు ప్రభుత్వమే బోర్లు వేస్తుందని తెలిసి దరఖాస్తు చేసుకున్నాం. వెంటనే బోర్లు వేసి కరెంటు లైన్ కూడా వేశారు. గత ప్రభుత్వాల హయంలో చాలాసార్లు దరఖాస్తు చేసుకుంటే పట్టించుకున్న పాపానపోలే. కానీ ఇప్పుడు మాత్రం వెంటనే బోర్లు వేసి కరెంటు లైన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం.
– పద్దం కృష్ణకుమారి, భవన్నపాలెం
కేవలం రూ.10 ఖర్చు మాత్రమే
గిరిజన వికాస్ పథకం కోంస దరఖాస్తు, జిరాక్సులకు కేవలం రూ.10 మాత్రమే ఖర్చు పెట్టాం. ఆ పూర్తి చేసిన దరఖాస్తును గ్రీవెన్స్లో ఇవ్వడంతో హుటాహుటీన అధికారులు విచారణ చేపట్టడం, జియాలజిస్టులు బోరు పాయింట్లు పెట్టడం, బోర్లు వేయడం, కరెంటు లైన్లు వేయడం అంతా చకాచకా జరిగిపోయాయి. ఆ భూమిలోకి 11 కేవీ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి బోర్లకు త్రీఫేజ్ కరెంటు సౌకర్యం ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
–సోడె రాంబాబు, సర్పంచ్, భవన్నపాలెం, పెనుబల్లి మండలం
రెండు పంటలూ సాగవుతున్నాయి..
తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం చేపట్టిన గిరివికాస్ పథకం ద్వారా నాకున్న నాలుగు ఎకరాల్లో ప్రభుత్వమే ఉచితంగా బోరు వేసింది. దీనికి విద్యుత్ సౌకర్యం కల్పించి మోటారు ఏర్పాటు చేసింది. దీంతో నాలుగు ఎకరాల పొలంలో రెండెక రాలు పామాఆయిల్ పాం, రెండెకరాలు వరి సాగుచే స్తున్నా. గతంలో వర్షాలు వస్తేనే పంటలు పండేవి. కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్ ఇచ్చే 24 గంటల ఉచిత విద్యుత్తో ఏటా రెండు పంటలు సాగవుతున్నాయి.
– వేటగాని మీరమ్మ, రైతు, చంద్రాయపాలెం, సత్తుపల్లి మండలం