అశ్వారావుపేట, డిసెంబర్ 19: క్రైస్తవులు ఘనంగా జరుపుకొనే ఏకైక పండుగ క్రిస్మస్. వారికి రాష్ట్రప్రభుత్వం ఏటా క్రిస్మస్ సమయంలో గిఫ్ట్ ప్యాకెట్లు అందజేస్తున్నది. దీనిలో భాగంగా ఈసారి ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున గిఫ్ట్లు మంజూరయ్యాయి. ఎమ్మెల్యేలు నిరుపేదలకు కానుకలు అందజేస్తున్నారు. ఇప్పటికే భద్రాచలం నియోజకవర్గంలో పంపిణీ ప్రక్రియ పూర్తయింది. మరికొన్ని రోజుల్లో మిగతా నియోజకవర్గాల్లోనూ పంపిణీ పూర్తి కానున్నది. అలాగే సెమీ క్రిస్మస్ నిర్వహణకు ఒక్కో నియోజకవర్గానికి రూ.2 లక్షల చొప్పున 10 నియోజకవర్గాలకు కలిపి రూ.20 లక్షల నిధులు విడుదలయ్యాయి.
క్రైస్తవుల ప్రధాన పండుగ అయిన క్రిస్మస్ రోజున పేద క్రైస్తవులకు సర్కారు అం దించే గిఫ్ట్ ప్యాకెట్లు నియోజకవర్గాలకు చేరుకున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా లోని 10 నియోజకవర్గాలకు గాను ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున 10 వేల గిఫ్ట్ ప్యాకెట్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలు క్రిస్మస్ కానుకల పంపిణీ ప్రక్రి యను ఇప్పటికే ప్రారంభించా రు. అదే విధంగా ఈస్ట్ ఫెస్ట్ నిర్వహణకు నియోజకవర్గానికి రూ.2 లక్షల చొప్పున 10 నియోజకవర్గాలకు కలిపి రూ.20 లక్షల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సర్వమతాలకూ సమ ప్రాధాన్యమిస్తున్న సీఎం కేసీఆర్.. అన్ని పండుగలకూ సముచిత స్థానం కల్పిస్తున్నారు. హిందువులకు బతుకమ్మ చీరెలు, ముస్లింలకు రంజాన్ తోఫాలు అందిస్తున్నట్లుగానే క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను పంపిణీ చేస్తూ అందరికీ సమాన గౌరవం ఇస్తున్నారు.
ఈ నెల 25న క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పేద క్రైస్తవులకు క్రిస్మస్ కానుక అందించేందుకు నియోజకవర్గానికి వెయ్యి చొప్పున గిఫ్ట్ ప్యాకెట్లు పంపింది. తెల్లరేషన్ కార్డు ఉన్న సుమారు 10 వేల మంది పేద క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాకెట్లు అందనున్నాయి. వీటిని జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారులు జిల్లా కేంద్రాల నుంచి నియోజకవర్గాలకు చేరవేశారు. నియోజకవర్గ కేంద్రాల నుంచి మండలాల వారీగా అధికారులు పంపిణీకి సిద్ధం చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా అధికారులు దుస్తుల పంపిణీతోపాటు విందు భోజనాలకూ ఏర్పాట్లు చేస్తున్నారు. మండలాల వారీగా తహసీల్దార్లు ప్రత్యేక అధికారులుగా ఉండి గిఫ్టులు పంపిణీ చేసి విందు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లోని చర్చీల పాస్టర్లతో తహసీల్దార్లు సమావేశాలు ఏర్పాటు చేసి అర్హులైన పేద క్రైస్తవులను ఎంపిక చేశారు. ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి గిఫ్ట్ ప్యాకెట్లను ఎమ్మెల్యేల చేతుల మీదుగా పంపిణీ చేయిస్తున్నారు. ఒక్కో గిఫ్ట్ ప్యాకెట్లో చీరె, పంజాబీ డ్రెస్ మెటీరియల్తోపాటు ప్యాంట్, షర్ట్ ఉంటాయి. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం నుంచి అందుతున్న గిఫ్ట్ ప్యాకెట్లతో పేద క్రైస్తవులు ఆనందంగా పండుగ జరుపు కోనున్నారు.
పేద క్రైస్తవులకు దేవుడు కేసీఆర్..
పేద క్రైస్తవులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడిగా నిలుస్తున్నారు. పండుగ రోజున పేద క్రైస్తవులు కూ డా సంతోషంగా ఉండేందుకు సీఎం కేసీఆర్ వారికి క్రిస్మస్ కానుకలు అందిస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో అన్ని వర్గాల పేదలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ పండుగలను సరిగా జరుపుకోలేకపోయేవారు. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని మతాల్లోని పేదలను గుర్తించి పండుగ రోజున వారికి దుస్తులు, కానుకలు అందిస్తున్నారు. పైగా ఈస్ట్ ఫెస్ట్ కోసం నగదూ మంజూరు చేస్తున్నారు.
–టీ.కన్నయ్య, చర్చీ పాస్టర్, చండ్రుగొండ
త్వరలోనే పంపిణీ చేస్తా..
క్రిస్మస్ సందర్భంగా పేద క్రైస్తవులకు టీఆర్ఎస్ ప్రభుత్వం పంపిన క్రిస్మస్ కానుకలను అతి త్వరలోనే లబ్ధిదారులకు పంపిణీ చేస్తాం. గ్రామాల్లో పంపిణీకి ఎమ్మెల్యే అనుమతితో తేదీలను ఖరారు చేస్తాం. అశ్వారావుపేట నియోజకవర్గానికి వెయ్యి గిఫ్ట్ ప్యాకెట్లు మంజూరయ్యాయి. వీటిని మండలాల వారీగా పంపిణికి సిద్ధం చేశాం. ఇప్పటికే పాస్టర్లతో సమావేశాలు నిర్వహించి అర్హులైన పేద క్రైస్తవులను ఎంపిక చేశాం. వారందరికీ కానుకలు అందిస్తాం.
–చల్లా ప్రసాద్, తహసీల్దార్, అశ్వారావుపేట