భద్రాచలం, ఏప్రిల్ 22: భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో శుక్రవారం సందర్భంగా అంతరాలయంలోని సీతారామలక్ష్మణమూర్తులను సర్వాంగ స్వర్ణ కవచాలతో అలంకరించారు. బెంగళూరు భక్తులు సమర్పించిన ఈ స్వర్ణకవచాలు అలంకరించడంతో మూలమూర్తులు మరింత రమణీయంగా భక్తులకు దర్శనమిచ్చారు.
తెల్లవారుజామున 4:30 గంటలకు అర్చక స్వాములు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. ఆరాధన, సేవాకాలం, ఆరగింపు, నిత్య పూజలు, నిత్య హోమాలు జరిపారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను బేడా మండపంలో ఉంచి శాస్ర్తోక్తంగా నిత్యకల్యాణం నిర్వహించారు. కల్యాణంలో పాల్గొన్న దాతలకు స్వామివారి ప్రసాదాలను, శేష వస్ర్తాలను అందజేశారు.