భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రపతి మన జిల్లాకు రావడం గర్వకారణమని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలం పర్యటన, ముక్కోటి ఏర్పాట్లు, గర్భిణులకు న్యూట్రీ కిట్ల పంపిణీ తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 28వ తేదీన దేశ ప్రథమ పౌరురాలు మన జిల్లాకు వస్తున్నారని, మన జిల్లాకు ఇది తీయని గుర్తుగా మిగిలిపోతుందని అన్నారు. రాష్ట్రపతి పర్యటనలో భాగంగా కేటాయించిన విధుల్లో ఎలాంటి లోటుపాట్లు రాకుండా అంకితభావంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
భద్రాచలం, డిసెంబర్ 19 : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారిని దర్శించుకునేందుకు ఈ నెల 28వ తేదీన భద్రాచలం రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, ఎస్పీ వినీత్ సోమవారం పరిశీలించారు. తొలుత బీపీఎల్ గెస్ట్హౌస్, అనంతరం పాఠశాల ఆవరణలోని హెలీప్యాడ్ను పరిశీలించారు. దేవస్థానం పరిసరాలు, చలువ పందిళ్లకు సంబంధించిన ఏర్పాట్లను చూసిన వారు చుట్టూ కార్పెట్లు వేయించాలని, చలువ పందిళ్ల షామియానాను అందంగా అమర్చాలని, బారికేడ్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రపతి వెంట వచ్చే సెక్యూరిటీ అధికారుల సూచనల మేరకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. వారితోపాటు ఏఎస్పీ రోహిత్రాజ్, అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, ఆర్డీవో రత్న కళ్యాణి, ఈవో బానోత్ శివాజీ తదితరులు పాల్గొన్నారు.