భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 27 (నమస్తే తెలంగాణ):
‘టీఆర్ఎస్లో ఎవరి ఎజెండాలూ ఉండవు. అంతా సింగిల్ ఎజెండా. అదే గులాబీ జెండా. వచ్చే ఎన్నికల్లో భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా ఎగరడం పక్కా. పదవి రాగానే సంబురం కాదు.. కష్టపడి పనిచేసి సత్తా ఏంటో చూపిస్తా. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు రుణపడి ఉంటా.’ అంటున్నారు కొత్తగా టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడిగా ఎంపికైన రేగా కాంతారావు. పార్టీ అధినాయకుడు కేసీఆర్ ఏ నమ్మకంతో నాకు జిల్లా పదవి ఇచ్చారో.. అదే నమ్మకంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తా. ఇప్పటి వరకు అన్ని ఎన్నికల్లో భద్రాద్రి జిల్లాలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే మెజారిటీ స్థానాలు కైవసం చేసుకున్నారు. వచ్చే జనరల్ ఎన్నికలే నా ముందున్నాయి. వాటిలో కూడా ఐదు నియోజకవర్గాలో టీఆర్ఎస్ను గెలిపించుకునే సత్తా నాకుంది. నేను అప్ కమింగ్ లీడర్ను. ఇష్టమైన పదివిని కష్టమైనా చేసి చూపిస్తా. అంటున్నారాయన. టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న ఆయనతో ‘నమస్తే తెలంగాణ’ చిట్చాట్.
నమస్తే : ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పనిచేస్తున్నారు? మరి జిల్లా బాధ్యతలు ఎలా చేపడతారు?
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా : ఎమ్మెల్యేగా పనిచేసినప్పటి నుంచి యూత్ లీడర్గా ఉమ్మడి జిల్లాలో పనిచేశా. వాలీబాల్ ఆటగాడిగా యువతలో పరిచయాలు బాగా ఉన్నాయి. జిల్లా పదవి చేయాలని నాకు ఎప్పటి నుంచో కోరిక ఉంది. అలాంటి కోరికను పార్టీ అధినేత కేసీఆర్ తీర్చారు. ఆయన నమ్మకం వమ్ముచేయకుండా పట్టుదలతో పనిచేస్తా. జిల్లాకు మంచి పేరు తీసుకొస్తా. కిందిస్థాయి నుంచి వచ్చాను. రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తా.
నమస్తే : నియోజకవర్గాల బాధ్యుల సమన్వయం ఎలా ఉంటుంది?
రేగా : నాకు అందరితోనూ సాన్నిహిత్యం ఉంది. ఎవరితోనూ నాకు విభేదాలు లేవు. ఎక్కడా వర్గాల ముచ్చట ఉండదు. అందరిదీ ఒకే దారి. అదే గులాబీ దారి. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సహకారంతో ముందుకెళ్తా. ప్రతి కార్యకర్తను కాపాడుకుంటా. సమన్వయంతో పనిచేస్తా. నాకంటే సీనియర్లు ఉన్నా వారిపై నాకు ఎంతో గౌరవం ఉంది. అందరితో కలిసి ముందుకెళ్తా.
నమస్తే : వచ్చేవి జనరల్ ఎన్నికలు? మరి విజయావకాశాలు ఎలా ఉంటాయి?
రేగా : నాకు ఎన్నికలు కొత్త కాదు. జనరల్ ఎన్నికల్లో అధినేత కేసీఆర్ ఎంపిక చేసిన అభ్యర్థులు ఎవరైనా సరే.. వారి గెలుపు బాధ్యత నాదే. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లోనూ గులాబీ జెండా ఎగురవేయడం ఖాయం. ప్రభుత్వ పథకాలన్నింటినీ ప్రజలకు చేరువ చేస్తా.
నమస్తే : జిల్లా అధ్యక్ష పదవిని ఎందుకు అంత ఇష్టంగా భావిస్తున్నారు?
రేగా : ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పటి నుంచి జిల్లా యువజన నాయకుడిగా పనిచేశా. సేవా కార్యక్రమాలు చేయడం నాకు చాలా ఇష్టం. కాంగ్రెస్లో ఉన్నప్పుడు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినట్టే ఇచ్చిలాక్కున్నారు. కాంగ్రెస్ మోసం చేసింది. అప్పటి నుంచి జిల్లా పదవి చేయాలని మక్కువ.
నమస్తే :మీరు ముక్కుసూటి అని అంటారు?
రేగా : అవును. నేను ముక్కుసూటిగానే మాట్లాడుతాను. నిరంతరం ప్రజల్లో ఉంటాను. ప్రతి రోజూ ఏదో గిరిజన గ్రామం వెళ్తాను. నిన్నటి వరకు నేను నియోజకవర్గ బాధ్యుడినే. ఇప్పుడు జిల్లా అంతా తిరుగుతా. అందరి సమస్యలకూ పరిష్కారం చూపుతూ.
నమస్తే : జిల్లాలో పోడు సమస్య ఎక్కువ. మీ పోరాటం ఎంత వరకూ వచ్చింది?
రేగా : పోడు సమస్యపై ఎప్పుడూ రాజీ లేదు. గిరిజనులు సాగు చేసుకునే భూములపై వారికి హక్కు కల్పించాలి. చట్టంపై అవగాహన లేని వారు ఆవోఎఫ్ఆర్ రాష్ట్రం చేతిలో ఉందనుకుంటున్నారు. అటవీ హక్కుల చట్టాలన్నీ కేంద్రం చేతిలో ఉన్నాయి. అవి తెలియక కొందరు వ్యక్తులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. పోడు భూములకు తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు కూడా ఇస్తోంది. కేంద్రమే దోబూచులాడుతోంది.