ఖమ్మం కల్చరల్, మే 2: అక్షయ అంటే తరుగుదల లేనిది అని అర్థం. వైశాఖ మాసం పౌర్ణమి ముందు వచ్చే తదియ రోహిణి నక్షత్రం కలిసిన మంగళవారం అక్షయ తృతీయ పండుగను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు జరుపుకోనున్నారు. ఈ రోజు ఏ శుభ కార్యక్రమం తలపెట్టినా విఘ్నాలు లేకుండా విజయవంతంగా సాగుతుందని నమ్మకం. ఈ రోజు ఏ వస్తువు కొనుగోలు చేసినా అభివృద్ధి చెందుతుందనేది నానుడి. బంగారం కొనుగోలు చేస్తే రెట్టింపు అవుతుందని ప్రజల నమ్మకం. అక్షయ పాత్రలో వస్తువులు ఉంచితే రెట్టింపు అయినట్లు ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే మరింత పెరుగుతుందనేది విశ్వాసం. దీంతో ప్రతి ఒక్కరికీ ఈ పండుగ నాడు బంగారం కొనడమంటే మక్కువ. ఐష్టెశ్వర్యాల అక్షయ తృతీయ నాడు గ్రాము బంగారమైన కొనాలని పసిడి ప్రియులు ఉవ్విళ్లూరుతుంటారు. ఈ రోజున లక్ష్మీ, సరస్వతి, గౌరీ రూపంగా భావించి పసిడికి మహిళలు పూజలు చేస్తారు. కాగా, బంగారం ధర ఏటా పెరుగుతూనే ఉన్నది. వారం రోజులుగా మాత్రం బంగారం ధరలో స్వల్ప తగ్గుదల ఏర్పడింది. గత ఏడాదితో పోలిస్తే మాత్రం అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల ప్రకారం బంగారం ధర పెద్ద ఎత్తున పెరిగింది. సోమవారం పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,200, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,490గా ఉంది. మంగళవారం నాటికి ఈ ధరలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉందని బంగారం వ్యాపారులు చెబుతున్నారు. బంగారం అమ్మకాలు పెంచుకోవడానికి అక్షయ తృతీయ పండుగ వ్యాపారులకు మంచి అవకాశం. పసిడి విక్రయ సంస్థలు కొనుగోళ్లపై పలు ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. అక్షయ తృతీయ ముందు రోజు సోమవారం కూడా పలు బంగారం ఆభరణాల షోరూములు క్రయవిక్రయాలతో కిటకిటలాడాయి.