రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రతి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునిక వైద్యానికి నిలయాలుగా మార్చింది. నిరుపేద రోగులకు అన్నిరకాల వసతులను అందుబాటులోకి తీసుకొచ్చింది. సర్కారు సహకారాన్ని అందిపుచ్చుకున్న రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మం జిల్లాలోని పెద్దాసుపత్రిని ఆధునిక వైద్యానికి కేరాఫ్గా తీర్చిదిద్దారు. అంతేకాదు, మధిర, సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం ఆసుపత్రుల స్థాయిని పెంచేలా కృషి చేశారు. – ఖమ్మం జనవరి 27, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
పెద్దాసుపత్రి ఓపీ వెయ్యి..
మెరుగైన వైద్యసేవలు అందుతుండడంతో ఖమ్మం పెద్దాసుపత్రికి జనం క్యూ కడుతున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించారు. రోగులతో వచ్చే సహాయకులు సేద తీరేందుకు ప్రత్యేక షెడ్లు, వారి పిల్లల కోసం ఆట పరికరాలు సమకూర్చారు. వైద్యసేవల కోసం ఆశ్రయిస్తున్న ప్రతిఒక్కరినీ ఇక్కడి వైద్యులు అక్కున చేర్చుకుంటున్నారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీ వెంకటేశ్వర్లు, ఆర్ఎంవో డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావుతోపాటు దాదాపు 70 మంది వైద్యులు, 160 మంది నర్సులు, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న టెక్నీషియన్స్, నాన్ టెక్నీషియన్స్, పాలనాపరమైన యంత్రాంగం కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది కలిపి సుమారు 800 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. రోజుకు 1000 మంది పైచిలుకు ఓపీ సేవలు నమోదవుతున్నాయి.
కార్పొరేట్ను తలదన్నే ఎంసీహెచ్..
ఖమ్మం సర్కారు దవాఖానలో రోగి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా.. బెడ్ కేటాయించి ప్రాణాలు నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చొరవతో ఐసీయూ వార్డు ఏర్పాటయ్యింది. రోడ్డు ప్రమాదాలు, పాము, తేలు కాటుకు గురవడం, విషం, పురుగుల మందు తాగిన వారందరికీ ఐసీయూ లో సేవలు అందిస్తున్నారు. అన్నిరకాల సాధారణ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తుండడం గమనార్హం. 2016లో పెద్దాసుపత్రికి అనుసంధానంగా ఏర్పాటైన మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం కార్పొరేట్ను తలదన్నుతోంది. ప్రస్తుతం ఎంసీహెచ్ భవనం ఆధునిక వసతుల కలబోతగా మొత్తం 150 బె డ్లతో గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు ప్రైవేట్లో ల భించని ఉత్తమ వైద్యసేవలు అందుతున్నాయి. ఇక్కడ రోజుకు 30 నుంచి40 ప్రసవాలు జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు.
పైసా ఖర్చు లేకుండా డయాలసిస్
జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో అనేక విభాగాల వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలు సాధారణంగా ఎదుర్కొనే ఆర్థోపెడిక్, చెస్ట్, ఈఎన్టీ, ఆఫ్తమాలజీ రంగాల్లో తిరుగులేదు. మెడికల్, జనరల్ సర్వీసులు, చర్మ సంబంధిత, సైకియాట్రిక్, టర్మనాలజీ తదితర విభాగాలకు సైతం ప్రత్యేక వైద్యనిఫుణులను నియమించారు. రోజుకు పదుల సంఖ్యలో ప్రజలు వచ్చి నాణ్యమైన సేవలు పొందుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సంరక్షణకు వెల్నెస్ సెంటర్ను ఇక్కడే ఏర్పాటు చేశారు. దవాఖానలోని బ్లడ్బ్యాంక్ ఎందరో అభాగ్యులకు, ఆపత్కాలంలో ఉన్నవారికి ప్రాణదానం చేస్తున్నది. అడుగడుగునా వ్యాధి నిర్ధారణ కేంద్రాలు (ల్యాబ్), ఎక్స్రే, కార్డియాలజీ, క్యాన్సర్ కేర్ సెంటర్లు రోగులను సురక్షితంగా ఇంటికి పంపిస్తున్నది. హాస్పిటల్ ప్రాంగణంలోని ఉచిత డయాలసిస్ సెంటర్ వందలాది మంది నిరుపేదలకు వరంగా మారింది. మొత్తం 20 బెడ్లతో మూడు ఫిఫ్టుల పద్ధతిన రోజుకు 60 నుంచి 70 మందికి నయాపైసా ఖర్చు లేకుండా డయాలసిస్ చేస్తున్నారు.
కొవిడ్ వైద్యానికి తిరుగులేదు
కరోనా, మొదటి, రెండు దశల్లో జిల్లాలో రోజుకు వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. భయంతో అనేక మంది ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఇల్లూ, ఒళ్లూ గుళ్ల చేసుకున్నారు. ఖమ్మంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాల కార్పొరేట్కు దీటుగా వైద్యసేవలు అందించింది. కొవిడ్ పేషెంట్స్ కోసమని 320 బెడ్లను ఏర్పాటు చేశారు. వాటిల్లో రెప్పపాటు ఆలస్యం లేకుండా దాదాపు 300 బెడ్లకు సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ వసతి కల్పించారు. బాధితులకు అవసరమైన రెమ్డెసివిర్ ఇంజక్షన్స్ అందుబాటులో ఉంచారు. ప్రైవేట్ దవాఖానల్లో రూ.లక్షలు ధారపోసి, ఆక్సిజన్ కొరత ఉందని, ఇంజక్షన్స్ లేవని చెప్పగానే అనేక మంది కరోనా రోగులు ఆఖరు నిమిషంలో పెద్దాసుపత్రిని ఆశ్రయించిన ఘటనలు కోకొల్లలు. వారి ప్రాణాలు నిలబెట్టేందుకు యావత్ యంత్రాంగం అహర్నిశలు శ్రమించింది. మొత్తం 9 మంది వైద్యులు, షిఫ్ట్కు 14 మంది చొప్పున మూడు షిఫ్ట్లకు 42 మంది నర్సులు, 36 మంది పేషంట్ కేర్లు, 36 మంది ఆయాలు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ వారి ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలందించారు. మంత్రి పువ్వాడ అజయ్ దవాఖానకు అదనపు ఆక్సీజన్ను సమకూర్చి దవాఖానను సేవల్లో నెంబర్వన్గా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించారు.
జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో..
ఖమ్మం జిల్లా వైద్యారోగ్యశాఖ పరిధిలో నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్స్, 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటికి అదనంగా తెలంగాణ ప్రభుత్వ సహకారంతో 86 పల్లె దవాఖానలు ఆవిర్భవించాయి. వాటి పరిధిలో అన్నివర్గాల వారికి అద్భుతమైన వైద్యసేవలు అందుతున్నాయి. చిన్నారులకు టీకాల దగ్గర్నుంచి మొదలు పెడితే అన్నిరకాల జబ్బులను గుర్తించడం, నెలవారీగా వారికి మందులు అందించే ప్రక్రియ క్రమం తప్పకుండా సాగుతోంది. గర్భం దాల్చిన నాటి నుంచి కాన్పు జరిగే వరకు మహిళలను కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన డయాగ్నస్టిక్ సెంటర్ను ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. దాదాపు 57 రకాల రక్త, మూత్ర పరీక్షలు నిర్వహిస్తున్నారు.
గర్భిణులు, చిన్నారులకు ప్రత్యేక వార్డులు
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో మొత్తం 505 పడకల సామర్థ్యమున్నది. రెండేళ్లుగా కొవిడ్ పునరావృతమవుతున్న దరిమిలా ప్రత్యేకించి 400 బెడ్స్ను కరోనా పేషెంట్స్కోసం సిద్ధం చేస్తున్నారు. వాటన్నింటికీ ఆక్సిజన్ సౌకర్యాన్ని కల్పించారు. వైరస్ సోకిన గర్భిణులకు -40, చిన్నారులకు-40 బెడ్స్ను ప్రత్యేక వార్డులో కేటాయించారు. ఈ నెలలో ఇప్పటి వరకు కొవిడ్ సోకిన 20 మంది గర్భిణులకు ప్రసవం జరిపించారు. వారిలో 14 సాధారణం, ఆరు సర్జరీ ద్వారా నిర్వహించారు. గత 2021 నుంచి నేటి వరకు కరోనా పేషెంట్స్ 68 మందికి పురుడు పోశారు. సాధారణం 40, సర్జరీలు 28 నమోదయ్యాయి.
ఆసుపత్రుల స్థాయి పెంపు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాల 300 పడకల సామర్థ్యంతో ఉండేది. జిల్లా యంత్రాంగం అనేకమార్లు ఆసుపత్రి స్థాయిని పెంచాలని ప్రతిపాదనలు పంపినా బుట్టదాఖలయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో ఖమ్మం జిల్లాలోని సర్కారు దవాఖానలకు మహర్దశ పట్టింది. అనతికాలంలోనే పెద్దాసుపత్రి స్థాయిని 500 పడకలకు పెంచారు. తాజాగా మధిర, సత్తుపల్లి సెంటర్స్ను 100 పడకల దవాఖానలుగా తీర్చిదిద్దారు. పెనుబల్లి, కల్లూరు, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల స్థాయిని 50 పడకల సామర్థ్యం కలిగిన వాటిగా ప్రకటించి ఆధునీకరిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుంది.