భూముల విలువ ధరను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 8 ఏళ్లుగా భూముల విలువలు పెరగకపోవడంతోపాటు రిజిస్ట్రేషన్ చార్జీలూ పాతవే కొనసాగుతున్నాయి. దీంతో పెరిగిన భూముల ధరలను పరిగణనలోకి తీసుకుని రిజిస్ట్రేషన్ చార్జీలను, భూముల విలువలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అమలుకానున్నాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భూములకు మరింత విలువతోపాటు రిజిస్ట్రేషన్ శాఖకు ఆదాయం పెరగనున్నది. ఇప్పటివరకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కలిపి 6 శాతం రిజిస్ట్రేషన్ ఫీజుగా వసూలు చేస్తుండగా.. ఇక నుంచి 7.5 శాతానికి పెంచాలని నిర్ణయించింది. దీంతో ఖమ్మం జిల్లాలోని 11 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి ప్రభుత్వానికి ఇప్పటి వరకు సంవత్సరానికి రూ.150 కోట్ల ఆదాయం వస్తుంది. పెరిగిన భూముల విలువ సవరించిన రిజిస్ట్రేషన్ చార్జీల పెరగడంతో ఈ ఆదాయం రెట్టింపు కానుంది. ఏడాదికి దాదాపు రూ.300 కోట్ల ఆదాయం సమకూరనున్నట్లు రిజిస్ట్రేషన్ అధికారులు భావిస్తున్నారు. పెరిగిన భూముల విలువతో రైతులకు అత్యంత ప్రయోజనం చేకూరనుంది. భూముల రిజిస్ట్రేషన్ విలువ తక్కువగా ఉండడంతో బ్యాంకులు రుణాలు మంజూరు చేసే విషయంలో వీటినే ప్రాతిపదికగా తీసుకోవడంతో భూములకు మార్కెట్ ధర అత్యధికంగా ఉన్న రైతులు ఇప్పటి వరకు తమకు అవసరమైనంత రుణాన్ని పొందలేని పరిస్థితి ఉండేది. ప్రభుత్వం భూముల విలువ పెంచడంతో రుణపరిమితి సైతం పెరగనుంది. ప్రభుత్వం వివిధ అవసరాల కోసం రైతుల నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూములను సేకరించే సమయంలో ఇచ్చే నష్ట పరిహారం సైతం భూముల విలువ కారణంగా మరింత పెరిగే అవకాశం ఉంది.
ధరలు ఇలా..
ప్రభుత్వం సవరించిన భూముల విలువ ప్రకారం ఖమ్మంలోని వైరా రోడ్డులో ప్రస్తుతం రిజిస్ట్రేషన్ విలువ గజానికి రూ.30 వేలు ఉండగా రూ.39 వేలు కానున్నది. అపార్ట్మెంట్ల భూముల విలువ సైతం ప్రభుత్వం పెంచింది. ఖమ్మం జిల్లాలోని సింగరేణి, కామేపల్లి, ఏన్కూరుల్లో ఇప్పటి వరకు గజం ధర రూ.150లోపే ఉండగా కనీసం గజం ధరను రూ.200లు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయా మండలాల్లోని భూముల విలువను సవరిస్తూ తీసుకున్న నిర్ణయం రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు జిల్లాలోని అనేక గ్రామాల్లో గజం ధర రూ.300 ఉండగా ఈ నెల 22వ తేదీ నుంచి గజం ధర రూ.500లు కానుంది. ఏన్కూరు పట్టణంలో రిజిస్ట్రేషన్ విలువ ప్రస్తుతం గజానికి రూ.2,500లు ఉండగా సవరించిన ధరల ప్రకారం రూ.3,500లుగా మారనుంది.
ఖమ్మం అర్బన్, రఘునాథపాలెంలో 50శాతానికిపైగా
ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాల్లో భూముల విలువలు 50శాతానికి పైగా పెరిగాయి. పెరిగిన భూముల విలువలు, రిజిస్ట్రేషన్ ఫీజులు ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి రానుండడంతో రెండు రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భూ రిజిస్ట్రేషన్ల సంఖ్య, వ్యవసాయేతర ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయించుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. సాధారణంగా రెండేళ్లకొకసారి భూముల విలువలు పెంచాల్సి ఉన్నా.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ఏడేళ్లుగా ఈ విలువలను సవరించలేదు. భూముల విలువ పెంపుదలకు సంబంధించి రిజిస్ట్రేషన్శాఖ చేసిన పలు ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. కమిటీల అభిప్రాయాన్ని తీసుకుని ప్రభుత్వం భూముల విలువలు పెంచింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యవసాయ భూముల విలువను అత్యధికంగా 50శాతం వరకు పెంచగా అభివృద్ధి చెందిన వ్యవసాయ భూముల విలువను 40శాతం వరకు పెంచారు.
రేపటి నుంచి కొత్త చార్జీలు అమలు..
జిల్లాలో పెరిగిన భూముల విలువ, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు గురువారం నుంచి అమలులోకి రానున్నది. సవరించిన భూముల విలువకు సంబంధించి, రిజిస్ట్రేషన్ చార్జీలకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే కంప్యూటర్లో క్రోడీకరించే పని ప్రారంభమైంది. భూముల విలువ పెరగడంతో రైతులకు రుణపరిమితి పెరిగే అవకాశం లభించింది. – రవీందర్, జాయింట్ సబ్రిజిస్ట్రార్, ఖమ్మం