అశ్వారావుపేట, డిసెంబర్ 19:విద్యా శాఖలో పాఠశాలలు, ఎమ్మార్సీల నిర్వహణ నిధులను ఇక నుంచి ఆన్లైన్ పద్ధతిలో చెల్లించేలా తెలంగాణ సర్కారు కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు చెల్లింపుల్లో అమలైన పాత పద్ధతికి స్వస్తి పలికింది. నిర్వహణ నిధుల ఖర్చు పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ (పీఎఫ్ఎంఎస్) విధానానికి శ్రీకారం చుట్టింది. నూతన విధానంపై కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు శిక్షణ కూడా ఇచ్చింది. జిల్లాలోని పాఠశాలలు, ఎమ్మార్సీలు, సీఆర్సీల నిర్వహణకు రూ.9.76 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను పాత పద్ధతిలో కాకుండా పీఎఫ్ఎంఎస్ విధానంలో వెచ్చించాల్సి ఉంటుంది. భద్రాద్రి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, మండల రీసోర్స్ సెంటర్ (మండల విద్యా వనరుల కేంద్రం), కాంప్లెక్స్ రీసోర్స్ సెంటర్ (సీఆర్సీ) నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిధులను విడుదల చేస్తుంది.
పాత విధానంలో ఎస్ఎంసీ ఖాతా, క్లస్టర్ హెచ్ఎం ఖాతా, ఎంఈవో ఖాతాల్లో నిధులు జమ అయ్యేవి. వీటిని ఎస్ఎంసీ చైర్మన్, హెచ్ఎంలు కలిసి ఖర్చు చేసేవారు. పనులు చేసిన వ్యక్తులకు చెక్కుల రూపంలో చెల్లింపులు జరిపారు. ఇకపై నిర్వహణ నిధుల ఖర్చు ఇలా ఉండదు. కొత్తగా అమలులోకి వచ్చిన పీఎఫ్ఎంఎస్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. మంజూరైన నిర్వహణ నిధులు విద్యాశాఖ వద్దనే ఉంటాయి. చేసిన పనులు, ఖర్చు చేయాల్సిన నిధులకు సంబంధించి బిల్లులను పీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేయాలి. ఇందులో పొందపరిచిన బిల్లుల ఆధారంగా పనులు చేసిన కాంట్రాక్టర్, ఎస్ఎంసీ చైర్మన్, సామగ్రి కొనుగోలు చేసి దుకాణ యజమాని బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ అవుతాయి. పాఠశాల అవసరాలకు ఏదైనా వస్తువు కొనుగోలు చేసినా, పనులు చేసినా సదరు కాంట్రాక్టర్కు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో పొందవరచాలి. పీఎఫ్ఎంఎస్ విధానంతో నిర్వహణ నిధులు పక్కదారి పట్టకుండా ఉంటాయని, నిధుల ఖర్చులో పారదర్శకత ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
జిల్లాకు రూ.9.76 కోట్లు విడుదల..
నిర్వహణ నిధుల కింద రూ.9.76 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు విడుదల చేసింది. పాఠశాలలు, ఎమ్మార్సీలు, సీఆర్సీలు, క్రీడల వారీగా నిధులను కేటాయించింది. జిల్లా వ్యాప్తంగా 23 ఎమ్మార్సీలకు మొదటి విడతలో రూ.8,80,000, 90 సీఆర్సీలకు రూ.14,85, 000, 1,428 పాఠశాలలకు మొదటి విడతలో రూ.1,43,67,184, రెండో విడతలో రూ.1,43, 67,184, క్రీడల నిర్వహణకు రెండు విడతల్లో రూ.6,65,50,000 చొప్పున మొత్తం రూ.9,76, 49,368 విడుదల చేసింది. ఈ నిధులన్నింటినీ పీఎఫ్ఎంఎస్ విధానంలోనే ఖర్చు చేయాల్సి ఉంది. ఆన్లైన్ చెల్లింపు పద్ధతిపై పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇచ్చింది.
సమకూరనున్న వసతులు..
పాఠశాలలకు ప్రభుత్వం విడుదల చేస్తున్న నిర్వహణ నిధులు విద్యార్థుల అవసరాలు, పాఠశాలల నిర్వహణకు ఉపయోగపడుతున్నాయి. ఈ నిధులతో ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు అవసరమైన అటెండెన్స్ రిజిస్టర్లు, చాక్ పీస్లు, పరీక్షల మెటేరియల్, పాఠ్యపుస్తకాల రవాణ, బోధనోపకరణాల తయారీ, పారిశుధ్య నిర్వహణ, పాఠశాలలకు అవసరమైన పనుల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నిధులతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, ఎమ్మార్సీలు, సీఆర్సీలు నిర్వహణ సులభతరం అవుతుంది.
నిధుల కేటాయింపు ఇలా..
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. 30 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు ఏడాదికి రూ.10 వేలు, 31 నుంచి 100 మంది విద్యార్థులున్న పాఠశాలలకు రూ.25 వేలు, 101 నుంచి 150 మంది విద్యార్థులున్న పాఠశాలలకు రూ.50 వేలు, 251 నుంచి 1000 మంది విద్యార్థులున్న పాఠశాలలకు రూ.75 వేలు, 1001 మందికిపైగా విద్యార్థులున్న పాఠశాలలకు రూ.లక్ష చొప్పున నిధులు అందిస్తుంది. ఈ నిధులను పాఠశాలల నిర్వహణకు ప్రధానోపాధ్యాయులు వినియోగిస్తున్నారు.
నిధుల ఖర్చులో పారదర్శకత..
నిర్వహణ నిధులను ఇకపై పీఎఫ్ఎంఎస్ విధానంలో చెల్లిస్తాం. ఈ విధానం వల్ల నిధుల ఖర్చులో పారదర్శకత ఉంటుంది. గతంలో చెక్కులు జారీ చేశాం. ఇక నుంచి పీఎఫ్ఎంఎస్ విధానంలో చేసిన పనులకు బిల్లులను అప్లోడ్ చేసి ఆన్లైన్ ద్వారా సదరు కాంట్రాక్టర్ లేదా సదరు దుకాణ యజమానులకు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తాం. పీఎఫ్ఎంఎస్ విధానంలో ఆన్లైన్ చెల్లింపులపై ఇప్పటికే ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది.
–పి.కృష్ణయ్య, ఎంఈవో, అశ్వారావుపేట