ఖమ్మం, డిసెంబర్ 19: ఖమ్మం పాత బస్టాండ్ మళ్లీ ప్రజల అందుబాటులోకి వచ్చింది. కొత్త బస్టాండ్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ పాత బస్టాండ్ నిరుపయోగంగా ఉంది. దీంతో అది అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పందించారు. పాత బస్టాండ్ను కూడా వినియోగంలోకి తీసుకురావాలని ఆర్టీసీ అదికారులను ఆదేశించారు. దీంతో, పాత బస్టాండును సిటీ బస్టాండుగా ఆర్టీసీ అధికారులు ఉపయోగంలోకి తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి పల్లె వెలుగు, సిటీ సర్వీసులు ఆదివారం ప్రారంభమయ్యాయి. జిల్లా సర్వీసుల కోసం కొత్త బస్టాండుకు వెళ్లాల్సిందే.
‘ముల్లుకర్ర’ పట్టుకుని కాపాడిన మంత్రి
కొత్త బస్టాండ్ ప్రారంభమైన తర్వాత, పాత బస్టాండును కబ్జా చేస్తారని, స్వప్రయోజనాలకు వినియోగిస్తారని.. ఇలా విపక్షాలు రక రకాలుగా అనుమానాలు వ్యక్తం చేశాయి, ఆరోపణలు గుప్పించాయి. వీటిపై అదే స్థాయిలో మంత్రి అజయ్కుమార్ దీటుగా సమాధానమిచ్చారు. “ప్రభుత్వ స్థలాన్ని కాపాడేందుకు మల్లుకర్ర పట్టుకుని కాపలా కాస్తా. ఖమ్మం పాత బస్టాండ్ స్థలాన్ని కాపాడుతా. దానిని ప్రజావసరాల కోసమే వినియోగిస్తాం” అని విస్పష్టంగా ప్రకటించారు. చెప్పినట్లుగానే పాత బస్టాండును సిటీ బస్టాండుగా మార్చి మళ్లీ ఉపయోగంలోకి తెచ్చారు. దీనిపై వ్యాపారులు, ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
కొందరు వ్యాపారులు మంత్రి పువ్వాడను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పాత బస్టాండ్ మూతపడినప్పటి నుంచి తమ వ్యాపారాలు తగ్గాయని చెప్పారు. సిటీ బస్టాండ్ ప్రారంభంతో ప్రజలకు రవాణా ఇబ్బందులు తగ్గుతాయని, తమ వ్యాపారాలు కూడా ఊపందుకుంటాయని సంతోషం వ్యక్తం చేశారు. “మీలాంటి వ్యాపారులతోపాటు ఖమ్మం నగరం, చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలతోపాటు జిల్లాలోని ఇతర దూర ప్రాంతాల నుంచి ఖమ్మం నగరం లోపలికి రావాలనుకునే ప్రతి ఒక్కరికీ (రోగులు, విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు తదితరులు) ఉపయోగపడేలా పాత బస్టాండును సిటీ బస్టాండుగా పునఃప్రారంభించాం” అని మంత్రి అజయ్కుమార్ వివరించారు.
మంత్రికి రుణపడి ఉంటాం
పాత బస్టాండ్ నుంచి సర్వీసులు నిలిపివేసిన రోజు నుంచి వ్యాపారాలు లేక అనేక కష్టాలు పడుతున్నాం. పాత బస్టాండును సిటీ బస్టాండుగా మార్చడంతో మా కష్టాలు గట్టెక్కుతాయని ఆశ పడుతున్నాం. మంత్రి గారికి రుణపడి ఉంటాం
– సలీమ్, పూల వ్యాపారి